ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Monday, February 20, 2012

గల్ఫ్ గాయాలు - కనిపించని కన్నీళ్ళు


గల్ఫ్ గాయాలు - కనిపించని కన్నీళ్ళు
జీవితాంతం తోడు నీడై.. నడిపించాల్సిన భర్త.. ఉపాధి కోసం వలసెళ్లిపోయి.. ఉండో లేడో తెలియని అయోమయంలో బతుకులీడుస్తున్న వారి బాధ వర్ణనాతీతం. దినదిన గండం నూరేళ్లుగా గడుపుతున్న పిల్లా పాపల దైన్యం చూస్తే కళ్లు చెమ్మగిల్లక మానవు. కళ్లలో వత్తులేసుకొని తమ కంటిదీపం కోసం ఎదురు చూస్తూ మూగగా రోదిస్తున్న ఆ నిరీక్షకులను కదిపితే కన్నీళ్ల కడవలు ఒలికాయి. తమ గోడెవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితులో ఉన్న ఆ అభాగ్యులను హెచ్ఎంటీవీ పలకరించింది. గల్ఫ్ లో గల్లంతై గుండె గాయాలను మిగిల్చిన మూగ వేదన పై ప్రత్యేక కథనం.
ఇక్కడ కనిపిస్తున్న ఈ అభాగ్యులు సంవత్సరాల తరబడి కళ్లలో కన్నీటి సంద్రాలను దాచుకొని... పంటిబిగువున కాలం వెళ్లదీస్తున్నారు. రెక్కాడినా కానీ డొక్కాడని పరిస్థితి ఒకపక్క... కాసులు తెస్తానని ఖండాంతరాలు దాటెళ్లిన తోడు జాడ దొరకని బెంగ మరోపక్క... ఎదిగిన పిల్లల చదువులు ఎదలపై బండలవుతున్న బరువు మరోపక్క.. ఇన్ని కష్టాల నడుమ.. ఊరడించని నేతల మాటలు నీటి మూటలై వెక్కిరిస్తుంటే.. ఉండో లేడో తెలియని దైవాన్ని కొలుస్తూ.. తమ ఇంటిదిక్కు తిరిగి ఇంటికి రావాలని వేడుకుంటున్నారు.


ఒకటి కాదు. రెండు కాదు. వలస వెళ్లి తిరిగిరాని కుంటుంబాలు ఎన్నో.. అందరికీ అదే మోసం.. అన్ని కథలకూ ఒకే ప్రారంభం.. ఒకే ముగింపు. ఆర్ధికంగా చితికిపోయి ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకోవాలని. గల్ఫ్ ఏడారికి పయనమై తమ అముల్యమైన జీవితాన్ని తాకట్టు పెట్టి పోయారు. వెళ్లిన వారి వీడ్కోలే కడ చూపుగా మారింది. తమను నమ్ముకున్న వారి జీవితాలలో వెలుగు చుడాలని వెళ్లారు. కానీ వారికి పలుకే కరువయింది. వారికే ఏళ్ల తరబడి ఎదురు చూసినా ఫలితం లేదు... కనీసం బ్రతికి ఉన్నారా లేదో తెలియదు. కుటుంబ సభ్యులు తొక్కని గడప తొక్కకుండా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, ప్రవాస భారతీయల సమస్యలను తీరుస్తామని ఏర్పాటు చేసే ప్రతీ కార్యక్రమాలకు చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదు. తమ భర్తలు ఎక్కడ ఉన్నారో తెలపండి, వారు బ్రతికి ఉన్నారా లేక ఏడారిలోఇసుక దిబ్బలలోనే సమాధి చేసారా తెలుపండి అని వేడుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లా, మర్తాడు పాడు మండలానికి చెందిన ఇద్దరు తమ భర్తల కోసం ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నారు. సమాజం దృష్టిలో తాము మనుషులమైనా.. తమ ఇంటిలో తాము జీవచ్ఛవాలమని చెబుతున్నారు. వీరిలో ముందుగా నజీరా బేగం దీన గాధ తెలుసుకుందాం..
నజీరా బేగం భర్త మహమ్మద్ అబ్దుల్ సలీం.. తండ్రి పేరు గోరే మియా, తల్లి ఖమ్రు భీ, పాస్‌పోర్టు నంబర్ పీ 995741, కువైట్ దేశంలో అలీ హసన్ ఫహీద్ హసన్ అల్ అజ్మీ వద్దకు ఉపాధికి వెళ్లాడు.
1997 సంవత్సరంలో కువేట్ దేశానికి పయనమైన ముహమ్మద్ అబ్దుల్ సలీం ఒక సంవత్సరం పాటు తన కుటుంబ సబ్యులకు ఉత్తరాల ద్వారా తన బాగోగుల తెలిపాడు, అందులో తన యజమాని తనను వేధింపలకు గురిచేస్తున్నాడని తాను ఈ బాధలను తట్టుకోలేక పోతున్నానని తెలిపాడు, ఒక సంవత్సర కాలంలో రెండే రెండు ఉత్తరాలు రాసిన సలీం ఆ తరువాత తన కుటుంబ సబ్యలతో కాని మరెవ్వరితో ఏలాంటి మాట్లాడి నట్టు దాఖలాలు లేవు, ఈ విశయాన్ని ఎన్నో సార్లు అధికారులకు తెలుపారు., కువైట్ లోని సలీం యజమానికి ఫోన్ లో సంప్రదించినా ఎలాంటి సమాచారం తనకు తెలుయదని నిర్లక్ష్చంగా సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టెశాడని, కువైట్ లోని భారత దేశ రాయబారి కార్యాలయానికి ఎన్నో మార్లో లేఖలు రాసినా.. చూస్తున్నాము.. చేస్తున్నామని సమాధానమే తప్ప ఏలాంటి పురోగతి లేదని బాధితురాలు నజీరా తెలుపుతున్నారు.
ఎన్ని బీడీలు చుట్టినా తీరని కష్టం నజీరాది.అటువంటి కష్టమే ముతుకు లక్ష్మిది. ఈమె భర్త పేరు ముతుకు రమేశ్. ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు.
తన సోదరడు సౌది అరేబియా వెళ్లి కుటుంబాన్ని చక్కదిద్దుకున్నాడని తాను కూడా గల్ఫ్ దేశానికి పయనమయ్యాడు. 2004 సంవత్సరం లో రియాద్ రిజన్ కు చెందిన అల్ ఫలాజ్ ప్రాంతనికి పయనమైనాడు, నాలుగు ఐదు సంవత్సారాల పాటు ఇంటి రాక పోకలు సాగించాడు అలాగే తన భార్య పిల్లలకు సైతం కొంత డబ్బు పోగు చేసుకున్నాడు, ఆ నాలుగు ఐదు సంవత్సారాల కాలంలో ఇంటికి రెండు సార్లు వచ్చి పోయాడు. ముడో సారి వచ్చిన ముతుకు రమే‌శ్ 2010 జనవరి 12 నాడు సౌదికి వెళ‌్లాడు. జనవరిలో సౌదికి వెళ్లిన రమేశ్ జనవరీ 2011 వరకు తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడుతూ అందుబాటులోనే ఉన్నాడు. కానీ ‍ జనవరి 2011 నుండి ఎలాంటి సమాచారం లేదు. తాను నివాసం ఉన్న గది సైతం తాళం వేయకుండా మాయమయ్యాడని సమాచారం వచ్చింది. ఎవ్వరిని అడిగిన తనకు తెలియదని సమాధానం చెప్పుతున్నారని ముతుకు రమేశ్ భార్య లక్ష్మి చెబుతోంది.
. అయితే తాను తన భర్త ఆచూకి కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాననీ.. అందులో భాగంగానే సౌది లోని యజమానికి ఫోన్ చేయగా ఎక్కడ చచ్చాడు వచ్చి వెతుకండి అని కఠినంగా సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టెస్తున్నాడని లక్ష్బి తన గోడు వెళ‌్ల బుచ్చుకున్నారు. సంపాదన లేకపోగా భర్త జాడ కోసం ఉన్న ఇల్లును కూడా అమ్మి అప్పుల పాలయింది. ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తన భర్త బతికున్నాడా. .లేక అక్కడే చంపేశారా తెలపాలని కోరుతోంది.
ఇలాంటి దీనగాధలు.. ఉపాధికని గల్ఫ్‌కు వెళ్లిన చాలా కుటుంబాల్లో కనిపిస్తాయి. గడప గడపలో కడివెడు కన్నీళ్లు వర్షిస్తాయి. ఆగని ఈ అశ్రుధారలకు ఆనకట్టలు వేసే రోజు ఎప్పుడొస్తుందో..

Thursday, February 16, 2012

అన్నా పై ఆంగ్లేయుల పరిశోధన, పరధ్యానంలో భారతప్రభుత్వం

యావత్ దేశాన్ని కదిలించిన ఒకేఒక్కడు.. పాతాళానికి వేళ్లూనుకున్న అవినీతి మూలాలను కూకటి వేళ్లతో పెకిలించాలని ప్రభుత్వం పై సత్యాగ్రహాన్ని ఎక్కుపెట్టిన అభినవ గాంధీ. ఈ మాటలు అక్షరాలా అన్నా హజారేకి వర్తిస్తాయి.. ప్రఖ్యాత బ్రిటన్ ససెక్స్ యూనివర్సిటీ హజారే ఉద్యమాన్ని పొగడ్తల్లో ముంచెత్తింది. అంతే కాదు హజారే ఉద్యమం పై పరిశోధించేందుకు ఏకంగా ఓ పరిశోధనా కేంద్రాన్నే ఏర్పాటు చేసింది. భారతదేశ పాఠ్యపుస్తకాల్లో పది వాక్యాలకు నోచుకొని హజారే చరిత్ర... బ్రిటన్ ససెక్స్ యూనివర్సిటీకి పరిశోధనాంశంగా మారడంలో మతలబు ఏంటి.. ఇదే ఈ వారం హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.
అన్నా హజారే.. ఇప్పుడు ఈ పేరు తెలియని ఇండియన్ లేడు. ఏ పార్టీకి చెందని... ఏ పదవిలో లేని సామాజిక ఉద్యమకారుడు. అవినీతికి వ్యతిరేకంగా దేశపౌరులందరినీ ఒక్కతాటి పైకి తెచ్చిన థీశాలి. తెల్లదొరలకు వ్యతిరేకంగా నాడు గాంధీ పోరాడితే.. అవినీతికి వ్యతిరేకంగా నేడు హజారే అదే తీవ్రతలో పోరాడాడు. అదే స్థైర్యం, అదే పంథా, అదే నినాదం. అయితే నాడు స్వచ్ఛందంగా ఉద్యమాల్లో పాల్గొనే కార్యకర్తలు, ఉద్యమకారులున్నారు. కానీ రోజులు మారాయి. పైసలిస్తే గానీ పాదం కదపని ఈ రోజుల్లో ఇంతమందిని తరాల తరబడి పాతుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా అందరినీ ఎలా ఏకం చేయగలిగాడు.. ఇదే ఇప్పుడు బ్రిటన్ విద్యార్ధుల ముందున్న పరిశోధనాంశం.
గాంధీ తరువాత భారత దేశంలో అంతటి ప్రభావశీలిగా తక్కువ సమయంలో పేరు తెచ్చుకున్న అభినవ గాంధీ. భారతదేశాన్ని కొల్లగొడుతున్న విదేశీయుల పై గాంధీ పోరాటం చేస్తే. హజారే స్వదేశాన్ని కొల్లగొట్టి కోట్లు గడిస్తున్న అక్రమార్కుల పై యుద్ధం ప్రకటించాడు. ఆనాటి ఉద్యమంలో దేశ పౌరులంతా కలిసి వచ్చినట్టే.. ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమలోనూ దేశ పౌరులంతా కదం తొక్కారు. అయితే వచ్చిన సందేహమల్లా ఒక్కటే.. దేశం మొత్తాన్ని ఏ రాజకీయ శక్తి అండ లేకుండా.. హజారే ఒక్కరే ఎల ాకదిలించ గలిగారా అని. హజారే ఉద్యమం పై రకరకాల విమర్శలు వెలువడ్డా అవేవీ సత్యం ముందు నిలవలేక పోయాయి. హజారే ఉద్యమానికి పౌరులు, మేథావులే స్వచ్ఛందంగా మద్దతునిచ్చారనే విషయం స్పష్టమయింది. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. లోక్‌పాల్ బిల్లుకు సరే అంది. అయితే ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం పెద్దగా ప్రచారం చేయలేదు. హజారే వంటి వ్యక్తి సమరస్పూర్తిని పట్టించుకున్న పాపాన పోలేదు.
తొలి అడుగు అన్నా హజారే రూపంలో పడితే ఆ అడుగుకు వేల.. లక్షల.. కోట్ల అడుగులు తోడయ్యాయి. అసలు అన్నా చేస్తున్న ఈ ఉద్యమానికి అంత ఆదరణ ఎందుకు వచ్చినట్లు..? వందల నుంచి వేలు.. వేల నుంచి లక్షలు.. లక్షల నుంచి కోట్ల సంఖ్యలో ప్రజల మద్దతు ఎందుకు పెరిగింది..? అనే ప్రశ్నలను తరిచి చూస్తే మనకు అసలు విషయాలు అర్ధమవుతాయి.
రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు పట్టుమని ఐదేళ్లు తిరగకుండా తమ ఆస్తులను వందలరెట్లు పెంచుకుంటున్నారు. ఏ పార్టీ అయినా ఏ పార్టీకి చెందిన నాయకుడిదైనా ఇదే దారి. ఎవరో కొందరు తప్పించి మిగిలిన వారందరిదీ రహదారే.. అక్రమ మార్గంలో ఆస్తులను కూడగట్టుకునే అడ్డగోలు దారి. దానికి ఆయుధం అధికారం. రాజకీయం. వీటిని అడ్డం పెట్టుకుని ప్రజా ధనాన్ని లూటీ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రజల వద్దకు వచ్చినపుడు మాత్రం నీతి వాక్యాలు వల్లిస్తున్నారు. అయితే సగటు భారతీయులు మాత్రం అవినీతి నాయకులతో విసిగిపోయారు. అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన ప్రతి సినిమానూ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. భారతీయుడు, శివాజీ, అపరిచితుడు వంటి సినిమాల్లో తమను తాము హీరోలుగా ఊహించుకొని ఏదో ఒక సందర్భంలో అవినీతిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో అన్నా హజారే అవినీతి పై ఖడ్గం దూశారు. అందుకే మేము సైతం అంటూ యువత పదం పాదం కలిపారు. మీడియా కూడా తన వంతు పాత్ర పోషించడంతో హజారే పతాక విశ్వయవనిక పై రెపరెపలాడింది.
మరో మహా సంగ్రామానికి తెరలేచింది. అయితే మన సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య దేశంలో గెలిచిన వాడు రాసిందే చరిత్ర... రాజు చేసిందే ఘనకార్యం.. సామాన్యుడు రాజ్యానికి ఎదురు మాట్లాడితే అది తప్పు. అది ఒప్పేనని తమను గెలిపించిన కోట్లాది మంది ప్రజలు నొక్కి చెప్పినా అది అధికారంలో ఉన్నవారికి వినిపించదు. వినిపించినా నెత్తికెక్కదు. ఒకవేళ వారికి కూడా అది ఒప్పే అనిపించినా అది తాము చేసిన గొప్పతనంగా తీర్చిదిద్దుకొని రాజకీయ ప్రయోజనాలు పొందాలి. అందుకే అన్నా చేసిన ప్రయత్నాన్ని కాలగర్భంలో కలిపి లోక్‌పాల్ ప్రవేశ పెట్టిన ఘనత తమదే అని ఎన్నికల్లో చాటుకొనే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. అంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన అన్నా ఉద్యమాన్నే తమ అక్రమానికి ఉక్కు కవచంగా వాడుకొనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ఉద్యమం నా చేత, నా వలన, ప్రజల కొరకు చేసిందని అన్నా చెప్పుకోవలసిన పరిస్థితి తెస్తున్నారు. ప్రభుత్వాల భవిష్యత్ వ్యూహాలు ఇలా ఉంటే అన్నా కోసం విద్యాబుద్దులు నేర్చుకునే విద్యార్ధుల పాఠ్యపుస్తకాల్లో రెండు పేజీల్లో చోటు ఆశించడం అత్యాశే అవుతుందేమో... కానీ బ్రిటన్ యూనివర్సిటీ హజారే ఉద్యమాన్ని ఒక పరిశోధనా అంశంగా స్వీకరించింది. ఎందుకంటే బ్రిటన్ అమాంతంగా అన్నా హజారేను ఎత్తుకుంటే వాళ్లకొచ్చే నష్టం లేదు. వాళ్ల థియరీ వల్ల ఒక కొత్త అంశం కనిపెట్టామనే తృప్తి లభిస్తుంది. సామాజిక శాస్త్రంలో జనసమీకరణకు ఓ కొత్త ఫార్మలాను కనుక్కొగలుగుతారు. ప్రజలను కదిలించాలంటే ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలో కనిపెట్టగలుగుతారు. భౌషా బ్రిటన్ ససెక్స్ యూనివర్సిటీ అన్నా పై రూపొందించిన పూర్తి సిద్ధాంతాన్ని మనం తెలుగులోకి, హిందీలోకి తర్జుమా చేసి చదువుకోవాలేమో. అంతే కాదు.. అవునా మన అన్నా ఇంత గొప్పవాడా అని బ్రిటన్ పుస్తకాలు చదివి తెలుసుకోవాలేమే.. అవును మన వారసత్వ సంపదంగా బ్రిటీష్ దేశాల్లో పదిలంగా ఉంది. అందుకే ఈ అవినీతి నాయకుల కంటే తెల్లదొరలే నయం అన్న జనవాక్యాన్ని మన నేతలు నిజం చేస్తున్నారు. ఎందుకంటే నథింగ్ ఈజ్ బెటర్ దేన్ సంథింగ్.

ఎవడి వెనుక కథేందో ఇక్కడ తెలుస్తుంది..



ఎన్నికల నగారా మోగింది. ఈ ఉప ఎన్నికలు రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్షగా నిలవబోతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడుస్థానాలకు గానూ తెలంగాణలోనే ఆరు స్థానాలకు గట్టి పోటీ జరగబోతోంద. ఏఏ స్థానాల్లో ఏఏ పార్టీల బలా బలాలు ఎలా ఉన్నాయి. ఎవరు బరిలోకి దిగబోతున్నారు అనే అంశం పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.
ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్న ప్రధాన పార్టీలన్నీ తమ సత్తా చాటేందుకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈ ఎన్నికలు ఇటు టీడీపీకి అటు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా నిలవబోతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఖాళీ అయిన ఆరుస్థానాల్లో మూడు టీడీపీ సిట్టింగ్ స్థానాలయితే, రెండు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు కాగా ఒకటి కాంగ్రెస్ అసోసియేటెడ్ ఇండిపెండెంట్ స్థానం. అంటే టీడీపీ, కాంగ్రెస్ రెండూ చెరి మూడు స్థానాల్లో తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోడానికి కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ విధానాలను విభేదిస్తూ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నలు పార్టీకి వీడ్కోలు పలికి తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్దన్ , ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. కానీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి మాత్రం తెలంగాణ నగార భేరి పేరుతో వేదిక స్థాపించుకొని స్వతంత్ర అభ్యర్ధిగానే కొనసాగుతున్నారు. ఈ మూడు స్థానాల్లోనూ టీడీపీ తన సత్తా చాటుకునేందుకు సమాయత్తమవుతోంది.. ఇటు కోస్తాంధ్ర ప్రాంతానికి వస్తే నెల్లూరు జిల్లా కోవూర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమర్ రెడ్డి కూడా జగన్ శిభిరంలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో ఈ స్థానంలో కూడా టీడీపీ తన సత్తా చాటాల్సి వచ్చింది.
తెలంగాణ ప్రాంతంలో ఖాళీ అయిన ఆరుస్థానాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు రెండు, అసోసియేటెడ్ స్థానం ఒకటి ఉంది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులు తెలంగాణ ఉద్యమ సమయంలో తమ పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిచనప్పటికీ కాంగ్రెస్ అసోసియేట్ మెంబర్ గా కొనసాగుతున్నారు. ఈయన అకాల మరణంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. దీంతో ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్ తన పట్టు నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తోంది.
కామారెడ్డి, ఆదిలాబాద్ స్థానాల్లో టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల ఇక్కడ తమ గెలుపు నల్లెరు పై నడగానే భావిస్తున్నారు. ఇక్కడ వారు దాదాపు ప్రచారంలో ముందున్నారనే చెప్పాలి. దీనికి తోడు తెలంగాణ సెంటిమెంట్ బాగా పనిచేస్తుందనే అంచనాల్లో ఉన్నారు. అయితే గతంలో బాన్సువాడ ఉప ఎన్నికల్లో చేసిన తప్పు చేయకుండా తమ అభ్యర్ధులను రంగంలోకి దింపడమే కాకుండా వీలైనంత వరకు విజయ ఢంకా మోగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. నాగర్ కర్నూల్ నుంచి టీడీపీ తరపున ఎన్నికై రాజీనామా చేసిన ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డికి కూడా ఇది పరీక్షాకాలమనే చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీకి గట్టి పట్టున్న నాగర్ కర్నూల్ లో నాగం రాజీనామా చేసి మళ్లీ ఏ రాజకీయ పార్టీ తీర్ధం పుచ్చుకోకుండా ఇండిపెండెంట్ గా బరిలో నిల్చుంటున్నారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ తమ అభ్యర్ధిని పోటీకి నిలబెట్టే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాగం జనార్దన్ రెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. అయినా నాగం కు కష్టాలు తప్పెటట్టు లేవు. టీడీపీ తన క్యాడర్‌ను బలపరురస్తోంది. మరోవైపు బలమైన ఆర్ధిక పునాదులున్న జనార్ధన్ రెడ్డి పేరు కలిగిన ప్రముఖ వస్త్ర వ్యాపారి జేసీ బ్రదర్స్ యజమాని మర్రి జనార్ధన్ రెడ్డిని రంగంలోకి దించాలని తెదేపా అధినాయకత్వం నిర్ణయించి, ఈ మేరకు సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆయన కూడా అదే నియోజకవర్గానికి చెందినవారు కావడం, ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో ఒక్కసారిగా అక్కడ పోటీ రసవత్తరంగా మారింది.
అంతేకాక మరి కొందరు జనార్ధన్ రెడ్డి పేరు కలిగిన వారిని స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేయించవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
కాంగ్రెస్ విషయానికి వస్తే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగబోతున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్ తన పట్టు నిలపుకోవలసి ఉంది. కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు కూడా ఈ ఎన్నికలు అగ్ని పరీక్షాగానే నిలవబోతున్నాయి. జూపల్లి కాంగ్రెస్ లో ఉన్నప్పటికే అదే జిల్లాకు చెందిన మంత్రి డీకే అరుణకు జూపల్లికి పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా డీకే అరుణ ఈ ఎన్నికల్లో తన పవరేంటో చూపించేందుకు అస్త్రాలు సిద్ధం చేస్తోంది. మరోవైపు పాలమూర్ నుంచి ఎన్నికయి అకాల మరణం చెందిన రాజేశ్వర్ రెడ్డి భార్యను బరిలో దింపేందుకు టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది.
నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి టీడీపీ నుంచి ఎన్నికై జగన్ శిబిరంలో చేరిన నల్లపురెడ్డి ప్రసన్న కుమర్ రెడ్డి తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధమవుతున్నారు. ఈ స్థానం వైయస్సార్ పార్టీకి కైవసమైతే రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకోవడంతో పాటు వేటుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలకు ఆత్మ విశ్వాసం కలిగినట్లవుతుంది. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధులను పోటీకి దించబోమని ప్రకటించినా తరువాత పరిణామాల్లో ఏంచేయబోతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ బలాబలాలను నిరూపించుకునేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలతో, అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నాయి.

Wednesday, February 15, 2012

మూడవ ప్రపంచ యుద్ధానికి సైరన్ సిద్ధం..?


ప్రపంచదేశాల మధ్య నెలకొన్ని తాజా యుద్ధ మేఘాలు భారత్‌కు చమురు సంకటంగా మారాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లయింది భారత్ పరిస్థితి. ఢిల్లీలో ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం ముందు జరిగిన బాంబు పేలుళ్లు ఇరాన్‌ పనే అని భారత్ అభిప్రాయపడటం పట్ల కూడా ఇరాన్ గుర్రుగా ఉంది. అగ్రరాజ్యానికి వత్తాసు పలుకడం సరికాదని ఇరాన్ అధ్యక్షుడు అహ్మదినెజాద్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ ను ఏకాకి చేయాలన్న అగ్రరాజ్య పిలుపు వివాదాస్పదంగా మారింది. దీంతో ప్రపంచ దేశాలు నిట్ట నిలువుగా చీలిపోతున్నాయి.. పాత పగలన్నీ తిరిగి తోడుకుంటున్నాయి. అగ్రరాజ్య గుత్తాధిపత్యానికి తెర దించాలని కొన్ని దేశాలు ప్రయత్నిస్తే అగ్రరాజ్యపు అడుగుజాడల్లో నడిచేందుకు మరికొన్ని దేశాలు తప్పక తలవంచాల్సిన పరిస్థితి.
ఇప్పటికే..ఇజ్రాయిల్ , ఇరాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాన్ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను ఇరాన్ బేఖాతరు చేసింది. టెహ్రాన్ లో అణుప్రదర్శన నిర్వహించారు. ఇరాన్ అణురియాక్టర్ లో యురేనియం రాడ్లను నింపింది. ఇరాన్ ని ఏకాకిగా చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. చైనా, రష్యాలు ఇరాన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే యూరప్ లోని ఆరు దేశాలకు ఇరాన్ చమురు సరఫరాని నిలిపివేసింది. గ్రీస్, పో్ర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్ దేశాలకు ఆయిల్ సరఫరా నిలిపివేసింది. ఆయిల్ సరఫరా చేసే ముఖ్యదేశాలు రెండుగా చీలిపోయాయి. అమెరికా, యూరప్ దేశాలు ఇజ్రాయిల్ కు వెన్నుదన్నుగా ఉన్నాయి.

ఈ సంక్షోభ సమయంలో భారత్ పరిస్థితి ఆడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఎందుకంటే, భారత్‌కి అత్యధికంగా క్రూడ్ సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ రెండో స్థానంలో ఉంది. ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు పరిమాణం కూడా భారీగా తగ్గుతోంది. 2010-11లో ఇరాన్ నుంచి భారత్ దాదాపు 9.4 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 47,000 కోట్ల మేర ముడిచమురును దిగుమతి చేసుకుంది. గతేడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ. 15,500 కోట్లు మేర చమురు దిగుమతి చేసుకుంది. ఇరాన్‌పై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించినప్పటికీ.. వీటిని తోసిరాజని భారత్ ఇప్పటిదాకా ఆ దేశంతో లావాదేవీలు కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే చమురుకి సంబంధించి చెల్లింపులు జరిపే విషయంలో భారత్‌కి సమస్యలు తలెత్తాయి. డాలర్ల బదులు రూపాయి మారకంలో చెల్లింపులు జరిపేందుకు, ఇతర సర్దుబాట్లు చేసేందుకు ఇరు దేశాలు మధ్యే మార్గంగా ఒక పరిష్కారాన్ని కనుగొన్నాయి. దీంతో సమస్య ఒక కొలిక్కి వచ్చినట్టేనని ఇరు దేశాలు భావించాయి. ఇంతలోనే న్యూఢిల్లీలో ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం దగ్గర జరిగిన బాంబు దాడి ఘటన.. ఏదో విధంగా ఇరాన్‌తో వాణిజ్య లావాదేవీలు జరపాలన్న భారత ప్రయత్నాలకు మరింత విఘాతంగా పరిణిమించింది. కాగా భారత్ నుంచి ఇరాన్‌కు భారీ స్థాయిలో బాస్మతి బియ్యం, టీ ఎగుమతి అవుతోంది. విదేశాలకి ఎగుమతయ్యే మొత్తం 2 మిలియన్ టన్నుల పైగా బియ్యం ఎగుమతుల్లో సగభాగం ఇరాన్‌కే వెడుతోంది. ఇప్పటికే రూ. 600 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో సతమతమవుతున్న ఎగుమతిదార్లకు ఇరాన్ కరెన్సీ మారక విలువ క్షీణించడం మరింత ఆందోళనకరంగా మారింది. ప్రపంచదేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో చమురు ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం భారత్ పై కూడా పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Wednesday, February 8, 2012

సమ్మక్క సారలమ్మలకు బెల్లాన్నే కానుకగా ఇస్తారెందుకు ?



బంగారు బెల్లం
కొండ ప్రజల కొంగు బంగారం... గిరిజన ప్రజల కులదైవం.. సమ్మక్క సారలమ్మలు.. పేరుకైతే పెద్ద జాతర... కానీ ఆ తల్లుల కరుణ పొందాలంటే ఏ వెండి బంగారాలు సమర్పించనక్కర్లేదు.. పిరెంతో పిడికెడు బెల్లం పెడితే సంతోషిస్తారు. జాతరలో ఈ బెల్లాన్నే భక్తులు బంగారంగా పిలుచుకుంటారు. అసలు సమ్మక్క సారక్క జాతరలో బంగారాన్నే ఎందుకు కానుకగా సమర్పిస్తారు..
కోరిన కోర్కెలు తీర్చే కొండంత దైవం.. గిరిజనుల పాలిట కొంగుబంగారం సమ్మక్క సారలమ్మలు.. అడవి పుత్రులకు అండగా నిలబడి నెత్తురోడి పోరాడి.. ఆ నెత్తుటి మడుగులో కుంకుమ భరిణలై వెలిసిన అడవి తల్లులు సమ్మక్క సారలమ్మలు. చిలకల గుట్ట పై వెలిసిన రోజు నుంచి ఈ తల్లులను గిరిజనులు తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు. ఏ చిన్న కష్టం వచ్చినా మేడారం ప్రాంతం ప్రజలు సమ్మక్కలకే మొక్కుకునే వారు. అయితే ఈ తల్లులకు బంగారాన్నే ఎందుకు సమర్పిస్తారనే విషయం పై ఒక కథ ప్రచారంలో ఉంది. గిరిజనులు చెప్పే ఆ కథ ప్రకారం... ఒకరోజు ఒకగిరిజనుడికి ఒక ఆపద వచ్చింది. ఆ ఆపద గట్టెక్కితే తల్లికి తగిన కానుకలు ఇస్తానని మొక్కుకున్నాడు. కొద్దికాలానికే ఆ గిరిజనుడి కోరిక నెరవేరింది. ఆపద గట్టెక్కింది. అయితే ఆ తల్లులకు తగిన కానుకలైతే ఇస్తానన్నాడు కానీ ఏ కానుకలు ఇవ్వాలో అతనికి అర్ధం కాలేదు. వెండి బంగారు తొడుగులు చేయించేంతటి ధనికుడు కాదు. అదే విషయాన్ని ఆ తల్లులకు మొర పెట్టుకున్నాడు. తన కోరిక తీర్చినందుకు ఆ తల్లులకు రుణపడి ఉన్నానని.. అయితే వెండి బంగారు నగలు చేయించేంతటి ధనికుణ్ని కానని.. కానుకలు ఏం చెల్లించాలో మీరే చెప్పాలని వేడుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆ భక్తుడి కలలోకి వచ్చిన సమ్మక్క సారలమ్మలు.. తమకు వెండి బంగారాలేమీ వద్దని, గిరిజనులకు ఇష్టమైన బెల్లమే బంగారమని చెప్పారు. బంగారు రంగును కలిగిఉన్న బెల్లాన్ని కానుకగా చెల్లిస్తే... తమకు అది బంగారంతో సమానం అని చెప్పారట. కలలో జరిగిన ఈ విషయాన్ని అతడు తమ కులపెద్దలకు చెప్పాడు. బెల్లమే కదా అని.. తననిలువెత్తు బంగారాన్ని కానుకగా సమర్పించాడు. దీంతో అప్పటినుంచి భక్తులు తమ బరువుతో బెల్లాన్ని తులాభారంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

సమ్మక్క సారలమ్మలు కొండదేవరలెందుకయ్యారు..?


సమ్మక్క సారలమ్మలు కొండదేవరలెందుకయ్యారు..?

ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర... ఇంత పేరు మోసిన ఈ జాతరలో వేద మంత్రాలు, హోమగుండాలేవీ ఉండవు. కేవలం నమ్మకంతోనే నడిచే జాతర ఇది.. గిరిజనుల కొంగు బంగారంగా విలసిల్లే ఈ దేవరలకు... బెల్లాన్ని బంగారంగా ముడుపు చెల్లిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తారనే నమ్మకం గిరిజనులది... వీరికి పూజలు చేసే అధికారం కేవలం గిరిజనులకే సొంతమా.. ఎప్పటి నుంచి వస్తుందీ ఆచారం. సమ్మక్క సారలమ్మలు గిరిజన దేవరలు ఎలా అయ్యారో... కథనం.

కాకతీయ రాజు చేతిలో వీరమరణం చెందిన గిరిజన వీరనారీమణులు సమ్మక్క సారలమ్మలు.. వీరు చిలకలగుట్ట వద్ద కుంకుమ భరిణలుగా వెలిసి గిరిజనుల పాలిట కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. తొలుత గిరిజన గూడేలకే పరిమితమైన ఈ జాతర ఇప్పుడు ఖండాంతరాలు వ్యాపించింది. అందుకే ఈ జాతరను ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించింద.ి
సమ్మక్క-సారలమ్మలు మరణించిన చోట గద్దెలు నిర్మించి, వారి ప్రతిమలుగా కొయ్యలను ప్రతిష్టించారు. వీటినే దేవరగా భావించి కోయలు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తున్నారు. తమ వీర వనితలైన సమ్మక్క సారలమ్మలను దేవతా స్వరూపాలుగా భావిస్తూ ప్రతి కార్యక్రమంలో గుర్తు చేసుకుని స్ఫూర్తి పొందుతారు. మేడారం అతిచిన్న గిరిజన గ్రామం. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన అరణ్య ప్రాంతంలో ఇది ఉంది. ఈ గ్రామంలోనే సమ్మక్క-సారలమ్మ జాతర జరుగుతుంది. అందుకే, ‘ఈ జాతరను గిరిజనులు నిర్వహిస్తారు కాబట్టి గిరిజన జాతరగానూ పిలుస్తున్నారు.
సమ్మక్క-సారలమ్మ దేవతలకు జాతరను నిర్వహించే గిరిజనులు ఎవరు? ఆ పూజారులు ఎవరు? ఆ హక్కు అందరికీ ఉంటుందా? సమ్మక్క సారలమ్మలకు గిరిజనులకు సంబంధం ఏమిటి? ఎందుకు సమ్మక్క-సారలమ్మ జాతర చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే జాతర మూలాల్లోకి వెళ్లాలి. సమ్మక్క-సారలమ్మ జాతరను నిర్వహించేది కోయతెగకు చెందిన గిరిజనులు. మళ్లీ ఇందులోనే 12 రకాల కోయ తెగల వారున్నారు. ఈ కోయల్లో వరంగల్ జిల్లాలో రాచకోయ వారున్నారు. ఈ తెగకు చెందిన కోయలే మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరను నిర్వహిస్తున్నారు. వీరే దీనికి హక్కుదారులు, పూజారులు. పూజారులనే కోయలు వడ్డెలు అని కూడా అంటారు.
కోయ తెగలో గోత్రాలుంటాయి. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క దేవత ఇలవేల్పుగా ఉంటుంది. సమ్మక్కకు పూజారులు... అంటే వడ్డెలు... వారెవరంటే సిద్ధబోయిన, కక్కెర అనే ఇంటిపేరు గల వాళ్లు.
సారలమ్మ 4వ గోత్రికం వారికి ఇలవేల్పు. కేవలం కాక అనే ఇంటి పేరు గల వాళ్లు సారలమ్మకు వడ్డెలు. 4వ గోత్రికం వారికి ఇలవేల్పుగా పగిడిద్ద రాజును పూజిస్తారు . పెనక అనే ఇంటిపేరు గలవాళ్లు పగిడిద్ద రాజుకు వడ్డెలు. 6వ గోత్రికం వారికి గోవిందరాజులును ఇలవేల్పుగా పూజిస్తారు . ‘దబ్బగట్ల’ అనే ఇంటిపేరు గల వాళ్లు గోవిందరాజుకు పూజారులుగా వ్యవహరిస్తారు. మొత్తంగా సమ్మక్క సారలమ్మ జాతరకు కోయ గిరిజన తెగకు చెందిన రాచకోయ వారు హక్కుదారులుగా ఉన్నారు. ముందే చెప్పినట్టు కోయ సంప్రదాయం ప్రకారం కేవలం ఆయా గోత్రాలకు సంబంధించిన వాళ్లు మాత్రమే పూజారులుగా వ్యవహరిస్తారు.
సమ్మక్క సారలమ్మల జాతర పూర్వం నుంచి 1947 వరకు మేడారం గ్రామం కులపెద్ద ఆధ్వర్యంలో నడిచేది. మొదట గ్రామ సామూహిక పండుగ. తర్వాత కోయల తెగ పరిమితిలో, అనంతరం పెరిగిపోయి, గిరిజనుల, గిరిజనేరుతరుల ప్రవేశంతో పెద్దదిగా మారింది. ఆదాయం పెరిగి 1947లో రెవెన్యూ స్వాధీనంలోకి వెళ్ళింది. 1962లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వెళ్లడంతో కోయలు తమకు హక్కులు కల్పించాలన్న డిమాండ్‌తో కోర్టుకు వెళ్లారు. హైకోర్టు కోయ వడ్డెలకు 1/3 వంతు జాతర ఆదాయం ఇవ్వాలని తీర్పు ఇస్తూ వీరికి హక్కులు కల్పించారు.

రాజకీయాల రంగు మారుస్తున్నఎవడీ రమణకు పూర్తి వీడియో..రూపం..?

రాజకీయాల రంగు మారుస్తున్న రమణ... ఇంతకీ ఎవరీ రమణ ?



లిక్కర్ సిండికేట్ రమణ.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను, అధికారులను కలిపి పీటముడి వేసి అవినీతి రంగు పులిమిన లిక్కర్ కింగ్. రమణ ఏసీబీకి ఇచ్చిన స్టేట్‌మెంట్ కు ఇటు రాజకీయ నాయకులు అటు అధికారులు కూడా భూజాలు తడుముకుంటున్నారు. నేరం మాది కాదంటున్నారు. ఆ మాటకొస్తే రమణే పెద్ద నేరగాడని ఎదురు దాడికి దిగుతున్నారు. అధికారులనూ, రాజకీయ నాయకులనూ ముప్పు తిప్పలు పెట్టి అవినీతి నీళ్లు తాగిస్తున్న ఒక సామాన్యడు లిక్కర్ డాన్ గా ఎలా మారాడు.. ఈ రమణ ఎవరు ?
లిక్కర్ కింగ్ రమణ.. ఈ పేరు ఇప్పుడు రాష్ట్రం మొత్తం వినిపిస్తోంది.. ఇది నాలుగైదేళ్లుగా వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ లో తరుచూ వినపడే పేరే... రమణ స్వగ్రామం వరంగల్ జిల్లా, డోర్నకల్ మండలం గొల్లగూడెం . రైల్వే కానిస్టేబుల్ గా జీవితాన్న మొదలు పెట్టి, ఉద్యోగంలో పస లేదని గ్రహించి.. కిక్కిచ్చే గంజాయి వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. రైల్వే కానిస్టేబుల్ గా కెరీర్ మొదలు పెట్టిన రమణకు... రైల్‌లో గంజాయి వ్యాపారులతో పరిచయం ఏర్పడింది. వారి వద్ద ముడుపులు పుచ్చుకొని చూసీ చూడనట్టు వదిలేశాడని ఉన్నతాధికారులు రమణను సస్పెండ్ చేశారు. తర్వాత అతను పాత పరిచయాలతో బంధువు సాయంతో గంజాయి వ్యాపారంలోకి దిగి కోట్లు గడించాడు. ఆ తర్వాత రమణ చూపు మద్యం వ్యాపారం వైపు మళ్ళింది.. తాను గంజాయి వ్యాపారం చేసేటప్పుడే ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో నేర్చుకున్నాడు. అధికారులను హోదాలకు అతీతంగా, రాజకీయ నాయకులను పార్టీలకు అతీతంగా ఎలా ట్రీట్ చేయాలో నేర్చుకున్నాడు. ఆ విద్యతోనే మద్యం వ్యాపారంలోకి దిగి సిండికేట్ గా మారాడు. రెండు జిల్లాల్లో రమణ ఆడింది ఆట... పాడింది పాట.. ఏ వైన్ షాపు ముందయినా.. బార్ షాపు ముందయినా.. ఏ కస్టమరూ - నోరు తెరవడానికి వీల్లేదు.. ఒకవేళ నంబర్ ఉందికదాని ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేద్దామని ప్రయత్నించారో.. ఆ నంబరు ప్రస్తుతం స్పందించుటలేదు అనే సమాధానం వస్తుంది. ఇప్పటికే రమణ రాజకీయ నాయకులకు, అధికారులకు వీఐపీగా మారిపోయాడు. తాను సస్పెండయిన కానిస్టేబుల్ కాబట్టి, మద్యం షాపు అనుమతులు ఏవీ తన పేరుమీద ఉండవు. తనకు నమ్మిన బంట్లైన గిరిజనుల పేరుతో లైసెన్సులు తీసుకొని రసవత్తరమైన కథ నడిపించేవాడు. ఏ రాజకీయ నాయకుడి, అధికారి ఇంట్లో కార్యం జరిగా రమణ రాక కోసం చూస్తారని ప్రచారంలో ఉంది. ఎందుకంటే రమణది కాస్త పెద్ద చేయేనట. ఆయన సమర్పించుకునే నజరానాలు ఆ ఫంక్షన్‌కయ్యే ఖర్చులో సగం ఉంటాయని చెప్పుకుంటారు. తాజాగా ఏసీబీ దాడుల్లో ఖమ్మంలో దొరికిన ఆధారాలను బట్టి రమణను ప్రశ్నిస్తే తన వద్ద ఉన్న చాంతాడంత లిస్టు విప్పాడు. ఆ లిస్టులో ఉన్న కొందరు పెద్దలు ముడుపులు పుచ్చుకుంది వాస్తవమే నంటే, మరి కొందరు మాత్రం రమణా.. అతను ఎలా ఉంటాడనే సమాధానం వచ్చింది. ఇంతకీ రమణ అన్ని పేర్లు చెప్పాడా... రమణ కొన్ని పేర్లు బయటపెట్టలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతి చిన్నదానికీ డబ్బులడిగే పోలీసుల పేర్లు బయటకు రాకపోవడం ఇందుకు కారణం.. రమణ మీద అక్షరాలా 18 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి. కానిస్టేబుల్ గా సస్పెండయిన ఇతను రాజకీయ నాయకులను, పెద్ద పెద్ద అధికారులనే వలలో వేసుకోవడమే కాదు. ఏసీబీ చేతిలో పెట్టాడు.

Tuesday, February 7, 2012

మాల్దీవుల మాటున..? ఏంజరుగుతోంది



సముద్రంలో చిన్న బిందువుగా ఉన్న మాల్దీవులు ఇప్పుడు వివాస్పద రాజకీయానికి కేంద్ర బిందువుగా మారాయి. దశాబ్దాలుగా పాలిస్తున్న అధ్యక్షుడు నషీద్ ప్రజాభీష్టం మేరకు రాజీనామా చేశాడు. ఉపాధ్యక్షుడు వాహిద్ హసన్ కు అధ్యక్ష పదవి కట్టబెట్టబోతున్నారు. ఇంతకీ మహా సముద్రంలో కన్నీటి బిందువు పరిమాణంలో ఉండే మాల్డీవులకొచ్చిన కష్టం ఏంటి. ప్రజలు అధ్యక్షుడి పై తిరగుబాటు చేసేంత కష్టం ఏమొచ్చింది.
మాల్దీవులు.. ఈ పేరు ప్రకృతి అందాలకు మారు పేరు.. ఒక్కసారి మాల్డీవుల్లో అడుగు పెడితే మళ్లీ తిరిగి రావాలనిపించదు.. క్రిస్టల్ క్లియర్ గా కనిపించే సముద్రపునీరు.. నీటి జాడల్లో నిర్మించిన రెస్టారెంట్లు... తేమ తెమ్మెరలు కలిగిన పిల్లగాలి... ఎటు చూసినా నీలాకాశం... నింగిలోని చుక్కలు... జడలు విప్పుకొని ఊగే కొబ్బరి చెట్లు... సముద్ర తీరంలో చక్కిలిగింతలు పెట్టే ఇసుక తిన్నెలు.. ఎంత చూసినా తనితీరని అందం మాల్దీవులది.. కానీ ఈ మాల్డీవుల మాటున ప్రజాగ్రహం ఉప్పెనలా ఎగిసి పడింది. ఈ చిన్న పగడపు రాజ్యంలో ప్రజలు రాజుకు ఎదురు తిరగారు. ఇక మిమ్మల్ని భరించలేం దిగిపోవాల్సిందేనని రోడ్డుకెక్కారు. విధిలేని పరిస్థితుల్లో అధ్యక్షుడు పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు.
ఈ సుందర దీవులకు అతి ప్రాచీన చరిత్ర ఉంది. శతాబ్దాల క్రితం శ్రీలంక యువరాజు సముద్రంలో కొత్త పెళ్లి కూతురితో సహా విహారానికి వెళ్లి సముద్రంలో చిక్కుకొని మాల్దీవులకు చేరుకున్నాడు. అక్కడి వారితో తన రాజ్యం ఏర్పరచుకొన్నాడు. మాల్దీవులకు మొదటి సుల్తాన్ అతడే అని చెప్పుకుంటారు. ఈ దీవి భారతదేశానికి దగ్గరగా ఉంది. ఇటు అరేబియా, హిందూ మహా సముద్రాలకు సరిహద్దుల్లో ఉండటం వల్ల ఇరు ప్రాంతాల నావికుల ప్రభావం ఈ దీవి పై ఉంది. అంతే కాదు ఈ దీవి చిన్నగా ఉండటం చేత తరుచూ సముద్రపు దొంగలు పడి దోచుకుంటారు. ఒక్కోసారి మొత్తం ప్రాంతాన్నే ఆక్రమించి ప్రజలను భయకంపితులను చేస్తారు. 16 శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ దీవిని ఆక్రమించి 15 సంవత్సరాలు పాలించారు. తరువాత స్వతంత్ర మహ్మదీయ రాజ్యంగా అవతరించింది. 1965లో స్వాతంత్ర్యము పొందినా సుల్తాను రాజ్యమే తరువాత 3 సంవత్సరాలు పరిపాలన సాగించింది. నవంబరు 11,1968 లో దాన్ని రద్దు చేసి ఇప్పటి పేరుతో గణతంత్ర రాజ్యముగా మార్చడం జరిగింది.
చాలా కాలం మల్డీవుల్లో ప్రశాంతంగానే గడిచింది.. ఇక్కడ పర్యాటకం, మత్యపరిశ్రమ, కుటీర పరిశ్రమతోనే జీవనం గడుపుతారు. మొత్తం జనాభా మూడున్నర లక్షలు మాత్రమే.. అయినా ఈ దీవులను పాలించే అధ్యక్షుడు ఒకరు కావాలి. అందుకే మొదటిసారి..మౌమూన్ అబ్దుల్ గయూమ్‌ను 1978లో మొదటి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.. అప్పటి నుండి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన అధికారదర్పముతో పరిపాలించాడు. 1988లో ఆయనకు వ్యతిరేకముగా జరిగిన ఒక కుట్ర నుండి భారత రక్షక దళాల సహాయముతో తప్పించుకున్నాడు. 2003 నుండి అప్పుడప్పుడు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు రాజకీయ ప్రక్షాళనకు దారితీశాయి. తరనంతర పరిణామలలో మహ్మద్ అన్నా నషీద్ దీనికి అధ్యక్షుడు గా పీఠమెక్కారు. ఇతని వ్యవహారి శైలి నచ్చని ప్రజలు మళ్లీ తిరుగబాటు చేయడంతో తన పదవికి రాజీనామా చేశాడు.
ఇంత చేసీ ఈ దీవి ఎంతకాలం మనుగడ సాగిస్తుదో తెలియని పరిస్థితి. ఎందుకంటే.. డిసెంబరు 26, 2004లో హిందూ మహాసముద్రములో వచ్చిన భూకంపము వలన ఏర్పడిన సునామీ వల్ల మాల్దీవులకు అపార నష్టం వాటిల్లింది. భవిష్యత్తులో ఈ దీవి ప్రపంచ పటం నుంచి కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదని ఆ దేశ ప్రభుత్వం ఆందోలన చెందుతుంది. సముద్ర మట్టానికి కేవలం రెండున్నర మీటర్ల ఎత్తులో ఉండే ఈ దీవిలో ఎన్నో వింతలు విశేషాలు, ప్రకృతి సోయగాలు.. వీటన్నిటినీ సముద్రగర్భంలో ముంచాలంటే ఈ దీవి ప్రజల మనసు మనసులో ఉండదు. కానీ అది శతాబ్దాల తరువాత మాట అనుకున్నారు. తరచుగా వచ్చే సునామీలు. ఏదో ఒకరోజు మాల్దీవులను ముచేస్తాయన్న భయం మాత్రం వారిని నిత్యం వేదిస్తూ ఉంది.

Saturday, February 4, 2012

అతడే ఓ సైన్యం - ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన సుభ్రమణ్యస్వామి




ఆయన ఓ సైన్యం... ఓ యాంటీ కరెప్టన్ మూవ్‌మెంట్... సమాజాన్ని అల్లుకుపోయిన అవినీతి ఉక్కు చెదలును దులిపే అగ్ని కీల.. ప్రభుత్వ వ్యవహారాల్లో దాగిన అక్రమాలనుని వేరు చేసి వేలెత్తి చూపిన హంసధ్వని.. యావత్ ప్రపంచ దృష్టిని తనవైపు మళ్లించుకొని ప్రభుత్వానికి ముచ్చెటమటలు పట్టించిన వన్ అండో ఓన్లీ వన్ మ్యాన్.. ఒకే ఒక్కడు.. డాక్డర్ సుభ్రమహణ‌్య స్వామి..
అవును.. ఆయన పార్టీ మారడు.. పంథా మార్చడు.. ఒకే నినాదం.. పట్టిన పట్టు విడువని పట్టు వదలని విక్రమార్కుడు.. తన దృష్టికి వస్తే మంత్రయినా... ప్రధాన మంత్రయినా... నిజాన్ని నిగ్గుతేల్చేదాకా వదిలిపెట్టడు.. తన ఆశయ సాధనకు... ఆయన ఏ ఉద్యమాన్నీ చేయడు.. ఏ ర్యాలీలు తీయడు.. కానీ దేశాన్ని తొలుస్తున్న అవినీతి వేరు పురుగును ప్రపంచం ముందు ఆవిష్కరించాడు. అప్పడు ఆయనకు తెలియకుండానే.. ఆయన అడక్కుండానే అన్ని వర్గాల ప్రజలు ఆయనకు సైన్యం అయ్యారు. దేశాన్నే ఊపేసిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం తీగలాడి.. అవినీతి డొంక కదిలించిన డాక్టర్ సుభ్రమణ్య స్వామి పై ప్రత్యేక కథనం
డాక్టర్ సుభ్రమణ్యస్వామి.. ఇప్పుడు ఈ పేరు చెబితే అవినీతి పరుల గుండె లిప్త కాలం పాటు చిన్న వణుకు పుట్టడం ఖాయం. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి తొలి అడుగు నుంచి నేటి వరకు అదే ప్రస్థానం.. ప్రతి అడుగులోనూ ఎన్నో మలుపులు... ధైర్యం వీడింది లేదు. .అత్మ విశ్వాసం సడలింది లేదు... ఆయనకు వీరు వారు అనే తేడా లేదు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరు తప్పు చేసినా నిలదీస్తాడు... ప్రపంచం ముందు నిల్చోబెడతాడు.. న్యాయం జరిగే వరకు కడదాకా పోరాడుతాడు. అందుకే సుభ్రమణ్య స్వామి పోరాట పటిమకు మారుపేరుగా నిలిచాడు..
అవినీతి పై అలుపెరగని పోరాటమంటే గత దశాబ్ద కాలం నుంచీ అర్ధం మారింది. అక్రమాలను ఎదిరించాలంటే ఒక సైన్యం కావాలి. యువత సాయం కావాలి. నినాదాలు, ర్యాలీలు, సత్యాగ్రహాలు, మీడియా కవరేజి, ఇంకా.. ఇంకా.. కావాలి.. నాలుగు రోజుల హడావుడి తరువాత.. అవినీతిని అంతమొందిస్తామని ప్రగల్భాలు పలికినవారే అదే ఊబిలో చిక్కుకొని విలవిల్లాడి వెనకడుగు వేయడం చూస్తున్నాం.. కానీ సుబ్రమణ్యానికి ఇవేవి తెలియవు. తనకు తానే సైన్యం.. తన దృష్టికి అవినీతి జరిగిందనే విషయం వస్తే దాన్ని ఆపరేషన్ చేసి తీరాల్సిందే. గతంలో అవినీతి పై ఎన్నో సార్లు సుబ్రమణ్యం పోరాడిన సందార్భాలు అనేకం.. అన్నిటికంటే 2జీ స్పెక్ట్రం కుంభకోణం సుబ్రమణ్యం సత్తా ఏంటో ప్రపంచానికి తెలిపింది. మొక్కవోని ధైర్యానికి, పట్టువదలని పట్టదలకు రాజకీయలోకం బిత్తరపోయింది. సుబ్రమణ్యస్వామి ఇలా కావడానికి వెనుక ఆయన నడిచొచ్చిన దారే కారణం. ఇంతకీ సుబ్రమణ‌్య స్వామి నేపధ్యం ఏంటి.. ఎవరీ సుబ్రమణ్యస్వామి..
జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో సాగిన రాజకీయేతర సర్వోదయ ఉద్యమంలో పాలుపంచుకున్న అనుభవం ఉంది. 1990 నుంచి జనతా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఐదుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుడా ప్రణాళికా సంఘం కమిటీ సభ్యుడిగా ఉంటూ ఆర్ధిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. జనతా పార్టీలోనే కొనసాగుతున్నారు. సామాజిక రుగ్మతల పై పోరాడుతూనే పత్రికల్లో ఎన్నో వ్యాసాలు రాసేవారు. కొన్ని వ్యాపాలు వివాదాలు కూడా రేపాయి. అవినీతి కుంభకోణాల పై ప్రధానంగా దృష్టి సారించిన సుబ్రమణ్యస్వామికి బాగా ఖ్యాతి తెచ్చింది మాత్రం 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణమే.
2జీ లైసెన్సుల మంజూరులో జరిగిన భారీ కుంభకోణాన్ని వెలికి తీయడానికి 2008 నవంబర్ నుంచి ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి అప్పటి కేంద్ర మంత్రి రాజాను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వమని కోరుతూ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆయన తొలి లేఖ 2008 నవంబర్ 29న రాశారు. వరుసగా ఐదు లేఖలు రాసినా ఫలితం లేకపోవడంతో స్వామి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో ఈ కేసు వివరాలను అందించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడంతో సీబీఐ రంగంలోకి దిగి, అక్రమాల డొంకను బయటకు లాగింది. 2జీ స్పెక్ట్రమ్ తిరిగి వేలాన్ని వేసే విషయంలో కమ్యూనికేషన్ల మంత్రి కపిల్ సిబల్ ప్రమేయం లేకుండా చూడమని కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2జీ కుంభకోణంలో చేతులు మారిన సొమ్ములో 18 వేల కోట్లు సోనియా గాంధీ సోదరీమణులు ఇద్దరికి చేరాయని స్వామి ఆరోపించారు. సోనియాను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించవలసిందిగా గత ఏడాది ఏప్రిల్ 15న ప్రధానికి స్వామి 206 పేజీల లేఖ రాశారు. 1972 నుంచే సోనియాకు అనేక అవినీతి కార్యకలాపాలతో ప్రమేయం ఉందని ఆ లేఖలో ఆరోపించారు. హోం మంత్రి చిదంబరంను ప్రాసిక్యూట్ చేయమని కోరుతూ కోర్టుకు అనేక పత్రాలను అందజేశారు.
ఒకసామాన్య పౌరుడిగా మత్రమే తాను ఇలా స్పందించానని... ప్రభుత్వాన్ని కదిలించే యంత్రాంగమేదీ తన చేతుల్లో లేదని స్వామి వ్యాఖ్యానించడం వెనుక ఆయన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ప్రజాజీవితంలో ఉన్న ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి కోరితే 3 నెలల్లోగా ప్రభుత్వం స్పందించాలని కోర్టు వ్యాఖ్యానించడం సామాన్య పౌరుడికి స్వామి సాధించి పెట్టిన విజయమే.

నేరం మాది కాదు బాబయ్య అంటున్న ఐఏఎస్‌ అధికారులు



ప్రభుత్వ వ్యవహారాల గుట్టంతా తెలుసుకొని.. అవసరానికి తగ్గట్టు మసలుకొంటూ.. గుట్టు చప్పుడు కాకుండా పాలనా వ్యవహారాలు చక్కదిద్దే ఐఏఎస్ లు నోరు విప్పారు. ప్రభుత్వ ఉత్తర్వులను తూచా తప్పకుండా అమలు చేయడమే తమ విధి అని.. అయితే ఆ ఉత్తర్వుల వలన ప్రజా ధనం దుర్వినియోగం అయితే ఉత్తర్వులను ఇచ్చిన వారిని వదిలి అమలు చేసిన వారిని నేరస్థులుగా పరిగణించడం తగదన్నారు. కేబినెట్ ఉత్తర్వుల వలన కొన్ని ఇబ్బందులు ఎదరవుతాయని తెలిసినా పబ్లిక్ సర్వెంట్ లుగా అమలు చేయక తప్పని పరిస్థితి ఉంటుందని.. ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేసిన పాపానికి అత్యున్నత హోదాలో ఉండి కూడా అవమానాల పాలు కావలిసి వస్తుందని ఐఏఎస్ లు ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పొకరు చేస్తే శిక్ష మరొకరికా ?
మంత్రులకో న్యాయం అధికారులకో న్యాయమా ?
అరెస్టులు శిక్షలు కావా ?
అవినీతి ఆరోపణల్లో అరెస్టయితే అవమానం కాదా ?
అవమానానికి మించిన శిక్ష ఉంటుందా ?
మంత్రులను విచారించేది పేషీల్లో... తమను కస్టడీలోనా ?
సీబీఐకి బిజినెస్ రూల్స్ తెలుసా..?
సీబీఐ టీంలో రిటైర్డ్ ఐఏఎస్ తప్పనిసరి
డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో రాజ్యాంగాన్ని... ప్రభుత్వ ఉత్వర్వులను అమలు చేస్తూ పాలనా వ్యవహారాలు చక్కబెట్టే అధికారులు వారు. ఇప్పుడు తమకు న్యాయం కావాలంటూ మీడియా ముందుకు వచ్చారు. రోజు రోజుకూ అవినీతి కేసుల్లో అరెస్టవుతున్న ఐఏఎస్ అధికారుల జాబితా పెరుగుతుండటంతో ఐఏఎస్‌లంతా ఒక్కటయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రికి విన్నవించారు.. ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయడమే తమ విధి అని... ఆ ఉత్తర్వుల వలన మంచి జరిగినా, చెడు జరిగినా.. ఆ ఘనత ప్రభుత్వాన్ని నడిపించే మంత్రులదే తప్ప తమది కాదని తేల్చి చెప్పారు. అలాగని అధికారుల తప్పు లేదని తాము లేదని వాదించడం లేదన్నారు. అధికారులెవరైనా ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుదోవ పట్టిస్తే విచారించాల్సిందే కానీ చట్టం దృష్టిలో అంతా సమానమే అన్న సూత్రాన్ని మరువరాదని ఐఏఎస్‌ల సంఘం గుర్తు చేసింది. కీలక నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులను వెలువరించిన మంత్రులను వదిలి ఆ ఉత్తర్వులను అమలు చేసిన తమను అక్రమాలకు కారకులుగా సీబీఐ వేధించడం శోచనీయమన్నారు. జీ.వోల వల్ల తప్పు జరిగితే దాన్నికి ముమ్మాటికీ మంత్రులే బాధ్యత వహించాలని కుండబద్దలు కొట్టారు. సీబీఐ బిజినెస్ రూల్స్ తెలుసుకొని మసలుకోవాలన్నారు.
అవినీతి ఆరోపణలతో అరెస్టు చేసినా బెయిల్ తో బయటకు రావచ్చు కదా.. చార్జి షీట్ దాఖలయినంత మాత్రాన నేరస్థులు కారని.. కోర్టులో తమ నిర్ధోషిత్వాన్ని రుజువు చేసుకొనే అవకాశం ఉందని ముఖ్యమంత్రితో సహా పలువురు వ్యాఖ్యానించడాన్ని ఐఏఎస్‌లు తప్పు బట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా.. విచారణ పేరుతో సీబీఐ తమను అవినీతి కేసుల్లో విచారణ నిమిత్తం అరెస్టు చేస్తే... దాన్ని మీడియా చిలువలు పలువలు చేసి చూపిస్తుందన్నారు. దీంతో బంధువర్గంలోనూ.. సివిల్ సొసైటీలోనూ ఒక ముద్దాయిగా ముద్రపడుతుందన్నారు. కోర్టు తీర్పు వెలువడే వరకు ఈ అవమానాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. సస్పెన్షన్ ఈజ్ నాటే పనిష్మెంట్ అనే సూత్రం తప్పని.. సస్పెన్షన్ అయిన వాడిని చిన్న చూపు చూస్తారని.. అలాగే తమను కూడా సీబీఐ అరెస్టు చేస్తే అవినీతి పరుడిగానే చూస్తారన్నారు. మీడియా, సీబీఐ మంత్రులను, అధికారులను సమదృష్టితో చూడాలని కోరారు. అక్రమాలకు బాధ్యులైన మంత్రులను పేషీల్లో విచారించి తమను మాత్రం కస్టడీలో విచారించడం ఏ న్యాయ విలువల్లో భాగమని ప్రశ్నించారు.
ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించడమో.. లేక పోరాట బాట పట్టడమో తమ అభిమతం కాదని.. జరుగుతున్న అన్యాయాన్ని మీడియా ద్వారా ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి తెలియజేయడమే తమ అభిమతమని ఐఏఎస్‌ల సంఘం తెలిపింది.
రకరకాల మంత్రుల వద్దా.. ముఖ్యమంత్రుల వద్దా కీలక నిర్ణయాలలో క్రియాశీల పాత్ర పోషించే అధికారులు అలక బూనారు. ఐఏఎస్ అంటే పాలనా వ్యవస్థ పైన గట్టి పట్టుంటుంనే ఉద్దేశ్యంతో మంత్రులు వివిధ రకాల నిర్ణయాలు తీసుకునే టప్పుడు వారిని ఒకటి రెండు సార్లు సంప్రదిస్తారు. గతంలో పనిచేసిన మంత్రులు ముఖ్యమంత్రులు ఐఏఎస్ ల సలహాలతోనే చాలా నిర‌్ణయాలు తీసుకున్న చరిత్ర ఉంది. ఆ నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురైతే ఆ తప్పును కప్పిపుచ్చి గండం గట్టెక్కించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు నిర్ణయాలు సొంతంగా తీసుకొని తప్పుకు అధికారులను బాధ్యులుగా చేసే సంప్రదాయం మొదలవడంతో ఐఏఎస్‌లు నోరువిప్పారు. ఇక ముందు నుంచి మంత్రులు ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనో లేక తాము చిక్కుకుంటామని అనుమానం వచ్చినా ఆ ఉత్తర్వులను సంఘంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.