ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, December 31, 2011

కొత్త సంవత్సరం ఇంత అసహ్యంగా... అశ్లీలంగానా..

కొత్త సంవత్సరం ఇంత అసహ్యంగా... అశ్లీలంగానా..

డిసెంబర్ 31 ఆహా... పొద్దున్నే బండి డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్‌కు వస్తుంటే.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. రోడ్ల పై అక్కడక్కడా పగిలిన సీసాలు నగ్నంగా కనిపిస్తున్నాయి. ఏ కసాయి వాడో వదిలిన కరుకు పెదవి ముద్రలను భరిస్తూ రోడ్డు పై కార్పోరేషన్ చెత్త లారీ కోసం ఎదురు చూస్తున్నాయి. అక్కడక్కడా కొత్త సంవత్సరం వచ్చిందని పొట్ట చింపుకున్న టపాసులు భారతదేశ పేదవాడి వస్త్రాల్లా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.. టీవీలన్నీ మారు మోగిపోతున్నాయి. కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయని. నేను కూడా ఓ వార్త రాయల్సివచ్చింది. అదీ ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు జరిగాయని రాశాను. దానికోసం ప్రియా ఓ ప్రియా చిత్రం నుంచి "కమ్మనికలలకు ఆహ్వానం.. హ్యాపీ న్యూఇయర్" అనే పాట కూడా తగిలించాను. ఇంతకీ కొత్త సంవత్సరం ఎంత ఘనం.. ఎంత వేడి వేడుకగా జరిగిందని వచ్చిన ఫీడ్ చూశాను. కేఫ్ టౌన్ నుంచి ఇండియా క్యాపిటల్ వరకు.. హైదరాబాద్ నుంచి కుశాయిగూడ వరకు సేమ్ హడావుడి. సేమ్ కల్చర్.. అర్ధనగ్నంగా నర్తించడం.. ఒంట్లో కొవ్వుపూసలను తరగలు తరగలుగా.. తరంగాలుగా కదిలించడం.. డిజిటల్ గిటారు నాదాలకు.. ప్యాడ్ ప్లేయర్ చేసే రొదలకు అనువుగా కాలు కదపడం.. మధ్యలో కాస్త ఓర చూపులు.. నడుమొంపుల నాట్యాలు.. పయోదర పీయూష మర్ధనాలు.. మధ్య మధ్యలో మద్యంలాంటి దాన్ని చుంబిస్తూ... ప్రియురాలిని మళ్లీ కొత్తగా హత్తుకుంటూ.. కొత్త ప్రేయసిలాంటి వ్యక్తికోసం వెతుక్కుంటూ.. రాత్రంతా వేడుకగా సాగింది.. కొత్త సంవత్సరం.. కానీ నాకెందుకో.. రోజూలాగే పొద్దు పొడిచిందనిపించింది.. భౌషా సూరీడికి కొత్త సంవత్సరం అని తెలిస్తే కొత్త కిరణాలు రాల్చేవాడేమో.. అర్ధనగ్నంగా ఉదయించేవాడేమో.. ఉదయం పూట పల్లెలో కోడి కూస్తూనే హ్యాపీ న్యూఇయర్ అని కూసేదేమో.. ఈ కుర్రకారు కారులో షికారు చేస్తూ అర్ధరాత్రి కారుకూతలు కూస్తూ.. హ్యాపీన్యూ ఇయర్ అంటే.. ఎవరికి హ్యాపీ.. ఎంతమందికి తెలుసు ఈ న్యూఇయర్ జిలుగులు నింపుతుందో.. వెలుగులు నింపుతుందో.. చీకట్లోకి దింపుతుందో.. కానీ ఒకటి తెలిసింది.. కొత్త సంవత్సరమంటే.. బహిరంగ అర్ధనగ్న నృత్యాలకు అధికార హోదా.. కండీషన్డ్ మద్యప్రియులకు ఆ రోజు ఫ్లెక్సిబిలిటీ.. కాస్త తిట్ల నుంచి వెసులుబాటు.. కానీ అదే మద్యం కొత్త సంవత్సరం రోజే విజయవాడ మైలవరంలో 14 మందికి పైగా పొట్టనపెట్టుకుంది.. అదే మద్యం హైదరాబాద్‌లో బైక్ పై వెళుతున్న నలుగురిని పొట్టన పెట్టుకుంది.1998లోనే కొత్త సంవత్సరం సందర్భంగా ఫుల్ బాటిల్ లాగిచ్చిన నాకు కొత్తగా జ్ఞానోదయం అయిందేమీ లేకున్నా.. ఎందుకో కొత్త సంవత్సరం అంటే ఇదేనా అనిపించింది. నా ఆరోతరగతిలో.. మీనా.. అట్ట బొమ్మను, రోజాపూల అట్ట బొమ్మను కత్తిరించి కవర్లోపెట్టి..దానివెనకాల హ్యాపీ న్యూయర్ అని అమ్మాయిలకు ఇచ్చే ప్రయత్నం చేయడం గుర్తుంది. వాళ్లు అదేదో లవ్ లెటర్ గా ఫీలయి.. మొహం ముందే చింపేయటం కూడా గుర్తుంది. దాన్ని ఇవ్వడానికి ఎంత కష్టపడేవాళ్లమో కూడా గుర్తుంది. కొత్త సంవత్సరమంటే తెల్లవారక ముందే లేచి ఇంటి ముందు సాన్పు జల్లి అమ్మ ముగ్గేస్తుంటే. రంగులతో హ్యపీ న్యూఇయర్ అని రంగులు దిద్ది.. ఊళ్లో అందరికంటే మన డిజైనే బాగుందని పొగుడుకోవడం గుర్తుంది. కొత్త సంవత్సరమంటే ఎక్జామ్స్ దగ్గరికొస్తున్నాయని మాస్టార్లు మందలించిన విషయం కూడా గుర్తే..

కానీ కొత్త సంవత్సరమంటే ఇంత అర్ధ నగ్నంగా.. ఓ దశ తరువాత పూర్తి నగ్నంగా.. మత్తుగా గమ్మత్తుగా ఉంటుందని అప్పుడు తెలియదు.. అసలు కొత్త సంవత్సరమంటే అదేనేమో.. ఎందుకంటే ఈ హైటెక్ వాళ్లు చేసేవన్నీ కొత్తగా ఏం లేవు.. కొత్తగా ఏమీ అనిపించవు.. ఎప్పుడూ చేసేవే.. రోజూ పబ్బుల్లో చేస్తున్నవే.. కాకుంటే ఇప్పుడు పిల్లల ముందే అధికారికంగా.. చేస్తున్నారు. తాగుతున్నారు. దమ్ము పీలుస్తున్నారు.. మత్తులో ఇంకేదేదో చేస్తున్నారు.. ఇవన్నీ రోడ్డు పై నుంచి నలుగురు పిల్లలు మాత్రం నిద్రగాచి చూస్తున్నారు. ఆ సంతోషాన్ని పంచుకోడానికి కాదు.. వాళ్లు వెళ్లిపోతే.. పడిపోయిన సీసాలను.. చెత్త కాయితాలను, ప్లాస్టిక్ బ్యాగులను ఏరుకుందామని.. ఆ ఒక్కరోజైనా కడుపు నింపుకుందామని.. కొత్త సంవత్సరం కదా.. వాళ్లు కూడా అర్ధ నగ్నంగానే ఉన్నారు.. ఫ్యాషన్ కోసం మాత్రం కాదు..

Wednesday, December 28, 2011

తుఫాన్‌లకు పేరెందుకు పెడతారో తెలుసా?

వికృత విలయాలకు అందమైన పేర్లు పెడుతుంటారు.. ఎందుకో తెలియదు గానీ... ఊర్లకు ఊర్లను ముంచెత్తిన తుపాన్ పేరు లైలా అన్నారు.. ప్రోఖ్రాన్ అణు పరీక్షలకు బుద్ద స్మైలింగ్ అన్నారు. ఇటువంటివి చరిత్రలో ఎన్నో.. ఎన్నెన్నో.. ఇప్పుడు కూడా చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాన్ కు థేన్ అని పేరు పెట్టారు. అసలు ఇంతకీ తుఫాన్ లకు పేరెందుకు పెడతారు. ఈ తుపాన్ లకు పేర్లు పెట్టే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలయిందో చెబుతాను వినండి

సముద్ర తీర ప్రాంతాలకు తుఫానుల ముప్పు కొత్తేమి కాదు.. సముద్రంలో అప్పుడప్పుడు వాతావరణంలో తేడాల వల్ల ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారి.. సముద్ర గర్భంలోనే సుడులు తిరుగుతూ కదలడాన్ని తుఫాన్ అంటారు. ఇక- అడపాదడపా తుపాన్లు మనల్ని వెంటాడుతూనే వున్నా..తరచుగా వస్తున్న ఈ ఉత్పాతాలను గుర్తించి, రికార్డు చేయడానికి వీలుగా వాటికి పేర్లు పెట్టడం మొదలు పెట్టారు. హిందూ మహాసముద్ర ఉత్తర ప్రాంతం తుపానులకు బలవుతుండటంతో ఈ ప్రాంతాన్ని తాకే తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ మొదలు పెట్టింది. బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడే తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 నుంచి మొదలైంది. ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రంగా ఏర్పడిన ఐఎండి ఏడు దేశాలకు వాతావరణ హెచ్చరికలను పంపుతూ వుంటుంది. తుఫాను గుప్పిట చిక్కే బంగ్లా దేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, థాయిలాండ్, శ్రీలంక దేశాలు వీటికి పేర్లు పెడతాయి. ఈ దేశాలు పంపే పేర్లను ఆయా సభ్య దేశాల ముందు అక్షరాలను బట్టి ఒక జాబితాలా తయారు చేస్తారు. ఇప్పటి వరకూ తుఫాన్లకు 64 పేర్లు సిద్ధం చేయగా వాటిలో 22 పేర్లను వాడారు. అవి ఐలా, ఫైయాన్, లైలా, ఫెట్ లాంటి పేర్లన్నీ ఉత్తర హిందూ మహాసముద్ర పరిధిలోని దేశాలు సూచించినవే. ఇవే కాక నర్గీస్, బందు.. అనే పేర్లను శ్రీలంక సూచించింది. 2006లో వచ్చిన తుఫానుకు ఓగ్ని అని పేరు పెట్టారు. 2008లో వచ్చిన తుఫానుకు ఖైముక్ అని నామకరణం చేశారు. అదే ఏడాది నవంబర్ 29న బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడింది.. దానికి నిశా అని పేరు పెట్టారు. ఇక 2010 మే 21న ఆంధ్ర కోస్తా తీరాన్ని కల్లోలపరచిన తుఫాను పేరు లైలా.. ఈ పేరు పెట్టమని పాకిస్థాన్ మన వాతావరణ శాఖను కోరింది. అరేబియా సముద్రానికీ తుఫాను బెడద వుంది. కాకపోతే బంగాళాఖాతంతో పోల్చితే తక్కువ.. అక్కడ 2007లో వచ్చిన తుఫానుకు గోను అని పేరు పెట్టారు.. అమెరికాలో తుఫాన్లకు పేరు పెట్టే సంప్రదాయం ఎప్పటినుంచో వుంది. అమెరికాను అతలాకుతలం చేసిన కత్రినా తుఫాను బీభత్సం ఆదేశాన్ని ఇప్పటికీ వణికిస్తూనే వుంది.

Saturday, December 24, 2011

పీవీ నరసింహారావు జీవితంలో మరోకోణం



భారతదేశ ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి తెలుగు వ్యక్తి.. ఆ మాటకొస్తే మొట్టమొదటి దక్షణ భారతదేశ పౌరుడు కూడా ఆయనే.. ఆర్ధిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న భారత ఆర్ధిక వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి గాడిన పెట్టిన ఘనత ఆయన సొంత.. అపర చాణిక్యుడిగా.. రాజకీయభీష్ముడిగా పేరొందిన పీవీ నరసింహరావు వర్ధంతి .. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఆటుపోట్లు.. ఇన్ని ఇబ్బందుల్లోనూ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడపగలిగిన మేథావికి దక్కాల్సిన గౌరవం దక్కిందా... అంతిమ గడియల్లో అవమానాలతో ప్రస్థానాన్ని ముగించాల్సి రావడం వెనుక కారణాలేంటి.. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా హెచ్ఎంటీవీ అందిస్తున్నప్రత్యేక కథనం
ఏ వ్యక్తయితే దేశ ఆర్ధిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశాడో... ఆ వ్యక్తినే అవినీతి ఆరోపణలు వెంటాడాయి.. ఎవరైతే వివాదాల జోలికి వెళ్లకూడదని అనుకున్నారో ఆయన్నే జీవితాంతం వివాదాలు ముంచెత్తాయి... పీవీ నరసింహారావుకు ఇటు ముఖ్యమంత్రి పదవి, అటు ప్రధాని పదవి ముళ్లకిరీటంలా మారాయి... అపర చాణక్యుడిగా పేరొందిన పీవీకి ఇన్ని కష్టాలు ఎందుకెదురయ్యాయి. తెలుసుకునే ముందు అసలు పీవీ ప్రస్తానం ఎక్కణ్ణుంచి... ఎలా మొదలయిందో తెలుసుకుందాం..
పీవీ నరసింహారావు.. ప్రతి తెలుగు వ్యక్తి ఎప్పటికీ గుర్తుంచుకొనే రాజకీయ నాయకుడి పేరిది... ఇటు రాష్ట్ర రాజకీయల నుంచి అటు జాతీయ రాజకీయాల వరకు ఆకళింపు చేసుకొని అందరి మన్ననలు పొందిన బహుబాషా కోవిదుడు. భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి తెలుగువాడు., భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివీ.. రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతనికే సాధ్యమయింది.
కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. అందులో ఉద్దండులకు కొదవలేదు. అయినా పీవీ నరసింహరావునే ఈ పదవి ఎలా వరించింది. ఈయన మాత్రమే అప్పట్లో అర్హుడని అధిష్టానం భావించడం వెనుక కారణాలేంటి..
1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడప్పుడే చల్లారుతోంది. తెలంగాణ ప్రజలను బుజ్జగించాలంటే తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలి. అప్పుడున్న ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న కర్తవ్యం. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని పీవీ వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి..
మఖ్యమంత్రి పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి మొదలయింది. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసాడు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది.
ముఖ్యమంత్రి పదవి ఆయనకు నిప్పుల కుంపటిలా మారింది.. పీఠం నుంచి దిగక తప్పని పరిస్థితి.. అన్నీ తానై నడిపిస్తున్న అధిష్టానం గీసిన గీత దాటలేక పదవిని వదులుకున్న విధేయతే.. ఆయన్ను ప్రధానిగా చేసింది.
ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తరువాత పీవీ దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నంత పని చేశారు. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యలేదు. రాజీవ్ గాంధీ హత్య తరువాత ప్రత్యేక గ్రూపు లేని పీవీ ప్రధాని పదవికి ఆమోదయోగ్యుడుగా కనపించాడు. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబాలకు చెందని మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి. అవిశ్వాస తీర్మానాన్ని గట్టెక్కించడానికి అక్రమాలకు పాల్పడ్డారని, జెఎంఎం సభ్యులకు ముడుపుల చెల్లించారనే ఆరోపణలు చుట్టు ముట్టాయి. అన్నిటికన్నా బాబ్రీ మసీదు వివాదం ఆయన్ను జీవితాంతం వెంటాడింది. బాబ్రీ కూల్చివేతను అడ్డుకోలేక పోయారనేది ఆయన పై ఉన్న అతి పెద్ద అపవాదు.
జీవితాంతం రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ అని కలవరించి నిజాయితీ కోసం పలవరించిన నాయకుణ్ణి నిర్ధోషిగా నిలబెట్టారు. నమ్ముకున్న పార్టీ కూడా చిన్నచూపు చూసింది.. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులేంటి.... పీవీని వెంటాడిన వివాదాల్లో పీవీ పాత్ర ఎంత.. ఈ విషయాలు.. ఆయనతో సుదీర్ఘంగా పనిచేసిన ప్రధాని సలహాదారు పీవీఆర్కే ప్రసాద్, కేంద్ర న్యాయశాఖా మాజీ కార్యదర్శి సీవీరావు గారు.. హెచ్ఎంటీవీ చీఫ్ ఎడిటర్ తో ఓసందర్భంలో తమ మనసులో మాట పంచుకున్నారు. అసలేం జరిగిందో.. వాస్తవాలేంటో చెప్పారు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన అపర చాణుక్యుడికి, ఇటు రాష్ట్రంలోనూ.. అటు జాతీయపార్టీలోనూ చెప్పుకోదగ్గ గౌరవం లభించలేదనే మెజారిటీ ప్రజల అభిప్రాయం..

Saturday, December 17, 2011

Friday, December 16, 2011

ఎక్సైజ్ అధికారుల అసలు బాగోతం ఇదేనని చాలా మందికి తెలియదు..



రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ అవినీతి పై ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అక్రమ ధనంతో బాటు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లిక్కర్ సిండికేట్ వ్యాపారులు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ముట్టజెపుతున్నారో స్పష్టంగా తెలిసింది. ఇప్పటికే కర్నూలు, గుంటూరు జిల్లాలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో వీటికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. దీంతో ఎక్సైజ్ మాఫియా ఎంతగా అల్లుకుపోయిందో అర్ధమవుతోంది..
రాష్ట్రంలో ఎంత కరువొచ్చినా... ఎన్ని ఇబ్బందులు వచ్చినా మద్యం విక్రయాలు మాత్రం తగ్గవు. రాష్ట్రం మొత్తం బందులు నిర్వహించినా ఆల్కహాల్ ఆగిపోదు.. మందుబాబులు ఒకరోజు అన్నంలేకుండానైనా ఉండగలరేమో గానీ.. ఆల్కహాల్ గొంతుదిగనిదే నిద్రపట్టదు. ఈ బలహీనతను ఆసరా చేసుకొని రాష్ట్రంలో మద్యం దుకాణ దారులు రెచ్చిపోతున్నారు. సిండికేట్ అయి ఎమ్మర్పీ రేట్లను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. ఇదేమిటని అడిగిన వారిని షాపు ముందే బెదిరించి పంపుతున్నారు. ఎక్కువ మాట్లాడితే దుమ్ము దులిపి వదిలేస్తున్నారు. రాష్ట్రలో మద్యం మాఫియా అంతగా వేళ్లూనుకొని పోయింది.
ఎమ్మార్పీ రేట్లకంటే ఎక్కు వ ధరకు అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు చెప్పినా ఫలితం శూన్యం.. ఎందుకంటే సిండికేట్లు ఎవరి స్థాయిని బట్టి వారికి నెలనెలా ముడుపులు కట్టి మరీ ఠంచనుగా అప్పజెపుతున్నారు. దీంతో మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులకు అనేక ఫిర్యాదులు అందటంతో రంగంలోకి దిగారు. ఈ దాడుల్లో విభ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. సిండికేట్లు ఎవరెవరికి ముట్టజెప్పుతున్నారో కూడా గుట్టు రట్టయింది.
ఏసీబీ దాడుల్లో కొందరు సిండికేట్ల నుంచి అభించిన అకౌంట్ల వివరాల ప్రకారం... నెలనెలా అందించే ముడుపుల జాబితా ఈ విధంగా ఉంది. స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీస్ వింగ్‌కు రెండువేలు, స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ వింగ్‌కు రెండువేలు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు 4 వేల రూపాయలు ముడుతున్నాయి. సబ్ డివిజనల్ స్క్వాడ్ ఎక్సైజ్ కు 3 వేల రూపాయలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు నాలుగు వేల రూాపాయలు, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌కు 10 వేల రూపాయలు ఇస్తే ఎక్సైజ్ డీసీకిమాత్రం 15వందల రూపాలు ముడుతున్నాయి. వీరితో బాటు లా అండ్ ఆర్డర్ ఎస్సై‌కు 5వేలు, సీఐకు 4వేలు, డీెఎస్పీకు 2వేల ఐదొందలు, నైటు బీట్ కానిస్టేబుళ్లకు 900, కొన్ని రకాల మీడియా ప్రతినిధులకు ఒక్కొక్కరికీ రెండు వేలు, ఎక్సైజ్ సీఐకు 12 వేలు, ఎక్సైజ్ ఎస్సైకు 8 వేలు, ఎక్సైజ్ పీఎస్‌లో మెన్‌‌కు 10వేలరూపాయలు.. వీరు కాక కొన్ని సంఘాలు.. ఇన్ని రకాల వ్యక్తులకు ముడుపుల రూపంలో ముల్లెలు అందుతున్నాయి. మొత్తంగా ఒక్కో బ్రాందీ షాపు నుంచి నెలకు 80 వేల రూపాయలు లంచాల రూపంలో అందుతున్నాయి. అందుకే ఎమ్మార్పీ రేట్లకు రెక్కలొచ్చి మద్యం రేట్లు చుక్కలనంటుతున్నాయి.
ఏసీబీ అధికారుల దాడుల్లో లభించిన ఈ లంచావతారాల లిస్టు చూసి అధికారులకు దిమ్మతిరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులుదాడులు చేస్తే.. పోలీసు శాఖలో, ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులెవరు మిగిలుండే అవకాశం లేదని వ్యాపారులే అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ రహస్యం.. మాట

www.youtube.com/watch%3Fv%3DWJuCurxh26o

Saturday, December 3, 2011

వెన్న ముద్దలు అలంకరిస్తేనే విన్నపాలకు వెన్నలా కరిగి పోయే హనుమంతుడిక్కడున్నాడు

\
వెన్న ముద్దలు అలంకరిస్తేనే విన్నపాలకు వెన్నలా కరిగి పోయే హనుమంతుడిక్కడున్నాడు
ఇప్పటివరకు వెన్నపాలు తాగి విన్నపాలు వినే కన్నయ్యనే చూశాం…కానీ వెన్నాభిషేకం చేసి విన్నవించుకుంటే చాలు ప్రసన్నమై కోరిన కోరికలు తీర్చే ప్రసన్నాంజనేయ స్వామిని నేటి తెలంగాణ ఆలయాల్లో చూద్దాం…
హైదరాబాద్ నగరంలోని దిల్ షుక్ నగర్ లో భక్తుల విశ్వాసాన్ని చొరగొన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత వుంది.హైందవ మతంలో ఆంజనేయున్ని సింధూరంతో అలంకరించి, గంగాజలంతో అభిషేకిస్తారు. కానీ ఈ ఆలయంలో స్వామి వారి ప్రతిమకు సింధూరంతో పాటు వెన్నను కూడా అలంకరిస్తారు. స్వామివారికి వెన్నను అలంకరిస్తే చాలు ఆయన మనస్సు వెన్నలా కరిగి తమ కష్టాలను తీరుస్తాడని భక్తుల విశ్వాసం.
దిల్ షుక్ నగర్ లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం 26 సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తులచే పూజలందుకొని కోరిన కోర్కెలు తీర్చే …రామబంటు కొలువై ఉన్న కోవెల ఇది.. ఈ ఆంజనేయ స్వామి ఎన్నో మహిమలు చూపించాడని భక్తులు చెప్పుకుంటారు.. ఈ స్వామి వారి మహిమలు ఖండాంతరాలు వ్యాపించాయి.అందుకే ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిట లాడుతుంటుంది. నిత్యం దీపధూప నైవేధ్యాలతో వేద మంత్రోచ్చారణలతో అసలైన ఆధ్యాత్మిక వాతారణం వెల్లివిరుస్తుంది.
ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరడంతో ఆలయప్రాంగణంలోనే శివాలయాన్నీ, రాధాక్రిష్ణుడి ఆలయాన్ని నిర్మించారు.ఆంజనేయ స్వామి దుష్టశక్తుల నుండి రక్షిస్తాడు. కానీ గ్రహపీడల నుంచి రక్షణ పొందేందుకు ఇక్కడ స్వామి వారి సన్నిధి లొనే నవగ్రహాలు ప్రతిష్టించారు.. భక్తులు ఈ నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి నవ ధాన్యలు, నువ్వుల నూనె, పాలు, కొబ్బరి నీళ్ళతో అభిషేకించి పూజిస్తారు..
ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ఆలయంలో అడుగు పెట్టకముందే మనకో అద్భుతం కనిపిస్తుంది.ఆలయ ముఖద్వారం ముందు భక్తులకు నేనున్నానని అభయమిచ్చే 36 అడుగుల ఎత్తు భారీ ఆంజనేయస్వామి విగ్రహం దర్శనమిస్తది. ఈ విగ్రహంలో శిల్పి అద్భుత నైపుణ్యం కనిపిస్తది.. పూర్వార్ధమున ఆంజనేయస్వామిగా పశ్చిమార్ధమున పరమేశ్వరునిగా దర్శనమిస్తడు..
ఇక్కడ గంభీరంగా ప్రసన్నవదనంతొ అభయమిస్తున్న ఈ స్వామిని చూసిన వారికి త్రేతాయుగంలో సుందర కాండను సృష్టించిన వాయు పుత్రుడే ఇక్కడ శిలారూపంలో వెలిశాడనిపిస్తది. ఈ భారీ విగ్రహన్ని మలిచిన శిల్పుల చేతుల్లో ఏ విశ్వకర్మదాగి ఉన్నడో..అందుకే ఈ నిలువెత్తు విగ్రహం ఆ ఆజానుబావుడి అంశతో అలరారినట్టు వుంటది. స్వామి ప్రసన్నవదనంతో సజీవంగా ఉన్నాడా అనే భ్రమ కలిగిస్తది. ఇది స్వామి మహిమా లేక శిల్పచాతుర్యమా.. అని ఇక్కడికొచ్చిన భక్తులు చర్చించుకుంటరు. ముఖ ద్వారం గుండా ఆలయంలోకి నాలుగు అడుగులేసి వెనుదిరిగిన చూస్తే అదే విగ్రహానికి మరో వైపు పరమేశ్వరుడిగా దర్శన మిస్తడు. ఇది చూసే భక్తులు ఇంతకుముందు మనం చూసింది ఆంజనేయుణ్ణా , లేక పరమేశ్వరుడినా అనే సందిగ్థంలో పడుతరు.
ఈ ఆలయంలో ప్రతి అనువు ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగించేలా ఉంటుంది. రామ నామం శివనామం ఆంజనేయస్మరణ తప్ప ఇక్కడి వచ్చిన వారికి మరొద్యాసే ఉండదు.. మరో ఊసే ఎత్తరు.స్వామి వారిని దర్శిస్తే చాలు సకల పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం స్వామికి పూజ చేసి మంత్రించిన రక్షాబంఢన్ ని కట్టుకుంటే ఏ దుష్ట శక్తులు దరిచేరవని భక్తుల నమ్మకం.. అందుకే ఎంత బిజీగా ఉన్నా... ఆ కాసేపు స్వామి దర్శనం కోసం కేటాయిస్తారు. చల్లగా చూడమని వేడుకుంటారు.
ఇంతకీ ఈ ఆలయంలో ఆంజనేయునడికి అలంకారంగా వెన్ననే ఎందుకు పెడుతారు. దేశంలో ఏ ఆంజనేయుడికి చేయని విధంగా దిల్ షుక్ నగర్ లోని హనుమంతునికి వెన్న అలంకారం ఎందుకు చేస్తరంటే దీనికి ఒక కారణం వుంది.ఆ కారణం ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
లోకంలో ఓ కొత్త సంప్రదాయం కనిపిస్తుందంటే దాని వెనుక తప్పకుండా ఏదో ఒక చరిత్రదాగి ఉంటది. లేదా ఊహాజనిత విశ్వాసం గానీ, మరచిపోయిన మన సంస్కృతి ఆనవాళ్ళు గానీ దాగి ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామికి వెన్నాలంకారానికి ఒక కారణం ఉంది. గతంలో ఒక భక్తుడు మంగళవారం మంగళప్రదమని భావించి వెన్నతో అలంకరించాడట.. అప్పుడు ఆ భక్తుడు కోరుకున్న కోరికలు నెరవేరాయి…. ఈ విషయం ఆనోట ఈ నోట ఆలయానికి వచ్చే భక్తులందరికీ తెలిసింది. అప్పటి నుండి నెలలో మొదటి మంగళవారం రోజున స్వామి వారికి వెన్నాలంకారం చేస్తూ వచ్చారు. అయితే ముందుగా స్వామి వారికి తమ మనసులో కోరికను విన్నవించుకుంటారు..తమను కష్టాలనుంచి గట్టెక్కిస్తే వెన్నాలంకారం చేయిస్తామని మొక్కుకుంటారు. అలా వేడుకున్న భక్తుల కోరికలు తీరడం తో స్వామి వారికి వెన్న అలంకారం చేసే భక్తుల సంఖ్య పెరిగింది. నెలలో మొదటి మంగళవారం రోజున ఈ వెన్నఅలంకారం చేసేవారు.. భక్తుల రద్దీ పెరగడంతో నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ అసౌకర్యాన్ని గుర్తించి ప్రతి మంగళవారం స్వామి వారికి వెన్న అలంకారం చేసే విధంగా వెసులుబాటు కల్పించారు. దీంతో ఒక్క నెలలోనే ఎక్కువ మంది భక్తులు వెన్నాలంకారం చేసి మొక్కు తీర్చుకుంటున్నారు. అయినా రోజు రోజుకీ వెన్నాలంకారం చేసే భక్తుల సంఖ్య పెరగడంతో ముందుగానే తమ పేర్లను నమోదు చేయించుకుంటారు. వరుస క్రమంలో స్వామివారికి వెన్నాలంకారము చేసుకుని తమ మొక్కుని తీర్చుకుంటారు. ఈ మొక్కును తీర్చు కోడానికి నెలల తరభడి వేచిచూడాల్సి వస్తుంది. ఈ ప్రసన్నాంజనేయ స్వామివారికి వెన్నాలంకారం చేయడం తమ జన్మ జన్మల పూర్వ ఫలంగా భావిస్తారు.
ఇంత మహిమ గల ఈ ఆలయం ఇన్ని లక్షల మంది భక్తుల విశ్వాసాన్ని పొందిన ఈ ప్రసన్నాంజనేయ స్వామి జయంతి వేడుకలు అంటే మాటలా.. ముక్కోటి దేవతలు ముంగిళ్ళలోకి వచ్చి వాలినట్టు... ఆ రోజున వాడ వాడ అంతా స్వామి నామ స్మరణతో సందడి చేస్తారు.
ఈ ఆలయంలో.. ప్రతి మంగళవారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నా ... దర్శించుకోక పోయినా హనుమాన్ జయంతి రోజున మాత్రం దర్శించుకోవాల్సిందే … హనుమాన్ జయంతి రోజున స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు.. సహస్ర కలశాభిషేకము చేస్తారు.. 108 మంది భక్తులకు ఒక్కొక్కరికీ ఒక్కో కలశాన్ని ఇచ్చి స్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రదక్షిణానంతరం ఆ జలంతో స్వామివారిని అభిషేకించిన వారికి ఉండే దృష్టి దోషాలు తొలుగుతాయని భక్తులు చెప్తారు.
ఈ ఆలయ నిర్మాణంలోనే ఒక విశిష్టత దాగివుంది. అలాగే విగ్రహ స్థాపనలో కూడా ఓ విశేషం ఉంది. అందుకే ఈ ఆలయానికి ఇంతటి ఘన కీర్తి వచ్చింది. ఇంతకీ ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలేంటి…

భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి గాంచిన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవాలంటే.. ఏడు ద్వారాలు దాటుకొని వెళ్ళాలి. ఆ ఆరు తలుపుల తరువాత ఏడో తలుపు తెరిస్తే గానీ అలివేలు మంగమ్మ తలపుల్లో ఉన్న ఆ ఏడుకొండల వాడి దర్శనం కలగదు.. అయితే ఆధ్యాత్మికతకు 7అంకెలకు అభినాభావ సంబంధం ఉండటం వల్లనే శ్రీ రంగంలో కూడా 7 ప్రాకారాలు నిర్మించిన్రు. అలాగే ఇక్కడ ఈ ప్రసన్నాంజనేయ స్వామిని చేరుకోవడానికి 7 మార్గాలున్నాయి. ఇది యాదృచ్ఛికమో.. కాకతాళియంగానో లేదా దైవ మహిమ వల్ల కలిగిందో కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడుకి, శ్రీ రంగ నాధుడికి వచ్చిన ఖ్యాతి ఈ ప్రసన్నాంజనేయునికి వచ్చింది.
ఈ స్వామి వారికి మరో విశేషం వుంది. హనుమంతుడు చిన్నప్పుడు ఉదయించే సూర్యుణ్ని చూసి... ఎర్రని పండుగా భావించి తినడానికి వెళ్తాడు. దీన్ని గమనించిన ఇంద్రుడు అడ్డుకొని వజ్రాయుధంతో శిక్షిస్తడు. ఆ దెబ్బకి ఆంజనేయుడి హనువు అనే దంతం విరగడం వలన హనుమంతునిగా కీర్తింపబడ్డాడు. ఆ తరువాత జరిగిన తప్పిదాన్ని గుర్తించిన దేవతలు హనుమంతుణ్ణి, వాయు దేవుణ్ణి తృప్తి పరిచి వరాలిస్తరు. అలా మొదలైన సూర్య హనుమంతుల బంధం ఈ ఆలయంలో అనుకోకుండానే గుర్తుకు తెస్థాయి. ఈ ప్రసన్నాంజనేయ స్వామి హృదయంలో కొలువైన సీతారామచంద్రులను సూర్యోదయపు తొలికిరణాలు తాకి స్వర్ణశోభితం చేస్తాయి. హనుమంతుని గుండెల్లో... ఆ ఆదిత్యుడు కొలువై ఉన్నాడని కళ్ళకు కట్టినట్టు రుజువు చేస్తాయి. అరస వల్లిలో సూర్యభగవానుని పాదాల చెంతనే కనిపించే ఈ సూర్యకిరణాలు.. ఈ ఆలయంలో ప్రసన్నాంజనేయ స్వామి గుండె గుడిపై ప్రకాశిస్తాయి. ఇది ఈ ఆలయానికున్న ఓ మహత్తర శక్తిగా భక్తులు చెప్పుకుంటారు.
ఈ ఆలయంలో ప్రతి పర్వదినాన్నీ... అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టిన వారికి సకల దేవతల దర్శనం కలుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రసన్నాంజనేయ స్వామితో పాటూ శివుణ్ణీ.. రాధాక్రిష్ణులను, నాగదేవతను, నవగ్రహాలను దర్శించుకుంటారు..
ఈ ఆలయంలో ప్రతి పర్వదినం నేత్ర పర్వమే.. ప్రతి పండుగ కన్నుల పండుగే ఆలయానికి చిన్నా పెద్దా తేడాలేకుండా అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు స్వామిని దర్శిస్తారు. ఆలయంలో శివునికి కార్తీక మాసంలో పూజలు జరుపుతారు. మహన్యాస పూర్వక రుద్రాభి షేకాలు, లక్షభిల్వార్చనలతో పూజిస్తారు. తొలి పొద్దువేళలో , మలి సంధ్య వేళలో కార్తీక దీపాలతో అలంకరిస్తారు. స్వామివారు యోగ నిద్ర నుంచి మేలుకోని కనిపిస్తడని కార్తీక పూరాణం చెబుతుంది. ఆ నమ్మకంతోనే భక్తులు శివార్చరనలు చేస్తారు.
ధనుర్మాసంలో ఇక్కడి రాధాక్రిష్ణ ఆలయంలో.. గోదా దేవికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు.. ఈ గోపాలుడికి ఆబాల గోపాలంగా వేడుకలు చేస్తారు..శ్రీ క్రిష్ణా అష్టోత్తర నామాలను గొదా శ్రీక్రిష్ణ కళ్యాణోత్సవమును అత్యంత వైభవోపేతంగా జరుపుతారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నవారికి కళ్యాణ గడియలు సమీపిస్తాయని ప్రతీతి..
ఈ ఆలయంలో ఎన్ని అలంకారాలు జరిగినా వెన్నాలంకారానికున్న ప్రాముఖ్యతే ఈ ఆలయానికి ఇంత పేరు తెచ్చిపెట్టింది. స్వామి వారికి వెన్నాలంకారం చేసిన తరువాత స్వామి వారి సన్నిదిలొ ఒక శ్లోకం చెప్పిస్తారు. ఈ శ్లొకానికి అర్ధమేమంటే నేను ఎక్కడికి వెళ్ళినా సధా నావెంటే వుంటూ నన్ను రక్షించమని అర్ధం..
ఇదీ దిల్‌సుఖ్‌నగర్ ప్రసన్నాంజనేయ స్వామి చరిత్ర