ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, November 18, 2009

యగంతం వట్టిమాట

యావత్ ప్రపంచాన్ని భయపెడుతున్న మాట డిసెంబర్‌21, 2012. ఈ తేదీ నుంచి ప్రపంచం అంతమై తిరిగి కొత్త సృష్టికి పునాదులు పడతాయని కథనాలు వినిపిస్తున్నాయి. దీనకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది కారణాలు చెబుతున్నారు. ఇందులో ఏ ఒక్కటి జరిగినా వినాశనం తప్పదని చెబుతున్నారు... అయితే వీరు చెప్పే కథలన్నీ కట్టుకథలా...కల్పనలా.. ఇవన్నీ నిజమయితే వీటికి శాస్ర్తీయమైన ఆధారాలేమైనా ఉన్నాయా... వీటి గుట్టు విప్పే స్పెషల్‌ స్టోరీ
ప్రళయం..యుగాంతం..డూమ్స్‌డే... రెండవ రాకడ. పదాలేవైనా కావచ్చు.. సాహిత్యం ఏదైనా కావచ్చు..అన్నిటి సారం ఒకటే. రానున్న రోజుల్లో ఈ ప్రపంచం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని భాష్యం చెబుతున్నాయి.అయితే ఈ మత గ్రందాలల్లో యుగాంతం ఎప్పుడు జరుగుతుందో స్పష్టమైన తేదీలను ప్రకటించడంలో స్పష్టత లేదు. ఆయా కాలమాన ప్రకారాలను బట్టి వారి కేలండర్ లెక్కల ప్రకారం సృష్టి అంతానికి లెక్కలేసి మారీ చెప్పారు. ఆ కాలండర్‌ లెక్కలు మనవారికి అర్దం కాకపోవడమే పుకార్లు రేపే వారికి కలిసి వచ్చింది.
అసలు యుగాంతం వస్తుందని ఎవరు చెప్పారు.ఒకవేళ ప్రళయం ముంచుకొచ్చినా అది ఏ రూపంలో వస్తుంది.. ఒక్కో శాస్ర్తం ఒక్కోరకంగా చెబుతోందట. అసలు శాస్ర్తం చెబుతుంది అనే కంటే మనవాళ్లు చెబుతున్న కారణాలను ఒకసారి పరిశీలిద్దాం.మాయన్‌ కాలండర్‌..ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న మాట... ఈ కాలండరే యుగాంతాన్ని సూచించిందని చెబుతున్నారు.ఎందుకంటే అన్ని కాలండర్‌ల కంటే కూడా ఈ కాలండర్‌ 99శాతం భవిష్యత్తుని వాస్తవానికి దగ్గరగా చెప్పిన కాలండర్‌. 2012 డిసెంబర్‌ 21తో ఈ కాలండర్‌ ముగుస్తుంది.అంటే అక్కడి నుంచి ఇక ప్రపంచంలో జీవ రాశికి భూమిపై మనుగడలేదని అభినవ నోస్ర్టడామస్‌లు భాష్యం చెబుతున్నారు. ఈ కాలండర్‌ ప్రకారం 2012లో ఖగోళ అద్బుతాలు జరుగుతాయని, ఇవి భూమిపై జీవరాశి మనుగడకు ముప్పుతెస్తాయని వాదిస్తున్నారు. అంతే కాదు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు.
ఇది వాస్తవమేనా....అది తెలుసుకునే ముందు అసలు మాయన్‌ కాలండర్‌ అంటే ఏంటో తెలుసుకోవాలి. మెక్సికో యుకటన్‌ ద్వీపకల్పంలో అతి ప్రాచీన నాగరికత మాయన్‌ .వీరి శాస్ర్తపరిజ్ఞానం ప్రకారం అనాటి గ్రహగతులను అనుసరించి క్యాలండర్‌ తయారు చేశారు. ఈ క్యాలండర్‌ ప్రకారం ఒక్కో సంవత్సరంలో జరిగే సంఘటనలను చిత్రీకరించారు. ఇవి కేవలం ఖగోళ లెక్కలకు సంబంధించినవి మాత్రమే. ఈ కాలండర్‌లో ఇతర విషయాలు అనేకం పొందు పరిచినా అవి బయటి ప్రపంచానికి సంబంధం లేనివి. కొన్ని కేవలం వారి నాగరికతకు మాత్రమే సంబందించినవి. కొన్ని వారి సంప్రదాయాలకు అలవాట్లకు సంబంధిచిన వివరాలున్నాయి. వాస్తవానికి ఈ కాలండర్‌ను సంపూర్ణంగా అధ్యయనం చేసే పూర్తి స్థాయి పరిజ్ఞానం ఎవరికీ అందుబాటులో లేదు. మన కాలండర్‌లలో గ్రహణాలు, కాలాలు, రుతువులను లెక్కగట్టినట్టే వారు కూడా కొన్ని వేల సంవత్సరాలకు సరిపోను క్యాలండర్ తయారుచేసి పెట్టుకున్నార.ఇవి చిత్రరూపంలో తయారు చేసి పెట్టుకున్నరు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా మన పంచాంగం లాంటిదే.. అయితే మన పంచాంగంలో అన్నీ అనుకున్నట్టు జరగనట్టే ఈ మాయన్‌ క్యాలండర్‌లో కూడా అన్ని అంశాలూ వాస్తవాలు కావంటున్నారు దీని గురించి అధ్యయనం చేసిన వాళ్లు.
అసలు వచ్చిన చిక్కల్లా మాయన్‌ కాలండర్‌ 2012తో పూర్తి కావడమే ఇన్ని అపోహలకు దారి తీసింది. మాయన్‌లు చాలా తెలివైన వారని, ఒక యుగానికి సరిపోనూ క్యాలండర్‌ను రూపొందించుకున్నారని వీరు చెబుతున్నారు. అయితే 2012తో ఈ కాలండర్‌ పూర్తికావడమే ఇన్ని పుకార్లకు ఊతమిచ్చింది. ఈ కాలండర్‌ ప్రకారం 2012లో భూమి పై అద్బుతాలు జరుగుతాయని, అంతరిక్షంలో మార్పులు సంభవిస్తాయని వివరించారు. ఇవి మానవ మనుగడకు ప్రమాదకరమని తెలిపారు. ఈ విషయం చెప్పుకునే ముందు మనం మరో విషయం తప్పక గుర్తుంచుకుంటే అసలు విషయం తేట తెల్లం అవుతుంది. వీరి క్యాలండర్‌లో ఒక్క 2012లోనే కాదు క్యాలండర్‌లో చాలా సంవత్సరాలలో ఈ డిజాస్టర్‌ల ప్రస్తావన ఉంది. కానీ కేవలం 2012తో ఈ కాలండర్‌ ముగుస్తుండటంతో అక్కడి నుంచి క్యాలండర్ అక్కర్లేదని మాయన్‌లు భావించారని సూత్రీకరిస్తున్నారు మన వాళ్లు కొందరు.
కానీ మాయన్‌ కాలండర్‌ని బాగా అధ్యయనం చేసినవారు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. అంతేకాదు అబద్దపు ప్రచారాలతో మాయన్‌ నాగరికతనే తప్పుబట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని మండి పడుతున్నారు. మాయన్‌ లెక్క ప్రకారం 2012కి ఒక శకం పూర్తవుతుంది. దాని తర్వాత మరో శకం మొదలవుతుంది. ఒకవేళ మాయన్‌ నాగరికత కొనసాగి ఉంటే ఆ తర్వాత శకానికి సరిపోను క్యాలండర్ రూపొందించే వారని తెలిపారు. అంతేగానీ ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా కాలండర్‌ పూర్తవగానే ప్రళయం వస్తుందని ప్రచారం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమంటున్నారు శాస్ర్తవేత్తలు.
నిజంగా మాయన్‌ క్యాలండర్ భూ ప్రళయం వస్తుందని చెప్పలేదా... హమ్మయ్య ఇప్పటి వరకూ హడలి చచ్చాం అనుకుంటున్నారా..అవును మాలాగ విప్పి చెప్పేవాళ్లుంటే మీరిలాగే రిలాక్సవుతారని తెలీదా ఏంటి. అందుకే మాయన్‌ కాలండర్ ఒకటే కాదు ప్రపంచం మొత్తం తుడిచిపెట్టుకు పోవడానికి మరో కారణం కూడా ఉందట.సూర్యుడు..ఈ భూమిపై సకల జీవ జాతుల మనుగడకు కారణభూతం... అటువంటి సూర్యుడే ప్రళయకాల రుద్రుడై కబళిచ బోతున్నాడట. సూర్యగోళంలో పేలుళ్లు సంభవించి వాటి ప్రభావం భూమి పై నున్న జీవరాశి పై పడుతుందని వీరి వాదన. సూర్యుని ఉపరితలం పై ఉన్న సన్‌స్పాట్ల నుంచి విడుదలయిన మాగ్నటిక్‌ వేవ్స్‌ భూగోళం పై ఉన్న సమస్త జీవరాశిని ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా, భూ ధృవాలను కూడా తిమ్మిని బమ్మిని చేస్తుందని వీరు వాదిస్తున్నారు. అంటే ఉత్తర ధృవం దన ధృవంగానూ, దక్షణ ధృవం ఉత్తర ధృవంగానూ మారతాయట. అంటే అప్పటినుంచీ మనం సూర్యుడు పడమర ఉదయిస్తాడని చదువు కోవాన్నమాట. అసలు చదువుకోడానికి మనం బతికి ఉంటేగా అని భయపెడుతున్నారు వీళ్లు.నిజంగా సూర్యుడు మనకు అపకారం చేయబోతున్నాడా..ఈ విషయం తెసుకునే ముందు అసలు సూర్యుడంటే ఏంటో తెలుసుకుందాం...సూర్యగోళం భూమికంటే ఎన్నోరెట్లు పెద్దది. ఇది హైడ్రోజన్‌ ఇంధనంగా భగభగా మండుతుంది. ఈ అత్యోష్ణంలో హైడ్రోజన్‌ అయానులు సంలీనం చెంది హీలియం అయానులుగా మారుతాయి. అణు విచ్చిత్తిలో వెలువడిన శక్తే అణువిలీనంలో కూడా ఏర్పడుతుంది. అంటే ఒకరకంగా చెప్పాలంటే సూర్యడిలో నిరంతరంగా లక్షలాది అణుబాంబులు పేలుతున్నాయన్నమాట. మన అణుబాంబులు పేలినపుడు వెలువడే రెడియేషన్‌ అక్కడ కూడా విడుదలవుతుంది. అయితే అది మనదాకా రాదు.ఈ సూర్యుడి ద్రవ్యరాశి అంటే బరువు సౌరకుటుంబంలో ఉన్న అన్ని గ్రహాల మొత్తం బరువు కన్నా కేవలం పది శాతం మాత్రమే తక్కువ ఉంటుందని శాస్ర్తవేత్తలు లెక్కగట్టారు.సూర్యుడి ఉపరితలంలో ఉన్న సన్‌స్పాట్‌ల నుంచి నిరంతరం మాగ్నటిక్‌ వేవ్స్‌ రిలీజ్‌ అవుతూనే ఉంటాయి. వీటి సంఖ్య ఒక్కోసారి తక్కువగా ఉంటే ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల మనకు వచ్చే ముప్పు ఏమీలేదు. అలా ముప్పు జరిగేది ఉంటే 11 ఏళ్లకొకసారి ఈ భూమి భ పటలం అయ్యేది. సో సూర్యుడి వల్ల కూడా మనకు అపాయం లేదు.సూర్యని వల్ల కూడా భయం లేదని అప్పుడే సంబర పడిపోకండి. అన్నిటికన్నా అత్యంత భయంకరమైన, ఎవరూ కాపాడలేని ముప్పొకటి పొంచి ఉందట. దాని వల్లనే గతంలో ఈ భూమి పై చాలా జీవరాశులు నశించిపోయాయట. ఆ కథలన్నీ కంచికి పోయాయికానీ..మనల్ని మాత్రం కాశీకి చేర్చే కథొక్కటి సిద్దం చేశారు. దీనికీ మన పురాణాలకూ, బైబిల్‌, ఖురాన్‌లు కూడా ఇదే చెబుతున్నాయని లింకు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ భూమి పుట్టిన దగ్గర్నుంచి దీనికో గండం ఉంది. ఈ అనంత విశ్వంలో అనేక గ్రహశకలాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇవి వాటి కక్ష్యలో అవే తిరుతుంటాయి.కానీ ఇవి భూమికి దగ్గరగా వచ్చినపుకు మాత్రం అవి తమ దిశ మార్చుకుంటున్నాయి. కక్ష్యా వేగంలో మార్పులు చేసుకుంటున్నాయి. ఇలా కక్ష్య దాటి భూమిపైకి వచ్చి భూమిని ఢీకొన్న గ్రహశకలాలకు లెక్కలేదు. అయితే కొన్ని భూ వాతావరణంలోకి రాగానే భూమిని తాకకుండానే పేలిపోతాయి. వాటినే మనందరం చుక్కతెగిందంటూ పిలుచుకుంటా. మరికొన్ని మాత్రం భూమికి మరీ దగ్గరగా వచ్చిపేలిపోతే ఇంకొన్ని సముద్ర గర్బంలోకి దూసుకుపోతాయి. ఇవి ఆకాశంలోనే పేలిపోవడమా లేక భూమిని చేరడమా అనేది వాటి పరిమాణాన్ని బట్టి ఉంటుంది.
ఈ గ్రహశకలాలు చిన్నవయితే ఆకాశంలో పేలుతాయి. కాస్త పెద్దవయితే భూమికి దగ్గర్లో పేలిపోతాయి. మరీ పెద్దవయితే భూమిని తాకుతాయి. అధృష్టవశాత్తూ ఇప్పటి వరకూ అత్యధికం సముద్రంలో కూలినవే అధికం. కాబట్టి ఏ ప్రమాదమూ రాలేదు. మరి గ్రహశకలాల మాట అటుంచి మన భూమిని ఏకంగా ఒక కొత్త గ్రహమే ఢీకొంటే... ఆలోచన వచ్చిందే మొదలు కొత్త గ్రహం గురించి పుంకానుపుంకానుగా పుకార్లు పుట్టించారు. అ గ్రహం పై కూడా కాసేపు విహరించండి మరి.సౌరకుటుంబంలో ఇప్పటి వరకూ మనకు నవగ్రహాల గురించే తెలుసు. కానీ తాజాగా పదవ గ్రహం వెలుగులోకి వచ్చింది. దాని పేరే నిబ్రో. దీన్నే ఎక్స్‌ గ్రహం అని కూడా పిలుచుకుంటున్నారు. దీన్ని మొట్ట మొదట సుమేరియన్‌లు గుర్తించి నట్టు చెబుతున్నారు. ఈ గ్రహం 3600 సంవత్సరాలకొకసారి గురు, శుక్రగ్రహాల మధ్య గుండా ప్రయాణిస్తుందని సుమేరియన్‌లు తెలిపారు. ఈ సారి ఈ గ్రహం శుక్ర గ్రహం ఇవతల నుంచి అంటే భూమికి శుక్రగ్రహానికీ మధ్యనుంచి ప్రయాణించబోతోందని, అది భూ ప్రభావానికి భూమి వైపు ఆకర్షించబది భూమిని ఢీకొనే ప్రమాదముందని ప్రచారం చేస్తున్నారు. ఇది సరిగ్గా సముద్రం మధ్య ఢీకొని సముద్రాలు ఉప్పొంగి భూగోళం పై ఉన్న నాలుగోవంతు భూమి మొత్తాన్ని ముంచేస్తుందని చెబుతున్నారు. ఒక వేళ నేలను ఢీకొంటే భూగొళం పేలిపోయి ముక్కలు చెక్కలు విడిపోతుందని ప్రచారం చేస్తున్నారు. దీంతోబాటు అపోసిస్‌ అనే గ్రహశకలం కూడా భూమిని ఢీకొట్టబోతోందని చెబుతున్నారు. దీన్ని మత గ్రంధాలకు కూడా లింకు పెట్టి మరీ భయపెడుతున్నారు. పాపులను తుడిచిపెట్టేందుకు యేసు భూమిపై పెద్ద బండ వేస్తాడన్న బైబిల్‌ వాక్యంలోని మాటలకు ఇదే అర్దం మని చెబుతున్నారు. ఖురాన్‌లో కూడా ఇదే అర్దాన్ని స్పురింపజేసే డూమ్స్‌ డే కూడా ఇదేనని చెబుతున్నారు. అంతేకాదు బ్రహ్మంగారు చెప్పిన నిప్పుల వర్షం కూడా ఇదేనట. ఇవన్నీ విన్నాక కూడా ఎంత తెలివి కల వాడైనా నమ్మితీరాల్సిందే.
వాస్తవానికి సౌరకుటుంబంలో దశమగ్రహమనే ప్రస్తావనే లేదు. ఈ విషయాన్ని నాసా శాస్ర్తవేత్తలే చెబుతున్నారు. నిబ్రో అనేది కానీ, ప్లానెట్‌ ఎక్స్‌ అనేదైనా కేవలం అభూత కల్పనని నిపుణులు తేల్చేశారు. దాదాపు పది సంవత్సరాల వరకు భూమివైపు వచ్చే గ్రహ శకలాలు, వాటి పరిణామం, ఉధృతి,వేగం అన్నీ అధ్యయనం చేసి ఉంచుకున్నారు. దాదాపు నాలుగొందల కోట్ల ఏళ్ల వరకూ భూమికి హానిచేసే గ్రహశకలాలేవీ ఇప్పటి వరకు ఆచూకీ లేవు.2012లో భూమిని ఢీకొనే గ్రహం ఏదైనా ఉంటే ఇప్పటికే భూమికి అత్యంత సమీపంలోకి వచ్చి ఉండాలి.కానీ ఏ గ్రహం కానీ గ్రహ శకలం కానీ ఇప్పట్లో భూమి వైపు వచ్చేవి లేవు. ఒకవేళ పెద్ద పరిమాణముండే గ్రహశకలాలేవైనా ఉన్నా వాటిని తప్పించేందుకు అన్ని ఏర్పాట్లూ తమ వద్ద ఉన్నాయని నాసా శాస్ర్తవేత్తుల భరోసా ఇస్తున్నారు.
అప్పుడే ఊపిరి గట్టిగా పీల్చుకోకండి. ఎందుకంటే బయటగ్రహాలనుంచి భయం లేకున్నా మానవ తప్పిదాలే మరో మూడేళ్లలో మనల్ని మట్టుబెడతాయట. భూమి తనకు తానే కుంగిపోయి కొత్త తొడుగు తొడుక్కుంటుందట. అదెలాగంటారా. ఇదిగో ఇలాగే...
భూగోళం అనేక పోరలతో నిర్మితమై ఉంది. ఈ పోరల్లో అప్పుడప్పుడూ సర్దుబాట్లు జరుగుతుంటాయి. అందులో బాగంగానే భూకంపాలు, సునామీలు సంభవిస్తుంటాయి. భూ కేంద్రంలో సలాసలా ఉడకిపోయే లావాద్రవం ఉప్పొంగుతుంటుంది.ఇది అగ్ని పర్వతాల రూపంలో బద్దలయి భూ ఉపరితలం పై ప్రవహిస్తుంది. అయితే కొన్ని సార్లు ఇవి ఉగ్రరూపం దాల్చి చాలా ప్రాంతాలను తమ నిప్పుశిఖలతో ముంచేస్తుంటాయి. అమెరికాలోని ఎల్లోస్టోన్‌ అగ్నిపర్వతం ఇదే విధంగా బద్దలు కాబోతుందని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు మనుషులు చేస్తున్న కాలుష్యం మూలంగా భూ వాతావరణం కూడా వేడెక్కబోతోంది. వీటికి తోడు ఓజోన్‌ పొర దెబ్బతిని సూర్యకిరణాలు, అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని తాకి జీవజాలం పై ప్రభావాన్ని చూపుతాయట. ఈ వేడికి మంచు పర్వతాలు కరిగి సముద్రంలో కలిసి భూమిని ముంచెత్తుతాయని చెబుతున్నారు. అంతే కాదు మన శాస్ర్తవేత్తలు చేస్తున్న బిగ్‌బాంగ్‌ ప్రయోగంలో పుట్టుకొచ్చే బ్లాక్‌హోల్స్‌ కూడా భూమిని మింగేసే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు సోకాల్ట్‌ భవిష్యదార్శినికులు. ఇందులో వాస్తవమెంత ఉన్నా అది అంత తొందరగా 2012 కల్లా భూమి బద్దలయ్యేంత ప్రమాదమయితే లేదని శాస్ర్తవేత్తలు భరోసా ఇస్తున్నారు.ఇదండీ భూ ప్రళయం 2012 అసలు కథ. ధనార్జనే ధ్యేయంగా కొన్ని సంస్థలు చేస్తున్న ఆర్బాటమే అసలు ప్రళయం. భూమికి వచ్చే ప్రళయం మాట ఎలా ఉన్నా ఈ పేరుతో తీసిన సినిమా కాసుల ప్రళయం సృష్టిస్తుంది.

సెజ్

ఆశలు ఆకాశంలో... విధులు ముఖద్వారంలో
సెజ్‌లపై స్పెషల్‌ స్టోరీ
-గుర్రం సీతారాములు
రీసెర్చ్‌ ఫెలో EFLU
ఈ మధ్య వెస్ట్‌ బెంగాల్ నుంచి సమంతా అగర్వాల్ అనే రీసెర్చ్‌ స్టూడెంట్ తన ప్రాజెక్ట్ లో భాగంగా పోలేపల్లి సెజ్‌ ప్రాంతాన్ని చూడాలనీ, ఆ విషయాన్ని HBT గీత గారు ఫొన్‌ చేసి నన్ను కూడా వెళ్లమంటే వెళ్లాను. అక్కడికి వెళ్లకముందు అది చిన్న పల్లెటూరని భావించాను. అక్కడికి వెళ్లాక విశాలమైన హైవేను చూస్తే ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న ఊరికి ఇన్ని హంగులు ఏమిటా... అనిపించింది. కొంచెం ముందుకు వెళ్లగా నాకు ఏ బెంగుళూర్‌, బొంబాయి, ఢిల్లీ ఇండస్ట్రియల్‌ పార్క్‌లకు వెళ్లినట్టు అనిపించింది. ఎక్కడెక్కడి మల్టీనేషనల్‌ కంపెనీలు ఆ వూరిమీద గద్దల్లా పడ్డారేమో అనిపించింది. మల్టీప్లెక్స్‌ బిల్డింగ్‌లు, వాటి చుట్టూ పటిష్టమైన ఇనుపకంచె, విద్యుత్‌ లైన్‌లు చూస్తే ప్రభుత్వానికి ఆ ఊరిమీద మమకారం కంటే ఇండస్ట్రియల్‌ పార్క్‌ మీద ఉన్న ప్రేమ ఏ పాటిదో అర్ధమవుతూనే ఉంది.
కొంచెం ఊళ్లోకి వెళ్ళాక ఊరి నిజ స్వరూపం కనబడింది. ఏ ఒక్క ఇల్లూ సఖంగా ఉన్నట్టు అనిపించలేదు. ఎవ్వరిని కదిలించినా కన్నీళ్లే. ఇంటింటా విషాదం తాండవం చేస్తోంది. ఆరుగాలం కష్టపడి పని చేసిన వ్యక్తులు చేసేందుకు చేతినిండా పనిలేక గుంపులు గుంపులుగా రచ్చబండ దగ్గర దిగాలుగా కూర్చున్న దృశ్యం నన్ను కదిలించింది. ఊళ్లో ఎక్కువ మంది తగిన ఉపాధి లేక ఇళ్లకు తాలాలు వేసి వలస పోయిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి.
పోలేపల్లి, దాని సమీపంలోని గుండ్లగండ్ల తండ, ముదిరెడ్డిపల్లి, మాచారం, కిష్టారం, ఈ విషాదం బారిన పడ్డ గ్రామాలు, ఉపాధి లేదనే నిస్సహాయత, వలసల మానసిక వ్యాకులతతో అసహజ మరణాలు చెప్పనలవికానివి. ప్రక్కనే ఉన్న ఓ తండాలో అరవై సంవత్సరాలు దాటిన ముసలవాళ్లు, చిన్న పిల్లలు మాత్రమే మిగిలారు. బాధాకరమైన విషయమేమిటంటే ఎవరైనా చస్తే పీనుగను బొంద పెట్టడానికి కూడా నేల లేకుండా చేసిన వైనం ఆ తండాలో నాకు కనిపించింది. ఏ వ్యక్తిని కదిలించినా కళ్లలో నీళ్లే కనిపిస్తున్నాయి. ప్రతి కుటుంబానికి ఉపాధి, పక్కా గృహం అనేది ఒట్టి మాటే అని నాలుగు ఏళ్ల తర్వాత తెలిసింది. నేను మందలించిన ప్రతి ఇంట్లో మనాదితో అసహజ మరణాలు సంభవించాని, అసహజ మరణాలకు నిలయమైన ఆంధ్రదేశంలో అక్కడ జరిగిన మరణాలు కేవలం ఇంతకాలం తాము నమ్ముకున్న భూమి కళ్లముందే కబ్జా దారులకు ఆటస్థలంగా మారిన వైనం, అదే భూమిలో, ఊడ్చేవాడుగా, తూచ్చేవాడుగా, సెక్యురిటీ గార్డుగా మారడమే విషాదం. ఉపాధి అంటే ఇదేననే సత్యం తెలుసుకొనేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. తమ భూములకోసం ధర్నా చేస్తున్న తమ తోటి వాళ్లను తామే తమ యజమానులకు మానవ కవచాలుగా మారడం ఎంత విషాదం. ఈ విషాదంలో అత్యధికంగా నష్టపోయిన వాళ్లు దళిత బహుజనులు, దాదాపు మూడు వందలకు పైగా ఎసైన్డ్‌ భూమి, మిగతాది పట్టాభూమి, ఇచ్చిన పరిహారంలో ఎసైన్డ్‌ భూమికి అతి తక్కువగా ఇచ్చి పట్టా భూములకు మాత్రం నలభై వేల వరకు ఇచ్చినట్టు తెలిసింది.
ఇక్కడ మేథావులు అంటున్నట్లుగా తొండలు గుడ్లు పెట్టే భూమికి లక్షనుంచి మూడు లక్షలు ఇవ్వడం అనేది వట్టిమాట. ఉన్న భూమితో ఏం బ్రతికి బట్టకడుతున్నా. మట్టి పిసుక్కొని చస్తున్నది వాస్తవమే అయినప్పటికీ చస్తే బొందపెట్టడానికి నాలుగు గజాల నేలకూడా లేకుండా గుంజుకున్న వైనం ఎలా విస్మరిస్తాం. కొంతమందన్నట్టు సెజ్‌వల్ల బాగా భూములకు విలువలు పెరిగి లాభపడ్డది అగ్రవర్ణాల వాళ్ళు. నోటిఫైడ్ ఏరియాలో భూమిపోగా, మిగిలిన భూమికి ఇరవై నుంచి నలభై లక్షల దాకా రేటు పలుకుతోంది. వందలమంది దళిత, బహుజను, గిరిజనులు మాత్రం ఎలా అర్దం చేసుకోవాలి. అక్కడ పెరిగిన రియల్‌ ఎస్టేట్ మూలంగా అగ్రవర్ణాల వాళ్లు బాగా భూములు అమ్మడం కొనడం జరుగుతుంది. ఆక్రమంలో కొంతమంది లాభపడితే పడవచ్చు కానీ దళితుల భూమికి పదివేలు ఇచ్చి తమ పక్కనే ఉన్న నోటిఫైడ్‌ ఏరియాలో లేని భూమి లక్షల్లో అమ్ముకుంటూ ఉంటే ఆ సమూహాలు అనుభవిస్తున్న మానసిక క్షోభకు ఎలా వెలకట్టగలం చెప్పండి. ఇక్కడ ఎవరి అభివృద్దికి ఎవరు సమిధలు కావాలి. ఆ ఊళ్లో ఉన్న దళితురాలు ఉషాని సత్తెమ్మ తన వద్ద ఉన్న భూమిని గుంజుకొని తన కొడుకుకి పాయికానా కడిగే ఉద్యోగం ఇచ్చిన్రని కన్నీళ్ల పర్యంతమయింది. సెజ్‌ మూలంగా భూముల రేట్లు కోట్లలో పెరిగిన మాట వాస్తవమే కానీ , ఆకోట్లు ఎవరివి... మాల, మాదిగ, బైండ్ల, గౌండ్ల, వాళ్లవి కావే...! అని కొండపల్లి రత్తమ్మ వాపోయింది. అక్షమ్మ, రంగమ్మ, గంగపూరి బాలస్వామి గౌడ్‌, రవిగౌడ్ పానుగంటి అంజమ్మ ఒక్కరేమి కదిలిస్తే హృదయం ద్రవించుకుపోయే వెతలే...
ఇలా బడుగు బలహీన వర్గాల భూముల్ని అక్రమంగా లాక్కొని దేశానికి వెన్నముక అయిన రైతు నడ్డి విరుస్తున్నారు. కోట్లది రూపాయల సబ్సడీలు, అప్పనంగా వేలాది ఎకరాల ప్రోత్సాహకాలు అందిస్తున్న పాలక వర్గం రైతులకు ఎందుకు ప్రోత్సహకాలు ఇవ్వడం లేదు... ఎక్కడో చదివినట్టు గుర్తు. వ్యవస్థ సంఘర్షణలకు కేంద్రీకృతమైన భూమి సమస్య. ఆ భూమి లక్షలాదిమందిని అసమసమాజంగా మార్చిన కథ అది.
ఈజిప్ట్‌ సూయజ్‌ కాలువ త్రవ్వకాలలో లక్షలాది మంది నిర్వాసితులైనారు. వాళ్లంతా తమ భూములను తమకు ఇప్పించండని ప్రభుత్వం కోర్టులో కేసు వేశారు. విచారణ సందర్చంగా జడ్జ్‌ను ఉద్దేశించి ఓ అమాయక రైతు ఇలా వ్యాఖ్య చేశాడట. "అయ్యా! నాకు ప్రభుత్వం అనే దాయదు ఒకడు ఉన్నాడని, వాడు ఏనాటికైనా నా భూమి మీదకు వాటా కోసం వస్తాడని మా అయ్య నాకెప్పుడూ సెప్పలేదే"అన్నాడట అమాయకంగా..
ఇవాళ దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో తమ వద్ద గుంజుకున్న భూమికోసం, ప్రభుత్వాల మీద, తమ ప్రాంత ఆధిపత్యం కోసం, దాని నుండి విముక్తి కోసం పోరాటాలు చేస్తున్నారు.
ఏ దేశమైనా అక్కడ రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను బట్టి ఆ దేశ సామాజిక అభివృద్దిని కొలమానంగా గుర్తించవచ్చు. ఇది విశ్వవ్యాప్తమైంది. అలా ఇస్తున్న ప్రోత్సాహకాలు ఆ రైతులకు స్వావలంభన కలిగించాలి. ఆ క్రమంలో పెట్టుబడి దారులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు ఎంత తగ్గిస్తేం రైతు పెట్టుబడి దారులకు తారుమారు చేశారు. పాలక వర్గం పెట్టుబడిదారుల పక్షం కనుకనే నేడు దేశవ్యాప్తంగా సెజ్‌లు ప్రయాణం మెదలుపెట్టాయి.
ఈ భూ బాగోతాలు నేడు విశ్వవ్యాప్తం అయినవి మడగాస్కర్‌ అధ్యక్షడు మార్క్ రావలోమన 1.3మిలియన్‌ హెక్టార్‌ల భూమిని ఉత్తర కొరియా కార్ల కంపెనీ అయిన దేవ్యకు కేటాయించింది. మన దేశంలో బొంబాయి, నోయిడాకు చెందిన వరుణ్‌ ఇంటర్నేషనల్‌ మడగాస్కర్ దేశంలో భూములను కొనడానికి ప్రయత్నాలు మొదలెట్టింది. అక్కడ ఒక లక్షా డెబ్బైవేల తొమ్మిది వందల హెక్టార్‌లలో పంటలు పండించడం ఈ ఒప్పందంలో భాగం.
మన రాష్ట్రంలో ఇలాంటి నమూనాలకు బీజం వేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈపాపంలో భాగం ఆనాడు ఆ ప్రభుత్వాన్ని సమర్దించిన అన్ని పాలక పక్షాలకూ ఉంది. దీన్ని పసిగట్టేలోపే... ఈ విస్తరణా కాంక్ష మరింతగా పెరిగింది. లోతుగా పరిశీలిస్తే దిగ్బ్రాంతికరమైన విషయాలు తెలుస్తున్నాయి. అవి... మిడిల్‌ ఈస్ట్‌లో ఉన్న కొన్ని కంపెనీలు పాకిస్తాన్లో ఉన్న భూ ఆక్రమణకు దారులు వెతుకుతున్నాయి. సౌదీ అరేబియా కూడా దాదాపు 1.6 మిలియన్‌ హెక్టార్‌ల భూమిని ఇండోనేషియాలో కొన్నది. ఆకలితో అలమటించే ఇథియోపియా 2.7 లక్షల హెక్టార్‌ల భూమిని విదేశీ కంపెనీలకు దారాధత్తం చేసింది.
ఆయిల్‌ వ్యాపారంలో గుత్త పెట్టుబడి దారులుగా ఉన్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ మరియు భారత్‌, చైనా, దక్షణ కొరియాలలో ఉన్న భూములకు చౌకగా కొనాలని దాదాపు ఎనిమిది వేల మల్టీ నేషనల్‌ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. దీన్ని బట్టి భూ ఆక్రమణ తీవ్రత ఎంత ఉందో అర్దం చేసుకోవచ్చు. అంతే కాకుండా అనేక కంపెనీలు, ఆఫ్రికాలో 3లక్షల ఎనభై వేల ఎకరాలను మరియు లాటిన్‌ అమెరికాలో, మయన్మార్‌, కెనడాలలో భూములను కొనడానికి అనేక కంపెనీలు క్యూ కడుతున్నాయి.
ఇక మున్ముందు పిన్స్‌రీ ఎస్టేట్‌ అవతారం ఎత్తబోతున్నాయి. అంతే కాకుండా karuturi global industrial Ltd. అనే కంపెనీ ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ ఫాలసీ ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద లాండ్‌ బ్యంక్‌ ఉన్న కంపెనీ అని అంటున్నాయి. ఆ కంపెనీకి ఉన్న భూమి దాదాపు మూడువేల చదరపు కిలో మీటర్లు. ప్రపంచంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్‌ మరే అని సగర్వంగా ఆ కంపెనీ చెప్పుకుంటుందట. బెంగుళూర్‌లో వేళ్లకు ఉన్న గుళాభీ తోటల పెంపకం వ్యాపారం ప్రపంచ ప్రసిద్ది చెందినది. నయావలస వాదం మళ్లీ ఈ విధంగా వికృత రూపం దాల్చిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి.
పెట్టుబడి దారుని స్వభావం గురించి మార్క్స్‌ చెప్పిన ఒక విషయం యధాతదంగా చెప్పలేకపోయినా నాకు గుర్తున్న మేరకు ఇక్కడ అన్వయిస్తాను.
పెట్టుబడి దారుడు తనకు 20శాతం లాభం వస్తుందంటే తన విస్తరణను ఊరి సరిహద్దు దాటతాడని, 80శాతం లాభం వస్తుందనుకుంటే రాష్ట్ర సరిహద్దులు దాటతాడని, తాను మరణిస్తే 100శాతం లాభం వస్తుందని తెలిస్తే చనిపోవడానికి క్షణం కూడా ఆగడని ఆ స్థితిని కూడా బెట్టుకొనే క్రమంలో విలువలను ఎలా విస్మరిస్తాడో వివరించాడు. దీన్ని ఇక్కడ కంపెనీల విస్తరణా కాంక్షకు సరిగా అన్వయించవచ్చు.
బాధాకరమైన విషయమేమిటంటే " ఇండస్ట్రియల్స్ ఆధునిక దేవాలయాలు" అని ప్రవచించిన పండిత నెహ్రూ వారసులు నేడు ఊళ్లను స్మశానాలుగా మారుస్తున్నారు. లార్సన్‌ టర్బో, యూనీలీవర్, మైక్రోసాఫ్ట్‌, అనేక టెక్స్‌టైల్, జూట్ మిల్లులు, అరబిందో ఫార్మాలు నేడు ఆధునిక దేవాలయాలు అయితే కావచ్చు కానీ ఆ దేవాలయాల మెట్ల దగ్గర బిక్షం ఎత్తుకుంటున్న సంఖ్య కూడా కోట్లలో ఉందనే విషయాన్ని విస్మరించవద్దు. కళింగనగర్, సింగూర్‌ , నెల్లూరు, ఘజియాబాద్‌, గోపాలపూర్‌, పోలేపల్లి, హైద్రాబాద్‌, పరిసర ప్రాంతాలు, నెల్లూరు, వైజాగ్‌. ఒరిస్సా, ఒక్కటేమిటి నేడు దేశమంతా భూమి కొంగలు తొక్కిన నారుమడిలాగా మారిపోబోతోంది. ఈ వైనాన్ని పసిగట్టకుంటే మన కాళ్ల కింద ఉన్న బారెడు నేల కూడా గుంజుకొని చస్తే పూడ్చడానికి గజం నేలకోసం వెతుకులాడే స్థితి సమీపంలో ఉంది.