ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, November 26, 2011

వీరమాత కడుపుకోత.. కిషన్‌ జీ తల్లి గుండెకోత.. ఈ శోకం తీరనిది

వీరమాత కడుపుకోత.. కిషన్‌ జీ తల్లి గుండెకోత.. ఈ శోకం తీరనిది


ఆ తల్లి గుండె విలవిల్లాడింది... కన్నపేగు కదిలిపోయింది... వెళ్లొస్తానమ్మా అని చెప్పి వెళ్లిన కొడుకు ముప్పై ఏళ్ల తరువాత శవమై తిరిగొచ్చాడు.... నిలువెల్లా కంపించిపోయిన ఆ తల్లి గుండె చెరువయింది.. కొడుకు రాకకై కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన ఆ తల్లి రోదనకు అంతులేదు.. పోలీస్ ఎన్‌కౌంటర్ లో మరణించిన కిషన్ జీ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్న తల్లిని చూసి కంట తడి పెట్టని వారు లేరు..
సరిగ్గా ముప్పై సంవత్సరాల కితం వెళ్లొస్తానమ్మా అన్న కొడుకు.. కన్నతల్లి చేయి విడిచి అడవి తల్లి ఒడిలోకి చేరాడు. ఉద్దరిస్తాడనుకున్న కొడుకు లోకోద్దారకుడుగా మారుతానని వెళ్లాడు. ఆ తల్లికి ఇవేవీ తెలియవు.. కానీ ఏ రోజు కన్నదిరినా దిన పత్రిక చూసేది.. ఏ అపశకునం కనిపించినా కన్న పేగు కదిలేది. కంటిచెమ్మ తడిమేది.. దినదినం పీడకలతో.. నిద్రలో ఉలిక్కి పడ్డ రాత్రులెన్నో.. కన్న కొడుకు ఎక్కడ దూరమై పోతాడో అని ఆవేదన చెందిన రోజులెన్నో.. కొడుకు గుర్తొచ్చి కంచం పై నుంచి లేచిన రోజులెన్నో.. ఏదో ఒకరోజు ఈ దుర్వార్త వినాల్సి వస్తుందని ఆ తల్లి భయపడుతూనే ఉంది.. కానీ ఆ రోజు రాకూడదనే కోటి దేవుళ్లకు మొక్కుకుంది.. కానీ.. ఆ బిడ్డ పచ్చని అడవుల్లో వెచ్చని నెత్తురు చిందించక తప్పలేదు.. ముప్పై ఏళ్లతరువాత.. గుర్తుపట్టలేని గురుతులతో ఊరుఒడిని చేరుకున్న కిషన్‌జీని చూసి ఊరు ఊరంతా అమ్మయింది.. ఆ అమ్మ కళ్లు సముద్రాలయ్యాయి...
(వెనకొచ్చే ఆవుల్లారా పాట)మొదటి చరణం.. కళ్లల్లో కదిలే కొడుకు కనబడక పోయే... దగ్గర్నుంచి వేయాలి
ఈ తల్లి ఆవేదనను తీర్చేదెవరు.. ఈ కంటిచెమ్మను తుడిచేదెవరు.. పొగిలి పొగిలి ఏడ్చే ఈ తల్లి ఆవేదనను ఎవరు తీర్చగలరు. కన్నకొడుకు జాతి మరువని అమరుడయ్యాడని గర్వించాలో.. ఎత్తిన పిడికిళ్లు నేల పొత్తిళ్లలో ఒదిగిపోతున్నాడని బాధపడాలో తెలియని అమాయకత్వం... ఆఖరి గడియల్లో.. తన కన్న పేగు కానరాని లోకాలకు తరిలిపోతుందన్న ఆవేదనను ఎవరు తీర్చగలరు.. ఆదుకుంటాడనుకున్న కొడుకు అమరుడయ్యాడని తెలిసిన క్షణం ఆ తల్లి గుండెలో మోగిన పిరంగులెన్ని. ఆ పెద్దగుండె ఎంత కలత చెందిందో..


(వెనకొచ్చే ఆవుల్లారా పాట)రెండవ చరణం..తండ్రి పొయిన కాణ్నుంచి... దగ్గర్నుంచి వేయాలి
ఈ తల్లి శోకం తీరనిది.. ఈ గుండె గాయం మాననిది.. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసిన ఆశ అడియాసే అయింది. కొడుకు గుండెను బుల్లెట్ చీల్చిందన్న వార్త తెలసినప్పటినుంచీ ఈ తల్లి గుండె వేయి వక్కలయింది.. పెద్దగుండెలు అవిసేలా ఏడుస్తూనే ఉంది. అఖరి పలుకులు ఎండమావులే అయ్యాయి.
bang- కడుపుకోత

Friday, November 25, 2011

Thursday, November 24, 2011

నేల రాలిన మందారం.. నింగికెగసిన అరుణతార.. కిషన్ జీ అమరం..

.... ఓన్లీ న్యూస్... విశ్లేషణ కాదు...





కిషన్‌ జీ మృతి
బెంగాల్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌
జంగల్‌మహల్‌లో లభించిన మృతదేహం
కిషన్‌జీదేనని అనుమానం
మావోయిస్ట్‌ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌ జీ మృతి చెందారు... పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌ అడవుల్లో జరిగిన ఎన్‌‌కౌంటర్‌లో ఆయన చనిపోయారు... భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కిషన్‌జీ మృతి చెందారని బెంగాల్‌ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. జంగల్‌మహల్‌లో ఓ మృతదేహం దొరికిందని, అది కిషన్‌జీ దేనని ఆ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి... అయితే కిషన్‌‌ జీ మృతిని మావోయిస్టు పార్టీ ఇంకా ధ్రువీకరించడం లేదు... హోంశాఖ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు.
మమత బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యాక బెంగాల్‌లో జరిగిన మొదటి ఎన్‌కౌంటర్‌ ఇది... కిషన్‌ జీ కోసం బెంగాల్‌ భద్రతా బలగాలు గత మూడు రోజులుగా కుషుబోని అడవులను జల్లెడ పడుతున్నాయి. ఆ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి... నిన్నటికి నిన్న కిషన్‌జీ త్రుటిలో ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నారనే వార్తలు వచ్చాయి
బెంగాల్‌లోని సంయుక్త దళాలు జరిపిన జాయింట్‌ ఆపరేషన్‌లో కిషన్‌జీ మృతి చెందారు. దాదాపు అరగంటసేపు ఇరుపక్షాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో కిషన్‌జీతో పాటు మరో ముగ్గురు కూడా మరణించారు... కిషన్‌జీదిగా భావిస్తున్న మృతదేహం పక్కనే ఏకే 47 గన్ లభ్యమైనట్టు సమాచారం
కిషన్‌జీతో పాటు, ఆయన సహచరి సుచిత్ర మహతో కోసం భద్రతా బలగాలు గత కొద్ది రోజులుగా గాలిస్తున్నాయి.. జంగిల్‌ మహల్‌లో మూడు రోజులుగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. కిషన్‌జీ, సుచిత్ర కుష్‌బని అడవుల్లో తలదాచుకున్నారన్న ఇంటెలిజెన్స్‌ సమాచారంతో భద్రతా బలగాలు అడవుల్ని అణువణువు గాలించాయి. అయిదుగురు మావోయిస్టులను అరెస్ట్్ చేశాయి.. అయినప్పటికీ అగ్రనేత సమాచారం అందలేదు... ఆ తర్వాత జార్ఖండ్‌, బెంగాల్‌ పోలీసులు సంయుక్తంగా జరిగిన ఆపరేషన్‌తో కిషన్‌జీ మృతి చెందినట్టు తెలుస్తోంది. సుచిత్ర కోసం ఇంకా గాలింపులు కొనసాగుతున్నాయి.
రెండేళ్ల క్రితం కూడా కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు తొలుత వార్తలు వచ్చాయి.. కానీ తర్వాత ఆయన తప్పించుకున్నారని తెలిసింది.

Friday, November 18, 2011

వీరికి... ఆ (సెక్స్) కొన్ని క్షణాలు .. నరకం...



అక్కడ ద్వారాలు బార్లా తెరిచే వుంటాయి. మూసిన తలుపులు మచ్చుకైనా కనిపించవు. తమ శరీరాల్ని ఛిద్రం చేసే మానవహింసాకాండని నగుమోములతో స్వాగతాలు పలికే అమ్మలుంటారక్కడ. అమ్మచాటు బిడ్డలూ ఉంటారక్కడ . కానీ తల్లి కొంగు చాటున కాదు, తెరచాటునే వారిస్థానం. తాను ఉండాల్సిన అమ్మ ఒడిలో మాత్రం ఓ మానవ మృగం, తెరచాటున పసిమనసులను భయం, అవమానం తెరలు తెరలుగా కమ్మేస్తుంది. తెరవెనుక అమ్మనీలినీడలు పసిమనసులను కలచివేస్తుంటాయి. చీకటి నీడల దృశ్యాలు చిన్నారుల మనసులను ఛిద్రం చేస్తుంటాయి. అమ్మ తనువు వుండై ఒకరికి పండవుతుంటే...ఆ అమ్మే తను శవమై మరొకరికి వశమౌతూ రక్తపు ముద్దగా మారుతున్న వేళ ప్రపంచం పచ్చి మోసంగా సమాజం ఒఠ్ఠి దగాలా కొద్ది కొద్దిగా అర్థమవుతుంది ఆ పసిమొగ్గలకు..
ఆ సామాజిక వికృత ప్రక్రియకు బలయ్యే వారే అంగడి బొమ్మలు. ఈ పసివారి అమ్మలు. ఎదిగే వయసుతో, ఎదిగీ ఎదగని మనసులతో ఏమౌతామో తెలియని అయోమయంతో చేయనితప్పుుకి శిక్షని అనుభవిస్తున్నారు వారి బిడ్డలు. కులం పేరుతో కొందరు, సాంప్రదాయం పేరుతో మరికొందరు. మోసపోయి కొందరు, సమాజమే వెలివేసి మరికొందరు. కుటుంబమే హింసించి ఇంకొందరు. ఆడపిల్లగా పుట్టినందుకే అమ్ముడుపోయి మరికొందరు. ఇలా కారణాలేవైనా అందరూ ఒకే చోటికి చేరుకుంటారు. అందరూ తమ శరీరాలకు తామే వెలకట్టుకుంటారు. తమ జీవితాలకు తామే ముగింపురాసుకుంటారు. అది దుబాయ్‌ అయినా, ముంబాయి అయినా దేశరాజధాని ఢిల్లీ అయినా నగరమేదైనా నరకమొక్కటే. నాలుగు చిల్లర డబ్బులు శవంపై చల్లినట్టు ఆమె శరీరంపై చల్లి ఆమె సర్వహక్కులూ లూఠీ చేస్తాడు మగవాడు. ఒకసారి ఆ చీకట్లోకి ప్రవేశిస్తే ఇక బయటపడే ప్రశ్నే ఉండదు. వారి జీవితాలు ఆ చీకట్లో తెల్లారిపోవాల్సిందే. చీకట్లో వారి దేహాలు ఛిద్రమవ్వాల్సిందే.
శరీరం తూట్లుగా మారేలోపే నాలుగు రూపాయిలు మిగుల్చుకోవాలి. పాతికేళ‌్ళు పైబడితే ధర తగ్గుతుంది. పసి మొగ్గల శరీరాలకు పైకం ఎక్కువొస్తుంది. అప్పుడే ఆ తల్లుల కోసం వచ్చే విటుల చూపులు పరిసరాలను పరికిస్తాయి. ఏ పసిబిడ్డైనా ఫరవాలేదు. ఆడపిల్లయితే చాలనుకుంటాయి ఆ మానవ మృగాలు. మదపుటేనుగులబారిన పడకుండా తలుపురెక్కలకు తమ శరీరాలను వేళ్ళాడదీసి విటుల దృష్టిని మళ్ళిస్తూ పసిబిడ్డలను కాపాడుకొనే తల్లులు కొన్నిసార్లు వారి ప్రాణాలనే ఫణంగా పెడతారు.
బైట్ : తలి్ల బైట్. ఈమె పైన రాసినకొన్ని విషయాలు చెపుతుంది.
వాయిస్ : మూడు పదులు దాటాయంటే వారి బతుకు దుర్భరం. పుట్టిన బిడ్డల పోషణ భారంగా తయారవుతుంది. ఓ పక్క అనారోగ్యం కుంగదీస్తుంది. అప్పటికే సమాజం అసహ్యపు చూపులు, చేష్టలు సమాజంలో గౌరవప్రదమైన జీవితం అందని ద్రాక్షగా మారుతుంది. పసిబిడ్డల పొట్టనింపుకోవడమే గగనంగా తయారవుతుంది. ఛీత్కారానికి చిరునామాగా మారిని సమాజం వెలివేస్తుంది. వీరికి పొలాల్లోనో, ఫ్యాక్టరీల్లోనో కూలిపనిసైతం దొరకదు. వీరి జీవితాలు అస్పశ్యంగా తయారవుతాయి.
చెక్కిళ్ళపై ముద్దాడి గుండెలకు హత్తుకోవాల్సిన అమ్మ ఎంతకీ రాదు. ఏడ్చి ఏడ్చి ఏ మూలో అర్ధాకలితో పడుకుంటే అర్ధరాత్రి దాటాక అమ్మ రాకాసి చెరవీడినట్టు...కారుమబ్బులను చీల్చుకొని జాబిల్లి వచ్చినట్టు అమ్మ వస్తుంది. కానీ శరీరంలోని సత్తువంతా లాగేసి, శరీరాన్ని, మనసునీ సిగరేట్‌ ముక్కంత హీనంగా పీల్చి పడేసిన మరో రాకాసి పంజా అమ్మను తిరిగితిరిగి ఆవహిస్తుంది . ఒకటారెండా...రోజుకి ఆరు రాకాసి ఆకారాలు అమ్మను మాంసపు ముద్దలుగా మంచానికి వేళ్ళాడదీస్తుంటాయి. ఎందుకమ్మా ఈ నరకమని ప్రశ్నించలేని చిన్నారుల ప్రశ్నార్థకపు చూపులకు అమ్మకంటికొసల్లోని కన్నీరే సమాధానం చెపుతుంది.

ఎవడి కిరీతకానికో చేదుజ్ఞాపకంగా ఈ లోకంలోకొచ్చిన ఈ పిల్లలను ఈ రొంపిలోకి దించడానికి ఏ తల్లి హృదయం అంగీకరించదు. తనలాంటి అవమానకరమైన జీవితం. తన బిడ్డలకు రాకూడదనుకుంటుంది. ఊరికి దూరంగా, తమ గాలైనా సోకని చోట భద్రంగా ఉంచాలనుకుంటుంది. నాలుగక్షరం ముక్కలొస్తే ఈ నరకానికి తన బిడ్డలను దూరంగా ఉంచొచ్చనుకుంటుంది. కానీ వీరి పేరు చెబితే పిల్లలకు స్కూల్ అడ్మిషన్ సైతం దొరకనిపరిస్థితి. ఇక వీరి బిడ్డలకు చదువుకునే అవకాశాలు మృగ్యమవుతాయి. తమ పిల్లలను చదివించుకోవాలనే ఆశ వున్నా నాగరికం ముసుగులో బతుకుతున్న అనాగరిక మనుషుల మధ్య పిల్లల హక్కులు హరించివేయబడతాయి. అనుక్షణం అవమానాలతో, హేళనలతో పిల్లల బ్రతుకు నరకప్రాయం అవుతుంది. పిల్లలు బడికి దూరంగా నిరక్షరాస్యులుగా ఇంటివద్దే ఉండిపోతారు. అంతేకాదు దారుణ దృశ్యాలను దిగమింగలేక, ఎవ్వరికీ చెప్పుకోలేక, ఏం చెయ్యాలో అర్థమవ్వక మానసికంగా కృంగిపోతారు.
తండ్రి పేరైనా తెలియకుండా ఈ భూమిపైకొచ్చిన ఈ పసిడిడ్డలకు జీవితం దినదినగండంగా మారుతుంది. ఈ రొంపిలోంచి వారి పిల్లలను కాపాడుకోవడం వీరి తల్లులకు పెద్ద సవాల్‌గా మారుతుంది. ముద్దులొలికే చిన్నారులు ఎదిగేకొద్దీ ఈ సమాజంపై ఏహ్యాభావాన్ని పెంచుకుంటారు. తల్లి పరిస్థితికి కారణాలను వెతుక్కుంటారు. తమకి నాన్నెందుకు లేడో అర్ధం చేసుకునే లోపు రోగాలతో రొప్పులతో కన్నతల్లి కూడా కనుమరుగవుతుంది. ఇక ఈ చిన్నారులకు నా అన్నవాళ‌్ళే కరువవుతారు. చీకటిసామ్రాజ్యానికి మహారాణులైన ఆ తల్లుల బిడ్డలు చివరకు చిల్లిగవ్వకు కొరగాని వారిగా మిగిలిపోతారు.

ఆర్థికపరిస్థితి, పూటగడవని పరిస్ధితిలో ఈ రొంపిలోకి దిగామని చెపుతున్న ఈ అంగడి బొమ్మలు ....తమ బిడ్డలకూ ఈ దుస్ధితి తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ఈ వృత్తిలోంచి బయటకు రమ్మనే హక్కు ఎవ్వరికీ లేదంటారు ఆ తల్లులు. ఆదుకొని , ఆదరించి...పునరావాసం కల్పించి, మంచి జీవితీన్ని మాకందించలేని ప్రభుత్వాలు మా వృత్తినెందుకు వదులుకొమ్మంటారని తల్లు ప్రశ్నిస్తున్నారు. స్త్రీల శరీరాలు వ్యాపారాలైన చోట ఈ దారుణకృత్యానికి బలైన ...బలవుతున్న వీరు కాస్త కరుకుగానే కనిపిస్తారు. మొరటుగానే మాట్లాడుతారు. కానీ దానికి కారణం వారి గుండెలకు కాలం చేసిన గాయం. ...
ఏ ఆపన్న హస్తమో వారి బిడ్డలను కనికరించి కాపాడితే వారికి ఈ సభ్యసమాజంనుంచి సవాలక్ష సవాళ‌్ళు ఎదురవుతాయి, ఎవడో తెలియని నాన్న కోసం సవాలక్ష ప్రశ్నలు. అమ్మకు సైతం తెలియని సమాధానం ఈ చిన్నితల్లికెలా తెలుస్తుంది. కన్నీరింకిన చిన్నారుల కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఈసడించుకున్న వారు ఈటెల్లా పొడిచేస్తుంటారు. తనకు ఏమీ కాని నాన్నపేరుతో గుర్తింపడటమే వారు అవమానంగా భివిస్తారీపసివారు. నన్ను నన్నుగా గుర్తించేందుకు నాకు నాన్నే ఉండాల్సిన పనిలేదంటారు.
ఇంగ్లీషులో గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతున్న ఈ అమ్మాయి తల్లి ఓ జోగిని. సాంప్రదాయం పేరుతో ఇక్కడ లైంగిక హింస జరుగుతుంది. ఈమెకు తండ్రిఎవరో తెలియదు. ఇదే ప్రశ్నని తల్లినడిగితే తను చెప్పలేదు. బజార్లో మహారాజులా తిరుగుతున్న నాన్న అనేవాడిని తను గుర్తించే అవకాశం లేదు. అందుకే అవమానాల్ని దిగమింగి సమాజాన్ని చదవడం నేర్చుకుంది. తన కసినంతా చదువుపై కేంద్రీకరించింది, ఎనిమిది వరకు అర కొరగా ఇంగ్లీషు ముక్క రాకుండా చదివిన ఈ మె నగరంలోని ఓ ప్రముఖ కాలేజీలో చదువుతోంది. ఇప్పుడు ఇంటర్‌లో 79శాతం మార్కులతో పాసయ్యింది. ఛీదరించుకునే చేతులు చిన్న సాయాన్ని అందించగలిగితే వారు ఆకాశానికి నిచ్చెనెలేస్తారని నిరూపించింది.
తనువు పుండై చివరికి శవంగా మారుతున్న అమ్మ జీవితం ఈ బిడ్డలకు చాలా విషయాలు నేర్పించింది. అవమానాలతో అగౌరవంగా బ్రతకడం ఎంతటి నరకమో అనుభవించారు వీరంతా. చీకటికి కృంగి పోకుండా రేపటి వేకువకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సమాజాన్ని సవాల్‌గా స్వీకరిస్తున్నారు. ఓ పక్క సమాజంతో మరో పక్క చదువుతో యుద్ధం చేస్తున్నారు. గెలుపు ఇప్పటికిప్పుడే వీరికి సొంతమవ్వకపోవచ్చు . కాని రేపటి విజయం కోసం ఈ రోజు పరాభవాన్ని ఎదుర్కొంటూనే పోరాడుతామని చెబుతున్నారు. వీరి ఆత్మస్థైర్యం ముందు అన్నీ దిగదుడుపే.
అమ్మని అంగడి సరుకుగా మార్చిన సమాజాన్ని ఒకే ప్రశ్నవేస్తారీ చిన్నారులు. తమ జీవితాలకు పుచీనివ్వని నాన్నెవరని అడగొద్దని ఇంట్లో , బళ్ళో, బజారులో ఎక్కడైనా జన్మనిచ్చిన అమ్మపేరుని మరవద్దని కోరుతున్నారు.................
ఇటువంటి కుటుంబాల్లోని ఎదిగే పిల్లలపై మానసిక వత్తిడి అధికంగా ఉందంటున్నారు డాక్టర్లు. పురుషుల ప్రవర్తనతో వారిపైన వారికే అసహ్యం కలిగి పిల్లలు మానసిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు. అంతే కాదు. బలవంతంగానో, మోసపూరితంగానో ఈ వృత్తిలోకి దిగిన వారు ఒక సారి వారి శరీరంపై జరిగే హింసతో హడలిపోయి ఆత్మహత్యలకు సైతం వెనకాడరంటున్నారు. అంతే కాదు ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న తల్లులకు పిల్లలు పుడితే వారి పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది.
మహిళలే కాదు రాష్ట్రంలో ఈ రాక్షసమానవహింసకు బలవుతున్న వారిలో పదినుంచి 18 ఏళ్ళ మధ్య వారు 25శాతం మంది ఈ రొంపిలోకి దిగుతున్నారు. మిస్సింగ్‌ కేసులుగా మిగిలిపోతున్న బాలికల ఆచూకీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోతోంది. పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్‌ కేసుల్లో అత్యధిక భాగం అమ్మాయిలే ఆక్రమిస్తున్నారంటే బాలికలు మాయమవడం వెనుక మర్మమేమిటో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ముంబాయ్ లోని రెడ్ లైట్ ఏరియాలో వున్న వారిలో 45 శాతం మంది కర్నాటక నుంచి వచ్చిన వారేనని ఓ సర్వేలో తేలింది. ధాకాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 20 శాతం మంది వీధి బాలలు ఈ వృత్తిలోకి దిగుతున్నారు. వీళ్ళల్లో 20 ఏళ్ళు నిండకుండానే వివిధ కారణాలతో వీరు చనిపోతున్నారు.
చట్టంలోని లొసుగుల ఆసరాతో మగవాడు అతి తేలికగా తప్పు నుంచి తప్పించుకుంటాడు. మరి అదే అపరాధంతో జైలుకి వెళ్ళిన స్త్రీకి విముక్తి కలిగేదెలా? కేవలం పెనాల్టీతో తప్పుని కప్పిపెట్టుకొని పెద్దమనిషిగా కోర్టు నుంచి బయటపడ్డ మగవాడిని అత్యంత సహజంగా అంగీకరంచే సమాజం స్త్రీలను మాత్రం దోషిగా నిలబెడుతోంది. బాలికల పట్ల, స్త్రీల పట్ల అసమాన భావం, వివక్ష వెరసి వారి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ రొంపిలోకి దిగకుండా చూసేవిధంగా ప్రభుత్వ విధానాలు లేవు. ఈ వృత్తిలో వున్న వారిని అందులోంచి బయటపడేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అరకొరగానే ఉన్నాయి. ఈ నరకకూపంలోంచి పసిబిడ్డలను కాపాడేందుకు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలు కాదు కావాల్సింది. పసివారి జన్మహక్కైన జీవించే హక్కే కాదు, గౌరవంతో జీవించే హక్కు వారికి కల్పించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యతకావాలని కోరుకుందాం.

Saturday, November 12, 2011

ఎందుకో ఈ పాటంటే నాకిష్టం.. నేను క్రిష్టియన్ ని కాదు..

ఏసు గొరియ పిల్లను నేను వధకు తేబడిన గొరియ పిల్లను అనే పాట నాకు చాలా ఇష్టం.. ఇది రాగా డాట్ కాం లో ఉంది. నా బ్లాగ్ ఓపెన్ చేయగానే పాట డీ ఫాల్ట్ గా స్టార్ట్ అవుతుంటే.. తొలగించాను..

Wednesday, November 9, 2011

వెంకట్ రెడ్డి చేసింది ఏ దీక్ష? ఆమరణ దీక్షా? అలకదీక్షా?



రాష్ట్రంలో తెలంగాణ నినాదం మొదలయినప్పటి నుంచి దీక్షా కాలం మొదలయింది. 2011 సంవత్సరానికి నిరాహార దీక్షల సంవత్సరం అనుకుంటే సరిపోతుందేమో.. ఈ ఏడాది కాలంలో ఎవరెన్ని దీక్షలు చేశారో లెక్కబెట్టడం కాస్త కష్టమే.. ఒక్క అన్నా హజారే దీక్షను మించి ఏ ఒక్కదీక్ష కూడా ఫలప్రదం కాలేదంటే నమ్మండి . అయినా అది జాతీయ వార్త. నేను ఆ వాతలు పెట్టుకోదలుచుకోలేదు. కానీ మన రాష్ట్రం విషయంలోకి వస్తే ఈ మధ్య కాలంలో చాలా మందే దీక్షా దక్షలు బయలుదేరారు. నాల్రోజులు దీక్ష చేసి లేవడం ఓ ఫ్యాషనైపోయింది. ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం లేకుండా అన్ని పార్టీలు దీక్షలు చేస్తున్నాయి. ఆఖరుకు కమ్యునిస్టు పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా నిరాహార దీక్ష చేశాడు. ఇక ఎటొచ్చీ ఈ మద్య ఆమరణనిరాహార దీక్ష చేసిన వెంకటరెడ్డి దీక్షే మరీ చర్చనీయాంశంగా మారింది..
ఈ దీక్ష విధానం చూసిన వాళ్లు ఈ దీక్షలో నిబద్దత ఎంత అని ప్రశ్నిస్తున్నారు. ఇది నా ఒక్కడి అభిప్రాయమైతే.. నేను బ్లాగులో రాసేవాణ్నే కాదు. కానీ ఇది పదిమంది పదిరకాలుగా అనుకుంటున్న మాటలను ఒడిసి పట్టి మీకు అందిస్తున్నాను. మరో ముఖ్య విషయం ఏంటంటే. ఆమరణదీక్షకు దిగిన వారు లక్ష్యం సాధించడమా లేక మరణించడమా.. ఇదే వాళ్ల ఆశయం. అంటే ఆశయ సాధన కోసం ప్రాణాలను ఫణంగా పెట్టడం అన్నమాట. ఈ విషయంలో పొట్టి శ్రీరాములు అందరికీ ఆదర్శమనే చెప్పుకోవాలి. ఎందుకంటే లక్ష్యం నెరవేరే వరకు ముద్ద ముట్టలేదు. కానీ ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో అడిగి అరెస్టు చేయించుకునే నాయకులకు కూడా కొదవలేదని జనం బహాటంగానే చెప్పుకుంటున్నారు. అయితే వెంకటరెడ్డి అలా అరెస్టయ్యాడని మాత్రం చెప్పలేను గానీ... ఆ దీక్షకు ఆమరణ దీక్ష అని పేరు పెట్టడమే బాగాలేదు. గతంలో తెలంగాణ అన్న విద్యార్ధులను.. గతమంటే ఎన్నో సంవత్సరాలు కాదు. కేవలం నెలల క్రితమే మీటింగుల్లో లాఠీలు విరిగిన వరకు కొట్టిచ్చిన కోమటి రెడ్డికి అమాంతంగా తెలంగాణ పై, తెలంగాణ బిడ్డల పై ప్రేమ పుట్టుకు రావడం అసహజమే.. కానీ పుట్టుకొచ్చింది. పుట్టుకొచ్చినా ఇప్పటికే పోరాడుతున్న పార్టీలను కాదని.. తనే సొంతంగా నల్లగొండలో దీక్ష చేయడం వెనుక మతలబు ఏంటి.. ఇంత చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం చీమకుట్టనట్టు వ్యవహరించకపోవడం వెనుక అసలు రాజకీయం ఏమిటి.? కోమట రెడ్డి ఏ రాజకీయాల కోసం దీక్ష చేశాడో.. కిరణ్ కుమర్ రెడ్డి దాన్ని నిర్వీర్వం చేసేందుకు ఆయన జోలికి కూడా పోలేదు. కానీ పాపం ఆరోగ్య కారణాల రీత్యా.. అరెస్టులు.. ఫ్లూయిడ్‌లు.. దీక్ష విరమణలు.. ఆసుపత్రి నుంచి బయటకు రాగానే రెడ్డిగారు.. బస్సుయాత్ర చేసి ప్రాబల్యం సంతరించుకోబోతున్నారు. దీనికోసం హడావిడిగా ఆడియో సి.డిలు కూడా సిద్ధం చేసుకుంటున్నారట. ఇప్పటి వరకు తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ కోమటరెడ్డి ఇక తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయబోయిన ముద్దుబిడ్డ సానుభూతితో ప్రజల్లో బాగా ప్రచారం.. ఇటు టీఆర్ఎస్ నేతల హడావుడి అంతా ఇంతా కాదు.. కోమటరెడ్డి దీక్షకూర్చున్న మరుసటి రోజునుంచే మద్దతులు మొదలయ్యాయి. కానీ ఢిల్లీలో దీక్షకోసం కూర్చున్న కొండాలక్ష్మణ్ బాపూజీ న్యూస్ కవర్ కాదు... టీఆర్ఎస్ మద్దతు తెలుపదు. ఎందుకంటే బాపూజీ ఎమ్మెల్యే కాదు. ఆయనకు మద్దతిచ్చినా ఇవ్వకున్నా పార్టీకి వచ్చే లాభం కానీ నష్టం కానీ లేదు. పైగా సీమాంధ్రతో కుమ్మక్కయ్యాడనే అపవాదొకటి.. దీక్ష ద్వారా తెలంగాణ ప్రజలకేమోగానీ వెంకటరెడ్డికి మాత్రం పుష్కలంగా లాభం చేకూరిందనే చెప్పాలి. ఇటో కారో.. కమలమో సిద్ధంగా ఉన్నాయి. అదీ ఇదీ కాకుంటే జగన్ ఎలాగూ గురిపెట్టుకున్నాడు.. తెలంగాణ వాదాన్ని ఎంతమంది క్యాష్ చేసుకుంటారో.. కవులు, కళాకారులు, మేథావులు, మీడియా వీళ్లగురించి గంటలు గంటలు బుర్రలు బద్దలు కొట్టికొని విశ్లేషించండి.. పాటలు పాడండి.. వ్యాసాలు రాయండి.. ఈ చరిత్ర ..(ఇంకావుంది..to be contd)

Thursday, November 3, 2011

ఇది తెలంగాణ సాహిత్యమా.. దళిత, బీసీల సాహిత్యమా..?



ఇది తెలంగాణ సాహిత్యమా.. దళిత, బీసీల సాహిత్యమా..?
ఇప్పుడు తెలంగాణలో... ఉద్యమానికి ఊపిరి పోస్తున్న సాహిత్యానికి మూలాలు ఎక్కడివి...? పుట్లకు పుట్లుగా పుట్టుకొస్తున్న కవిత్వాలకు మూలవస్తువేది..? ఇప్పుడు సీమాంధ్ర పై కురిపిస్తున్న తిట్ల వర‌‌్షానికి పదప్రయోగాలన్నీ ఎక్కడ జరిగాయ..ి. ? ఇప్పుడు సాహిత్యలోకంలో వాడిగా వేడిగా జరుగుతున్న లోపాయికారి చర్చ ఇదే.. నిజానికి తెలంగాణ ఉద్యమం పుట్టకు ముందే ఈ సాహిత్యం ఉంది.. కానీ ఇప్పుడు దాని రూపం మార్చుకుంది.. వాక్యాంతాలు మారాయి.. అదే అవేదన... అదే కష్టం.. అవే కన్నీళ్లు.. అవే తిట్లు.. అవే శాపనార్ధాలు.. కానీ అవి దిశ మార్చుకున్నాయి.. అయితే ఇవి వీటి దిశమార్చుకునే అవసరం ఎందుకొచ్చింది.. ఎటునుంచి ఎటుమారాయి.. రూపం మార్చుకున్నా.. ఈ సాహిత్య లక్ష్యం ఒక్కటేనా.. ఈ విషయం తెలుసుకోవాలంటే... సింధూ నాగరికతను అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు... ఏ దక్కను నాగరికతనో తవ్వుకుంటూ పోవాల్సిన పని లేదు.. గత దశాబ్ద కాలంగా ఉదృతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని,, దానికి తోడుగా ఉండి శ్వాసనందిస్తున్న సాహిత్యాన్ని పరిశీలిస్తే అసలు విషయం అవగతమవుతుంది.. అవును మరి సమాజంలో ధనికుణ్ని- పేదవాడు, పెట్టుబడి దారుణ్ని- శ్రామికుడు, అగ్రవర్ణాల వారిని - నిమ్న వర్ణాల వారు... ఎదిరించి జయం సాధించినట్టు నిత్యం కలలు కంటూనే ఉంటారు. వీరి మధ్య వర్గపోరు తరాలుగా నడుస్తూనే ఉంది... అయితే ఇప్పటి వరకు వీరు సాధించామనుకున్న విజయాలు కాలక్రమంలో వచ్చాయా లేక పోరాటాల ద్వారా వచ్చాయా అన్న విషయంలో... మేథావుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి కాబట్టి ఇప్పుడు నేను వాటి జోలికి పోదలుచుకోలేదు.. కానీ గత దశాబ్ద కాలంగా తెలంగాణ సాహిత్యం పేరుతో వస్తున్న వివిధ రకాల రచనలతో భావవ్యాప్తి గురించే నేను నాలుగు ముక్కలు అభిప్రాయంగా పంచుకోవాలనుకుంటున్నాను.. నేను తెలంగాణ టీవీ ఛానల్( టి.న్యూస్)లో ప్రోగ్రామిగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన అనుభవంతో చూసిన పరిశీలించిన కొన్ని విషయాలు.. వివిధ రకాల వ్యక్తుల అభిప్రాయాలను పంచుకున్నాకనే ఈ నాలుగు మాటలు రాయగలుగుతున్నాను.
వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ సాహిత్యం పేరుతో వస్తున్న సాహిత్యానికి మూలాలన్నీ దళిత సాహిత్యంలోనే ఉన్నాయని మెజారిటీ మేథావులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. తరతరాలుగా అణచబడి.. వేసుకోడానికి చెప్పులు కూడా లేని దుస్థితి ఒకపక్క... ఉన్నా వేసుకోవడానికి స్వేచ్ఛలేని పరిస్థితి మరోపక్క... ఐణా చెప్పులు కుట్టే వృత్తినే నమ్ముకొని కాలం గడిపారు.. సహజంగానే ఆవేదనతోనే.. ఆక్రందనతోనో.. తన జాతిని అణిచిన వారిని, దానికి మూల కారణాలైన క్రమాన్ని ఆ వర్గాల నుంచి వచ్చిన రచయితలు తమ రచనల్లో దుమ్ములేపి దునుమాడారు.. అసలు ఉండో లేడో తెలియని మనువును... మునుం పెట్టి తిట్టారు.. దాన్ని వారసత్వంగా అనుభవిస్తున్న వారిని.. మనువుకు వారసులుగా కీర్తింప బడుతున్న ద్విజులను తమ సాహిత్యంలో శిలాశాసనాలు చెక్కారు.. ఎందుకంటే తమ వెనకబాటు తనానికి.. రెండు జన్మల ప్రముఖులు, వారిని పెంచి పోషించిన అగ్రవర్ణాల వారేనని వీరి గట్టి అభిప్రాయం.. ఇప్పటికీ వారి అభివృద్ధిని అడ్డుకునేది వారేనని బ్రాహ్మణులను తిట్టిపోసే వారు లేకపోలేదు.. గత దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో ఇక అగ్రవర్ణాలను ఆడిపోసుకోవడం తగ్గి అగ్రవర్ణాల స్థానంలో సీమాంధ్రులు చేరారు.. అవే తిట్లు.. అవే శాపనార్ధాలు... అయితే ఈ సారి కమ్యునిస్టు ఉద్యమ సాహిత్యం, దళిత సాహిత్యం కలిసి తెలంగాణ ఉద్యమ సాహిత్యంగా పురుడు పోసుకున్నాయి.. తెలంగాణ ధూంధాలలో పాడే పాటలన్నీ ఒకప్పుడు నిషిద్ధ కమ్యునిస్టు పార్టీలు పాడుకున్న పాటల బాణీలే.. సాహిత్యం కూడా తొంబై శాతం అదే.. ఉద్యమ రూపం ఏదైనా లక్ష్యం మాత్రం అదే.. రాజ్యాధికారం. విముక్తి కోసం పోరాటం.. అది ఏ రకమైన విముక్తి... విముక్తి తర్వాత ఎవరెవరికి ఏం ఒరుగుతుందనేది చరిత్రలో విముక్తి పొందిన వారినడిగితే చెప్తారు కానీ.. ఇప్పుడు వస్తున్న సమకాలీన రచనలల్లో అత్యధికం.. బి.సి, ఎస్సీల నుంచే వస్తున్నాయనేది ప్రధాన వాదన.. ఇటు అగ్రవర్ణాల వారు, కాస్తో కూస్తో లౌక్యం ఉన్న వారు వీటి జోలికి పోవడం లేదట.. ఇప్పటి వరకు తెలంగాణ పాటలు రాసిన వారిని గమనిద్దాం. ఈ పేర్లు కేవలం ఉదాహరణగా మాత్రమే తీసుకోగలరు. తెలంగాణ జాతీయ గీతంగా పాడుకుంటున్న * జయజయహే తెలంగాణ జననీ పాట రాసిన అందెశ్రీ దగ్గర్నుంచి, పల్లెపాటగాడు గోరటి వెంకన్న, జంగ్ సైరన్ జయరాజ్, ప్రజాయుద్ధనౌక గద్దర్, మిట్టపల్లి సురేందర్, కోదారి శ్రీను, రసమయి బాలకిషన్, నేర్నాల కిషోర్, వెంకన్న, నాగన్న, రవీంధర్, అమర్...లు నాకు సడెన్ గా గుర్తొచ్చిన కవిగాయకులు మాత్రమే.. ఇక గాయకుల విషయానికి వస్తే.. ముందు చెప్పిన వారు కాక, విమలక్క, సంధ్యక్క, స్వర్ణ, విజయక్క, రమాదేవి, పద్మావతి, గంగ, ప్రగతి, మధుప్రియ, సోమన్న, సాయిచంద్, పైలం సంతోష్, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే పేజీ చాలదు. రెగ్యులర్‌గా నాతో టచ్ లో ఉండే వాళ్ల పేర్లే గుర్తుకొచ్చిన వరకు ప్రస్తావించాను. వీళ్లు కాక గద్య రచయితలు, కవితలకే పరిమిత మైన వారు చాలా మందే ఉన్నారు. అయితే వీరందరిలో 95శాతానికి పైగా దళితులు, బీసీలే కావడం యాదృచ్ఛికమో.. కాకతాళీయమో కాదు.. వారికిది చారిత్రక వారసత్వంగానే వచ్చింది.. గతకాలపు సాహిత్యమే. పురాతన జానపద బాణీలే.. కాకుంటే వాటి దశ-దిశ మార్చుకున్నాయి. అయితే ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో కూడా మెజారిటీ సంఖ్య వీరిదే నన్న వాదన కూడా ఉంది. ఇక్కడ మరో ముఖ్య విషయం కూడా ప్రస్తావించాలి. తెలంగాణ బాషగా పరిగణించ బడుతున్న నేటి బాషను పొదివి పట్టుకొని దాచుకున్నది కూడా దళితులు, బీసీలేనన్న వాదన కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ బాష ఎక్కువగా కట్టెపొయ్యిని, కారం ముద్దను నమ్ముకున్న కడజాతి కడవల్లోనే తొణకుండా పదిలంగా ఉంది. వాళ్లు మాత్రమే తిరిగి బాషకు జీవం పోయగలిగారు. ఇప్పుడు తెలంగాణ బాషగా చెపుతున్న బాషలో చాలా బాష సంకరంగా మారిందే. హలాంతాలు మార్చినంతమాత్రాన మూలబాషను ముందుకు తేలేం.. నలిమెల భాస్కర్ కష్టపడి తెలంగాణ పదకోశాన్ని రూపొందించనైతే రూపొందించాడు కానీ వాటన్నిటీ ఇప్పుడు వాడుక బాషగా వ్యవహారికగా బాషగా మాట్లాడాలంటే మళ్లీ ప్రాక్టీస్ చేయక తప్పదేమో.. మరీ కొన్ని జిల్లాలకైతే ఇంకా ఇబ్బంది. ఖమ్మంలో మెజారిటీ ప్రాంతం, నల్లగొండలో చాలా ప్రాంతం, హైదరాబాద్, రంగారెడ్డి, జిల్లాల్లో అచ్చమైన తెలంగాణ బాష దొరకడం కరువే.. అయితే ఈ బాషను ఈ మాత్రమైనా నిలుపుకుంటూ వస్తుంది.. బహుజన కవిగాయక రచయితలేననేది మెజారిటీ సంఖ్యలో అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దొరల రాజ్యం వస్తుందని మంద కృష్ణ వ్యాఖ్యల వెనుక మర్మమేంటో తెలియదు కానీ.. తెలంగాణ సాహిత్యంలో మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుజనులే దొరలు.. ఇంతమంది కలం వీరులుండగా వచ్చిన దొరస్వామ్యం నిలబడుతుందా.. అనేది గుర్తుంచుకోవాలి.. అఖరుగా ఒక్కమాట.. అణిచి వేతను ఎదిరించే సాహిత్యమేదైనా దాని రూపాలన్నీ సారూప్యాలే.. భావసారూప్యం గల మేథావులు అర్ధం చేసుకోండి.. అపార్దం చేసుకున్న వారు నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పండి.