ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Tuesday, August 17, 2010

సర్దార్ సర్వాయి పాపన్న




ఎ. జనార్ధన్
మనం మరిచిన తెలంగాణ వీరుడు
సర్దార్ సర్వాయి పాపన్నజయంతి నేడు
అతను పుట్టింది వెనకబడిన కులంలో… వృత్తి కల్లు గీత.. ముంజ కత్తి పట్టాల్సిన చేతితో తల్వార్ దూసిండు.. మొగలాయి సామ్రాజ్యాధి నేతలను వణికించి రాజ్యాధికారం చేబట్టిన యోధుడు. ఆయనే తెలంగాణ చరిత్ర గర్వించే వీరుడు సర్వాయి పాపన్న.
బడుగులకు రాజ్యాధికారమని ఎలుగెత్తి తరతరాలుగా అర్రులు చాస్తున్న ఈ తరానికి సర్వాయి పాపన్నే ఆదర్శం.
సర్వాయి పాపన్న పుట్టింది ఖిలాషాపూర్ లో..ఈ గ్రామం హైదరాబాద్కు ఈశాన్యంగా 50 మైళ్ళ దూరంలో వరంగల్ మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్నది. ఈ ఊర్లో పాపన్న విగ్రహం ఉంచి పాపన్న తమ ఊరి వాడని సగర్వంగా చెప్పుకుంటరు గ్రామస్థులు. పాపన్న సాహసాలకు, సాధించిన విజయాలకు మౌన సాక్షిగా చెరగని సంతకం చేసింది భువనగిరి దుర్గం. పాపన్న చరిత్ర ముందు తరాలకు ఆదర్శం... తాను పుట్టిన కులాన్ని, తన తోటి వారికి తక్కువ వారిగా చిత్రీకరించడం పాపన్నకు నచ్చలేదు. సమానత్వం కోసం, కులగౌరవం కోసం పోరాడిండు. తక్కువ చూపు చూస్తున్న కులవృత్తిని అంగీకరించలేదు. కులవృత్తి స్వీకరించమన్న తల్లి కోరికను కాదన్నడు. కొంత ధనాన్ని చేత బట్టుకొని రాజ్యాధికారం సాధించిగానీ తిరిగిరానని తల్లి సర్వమ్మకు శభదం చేసిండు.
మొగలాయి ప్రభువుల అరాచకాలతో అట్టుడుకుతున్న రోజులవి. ప్రభువులకు ఎదురు తిరగితే ప్రాణాలపై ఆశలు వదులుకోవలసిందే. ఒక్కప్రాణాలే కాదు..తమ పిల్లా జెల్లా..గొడ్డూగోదా ఏదీ తమది కాదు. ఈ అరాచకాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపడు కత్తి దూసిండు. తన తోటి వారిని బడుగు బలహీన వర్గాల వారిని ఒక్కటి చేసిండు. తాటికొండ కొండ పై దుర్గాన్ని నిర్మించిండు. ప్రజల్లో చైతన్యం నింపు యువతను కూడ గట్టిండు. చిన్న చిన్నప్రాంతాలను ఆక్రమిస్తూ రాజ్యాధికారం దిశగా అడుగులేసిండు. పాపన్న సాహసానికి జేజేలు పలుకుతూ చిన్నాపెద్దా ఆయన పోరాటానికి బాసటగా నిలిచిండ్రు.
సర్వాయి పాపన్న కుల వృత్తులను ప్రోత్సహించిండు. స్వయం సమృద్ది సాధన దిశగా సంస్కరణలు చేపట్టిండు. అంతరించి పోతున్న గౌడ వృత్తిని పునరుద్దరించేందుకు నడుంబిగించిండు. వేలాది ఎకరాల్లో తాటి, ఈత, జీలుగు వనాలను నాటించిండు. కల్లు పై సుంకాన్ని తగ్గించి కల్లుగీతను ప్రోత్సహించిండు. సర్వాయి పాపన్న యోధాను యోధుడే కాదు. చెప్పుకోదగ్గ మేథావి కూడా. దూర ప్రాంత గ్రామాల్లో తీసిన కల్లు రాజధానికి చేరేసరికి చెడిపోకుండా ఉండే ఉపాయం చేసిండు. రాత్రివేళ తీసిన కల్లు చల్లని వాతావరణంలో తక్కువగా పులుసిపోతది. అందుకే రాత్రికి రాత్రే కల్లును రాజధానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయించిండు. తెలతెల్లవారే సరికి స్వచ్ఛమైన కల్లు కళ్లముందు దర్శనమయ్యేది.ఈ ప్రయత్నంతో గౌడు కులస్థులతో బాటు ఇతర చేతి వృత్తుల వారుకూడా పాపన్నకు బాసటగా నిలిచిండ్రు. బడుగు వర్గాల ఆర్ధిక స్వాలంబనే పాపన్న బలమని తెలుసుకున్నరు. అందుకే బలహీన వర్గాల ఆదాయవనరుల పై వేటు వేసే కుట్ర పన్నిండ్రు. 1702లో రుస్తుదిఖాన్ అనే డిప్యూటీ గవర్నర్ కల్లు గీతవారిని సమూలంగా అణచివేయమని తీర్మానం జారీచేసిండు. ఈ తీర్మానంతో ప్రజల్లోమరింత వ్యతిరేకత వచ్చింది. పాపన్నకు మరింత సైన్యం తోడయింది. రుస్తుంఖాన్ పాపన్నను అణిచివేసేందుకు సమర్ధవంతమైన సైన్యాన్ని నియమించిండు. 1706లో పాపన్న పై చేసిన దాడిలో ఘోరంగా విఫలమయింది రుస్తుంఖాన్ సైన్యం.. 1707లో ఔరగంజేబు మరిణానంతరం బహద్దూర్ష్ షా సింహాసనాన్ని అధిష్టించి తానే సామ్రాజాధిపతినని ప్రకటించుకొన్నడు. 1708 మార్చి 31న వేలాది మంది సైన్యంతో పాపన్న ఓరుగల్లు కోటను ఆక్రమించిండు. సరిగ్గా ఇదే సమయంలో మచిలీపట్నం కేంద్రంగా వ్యాపారం చేస్తున్న డచ్, ఇంగ్లీష్ వ్యాపారులనుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేసిండు.
వరంగల్ ముట్టడి విజయవంతమైన తరువాత పాపన్న వరంగల్లుకు సుమారు 30 మైళ్లదూరంలో షాపూర్ హైదరాబా ద్ ప్రధాన రహదారిని ఆనుకొని ఏటవాలు కొండపై నిర్మించిన భువనగిరి దుర్గాన్ని ఆక్రమించిండు. సర్వాయి పాపన్న విజయాలు మొఘలు చక్రవర్తల వెన్నులో వణుకుపుట్టించినయి. పాపన్న గురించి డచ్ రిపోర్టర్ తెల్పిన నివేదిక ప్రకారం సర్వాయి పాపన్న ఒక స్వయంపాలకుడని చక్రవర్తి తెలుసుకున్నడు. సామ్రాజ్య అధి కారిక గుర్తింపు కోసం చట్టబద్ధంగా, న్యాయసమ్మతంగా కొంత కప్పం చెల్లించి నాయకునిగా కొనసాగవచ్చునని చక్రవర్తి ప్రక టించిండు.. పాపన్న ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నడు.బహదూర్షాకు 14లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు సామ్రాజ్య సైనికుల నిమిత్తం పెద్ద మొత్తంలో ఆహారధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు సమర్పించా డు. ప్రతిఫలంగా చక్రవర్తి పాపన్నని గోలుకొండకు రాజును చేసిండు.
పాపన్న ఆధిపత్యాన్ని ఓర్వలేని వారు ఇంటీరియల్ కోర్టులో దావా వేశారు. కుల వృత్తిలో ఉండి కల్లుగీయవలసిన వాడికి రాజ్యాధికారమేంటని వాదించిండ్రు.. పాపన్నను నియంత్రించమని బహదూర్షా గవర్నరు యూసఫ్ ఖాన్ను ఆదేశించిండు.
1709లో పాపన్న మొఘల్ సైన్యాన్ని ఎదిరించడానికి సిద్ధమైనడు. తాటి కొండలో భయంకరంగా దాడి జరిగినా పాపన్న కొన్ని నెలల పాటు మొఘల్ సైన్యానికి ఎదురొడ్డి నిలిచిండు. మేనెలలో పాప న్న అనుచరులకు గవర్నర్ అత్యధిక మొ త్తం ఆశ చూపాడు.పాపన్న తుపాకి కా ల్పులకు గురై బయటపడ్డడు. ఆ పరిస్థి తిలో వేషం మార్చిండు. చివరకు హుస్నా బాద్ గ్రామంలో ఒక కల్లు మండువ వద్ద ప్రత్యక్షమయ్యాడు. ఆ గ్రామంలోనే తన కులంవారు అధికంగా ఉన్నారు.
అందు వల్ల అదే తనకి సరైన రక్షణ ప్రాంతమని భావించిండు.కల్లు దుకాణంలో కూర్చొని ఒక గ్లాసు తాటి కల్లు ఇవ్వమని అడిగాడు.పాపన్న కల్లు తాగుతుండగా నిజాం సైన్యం అతడిని బం ధించి వారిని గవర్నర్ ముందు నిలబెట్టిడ్రు.తరువాత అతని తల నరికివేసి, తలను బహదూర్షా దర్బారుకు పంపారు. మొండేన్ని హైదరాబాద్ కోటగుమ్మానికి వేలాడదీశారు.స్వయంపాలన కోసం ఉద్యమించిన వీరునిగా చరిత్రలో నిలిచిన పాపన్నకు రావలసిన గుర్తింపు రాలేదు. అదే పాపన్న సమకాలికుడైన శివాజీని మరాఠా ప్రజానీకం, ప్రభుత్వాలు ఆరాధ్య దైవంగా భావించి తగిన గుర్తింపు నిచ్చినయి. పాపన్న బహుజన బీసీ కులానికి సంబంధించిన వాడు కావడం, తెలంగాణ ప్రాంతానికి చెందిన వీరుడు కావడం వల్లే చరిత్రలో చోటు దొరకలేదు. తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ యోధాను యోధుల, సాహసవీరుల చరిత్రలు పాఠ్యపుటల్లో రావాలి. సర్వాయి పాపన్న, కొమరం భీం.. దొడ్డి కొమురయ్య..రాణి రుద్రమ్మ.. చాకలి అయిలమ్మ.. వీరోచిత పోరాటాలు పల్లెపల్లెనా పల్లవించాలంటే మన తెలంగాణ మనకు కావాలి. ఆత్మవిశ్వాసం నింపే చరిత్రలు తెలంగాణబిడ్డల మదిలో నిండాలి.

Monday, August 2, 2010

హిందీ గాయకుడూ కిషోర్ కుమార్



ఎ. జనార్ధన్ august
...కిషోర్ కుమార్ స్టోరీ...4th birth day
కలకాలం ప్రజల మదిలో నిలిచిపోయే పాటలు పాడిన గాన గంధర్వలో చెప్పుకోదగ్గ గాయకుడు కిషోర్ క ఉమార్. ఆయన పాడిన పాటలన్నీ వాడిపోని వసంతాలే..కోట్లాదిమంది గుండెల్లో గూడు కట్టుకున్న కిషోర్ పాట అజరామరం. ఆ గొంతునుంచి జాలువారిన అమృతధారను ఆస్వాదించేందుకు ఎగిసిపడే హృదయాలు నాడే కాదు.. నేడూ ఉన్నాయి.. ఉత్సాహం ఉరకలేసి.. మనసు గంతులేసే పాటలను ఎన్నోపాడారాయన. తొలినాళ్ళలో మెత్త మెత్తగా పాడిన సోలోలు ఇప్పటికీ విన్నకొద్దీ వినాలనిపిస్తాయి. ఆషాబోస్లేతో కలిసి పాడిన చిలిపిచిలిపి డ్యుయెట్లు గుర్తుకొస్తేనే మనసు అదోలోకంలోకి తేలిపోతుంది. దేవానంద్ మొదలుకొని అనిల్ కపూర్ దాకా ఎందరో హీరోలకు తన గాత్రంతో ఎక్కడాలేని ఫేం తెచ్చిపెట్టారు కిషోర్... రాజేష్ ఖన్నా, అమితాబ్ ల శకంలో కిషోర్ సినీ వినీలాకాశంలో శిఖరాగ్రాలను చూశారు. కిషోర్ కెరీర్ లో ఇదొక ఉజ్జ్వల దశ. ఆ కాలంలో ఆ ఇద్దరు హీరోలకూ ఆయన పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్లుగా చరిత్ర సృష్టించాయి.
సాంగ్
సినీ ప్రపంచం మరవలేని మధరగాయకుడు కిషోర్ కుమార్ ఆగష్టు 4, 1929లో జన్మించారు. భారతీయ హిందీ సినిమా రంగంలో తనదైన ముద్రవేసుకున్న కిషోర్ నేపథ్యగాయకుడిగా, హాస్యనటుడిగా, దర్శకునిగా, నిర్మాత మరియు సంగీత దర్శకుడి రాణిచిండు.. అందుకే కిషోర్ కుమార్ ను సినీ మేథావులు బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తించింది. అశోక్ కుమార్, అనూప్ కుమార్ మరియు కిషోర్ కుమార్ లు అన్నాదమ్ములు. 1946లో ముంబైలో అడుగుపెట్టిన కిషోర్ నిజానికి మొదట గాయకుడు అవ్వాలని అనుకున్నారు. చిన్నప్పటినుంచీ కిషోర్ కు సైగల్ అంటే వీరాభిమానం. ఎప్పుడూ ఆయన పాటలనే పాడుతుండేవారు. కిషోర్ ముంబైకు చేరుకునేనాటికే ఆయన అన్న అషోక్, హీరోగా ఓ స్ధానంలో ఉన్నారు. తన మనసులోని కోరికను అన్నతో చెప్పారు కిషోర్. తమ్ముడి కోరిక విన్న అశోక్ కుమార్, "నువ్వు సైగల్ ను అనుకరిస్తూ పాడి గొప్ప పాటగాడివి అనుకుంటున్నావు.. మైక్ ముందు పాడటమంటే మాటలు కాదు.. నీకంటు ఓ స్టైల్ ఉండాలి. అందుకు చాలా సమయం కావాలి.. ఈ లోగా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండు.." అని సలహా ఇచ్చారు. అలా కిషోర్ నటుడిగా అరంగేట్రం చేశారు.
కిషోర్ నటించిన తొలి చిత్రం " షికారీ". 1946లో వచ్చింది.
స్పాట్ ( మూవీ క్లిప్పింగ్)
ఈ సినిమాలో కిషోర్ అన్న అశోక్ హీరో అయితే, సంగీతాన్నించింది ప్రకాష్. ఒక దశలో కిషోర్ గొంతు విన్న ప్రకాష్, ఆ తర్వాత రెండేళ్లకు తన సంగీతదర్శకత్వంలో వచ్చిన జిద్దీ సినిమాలో కిషోర్ కు తొలి అవకాశమిచ్చారు. మర్నే కే దువా ఏ క్యోం మాంగ్.. ఇదే కిషోర్ తొలి సినిమా పాట.
సాంగ్ (మర్నే కే దువా ఏ క్యోం ) దొరికితేనే
కిషోర్ కుమార్ చేత తొలిపాట పాడించిన ప్రకాష్ ఇతనో మంచి సింగర్ అవుతాడని ఆనాడే ఊహించి చెప్పిండట. సైగల్ అంటే వల్లమాలిన అభిమానం ఉన్న కిషోర్, ఎలాగైనా సరే సైగల్ ని కలుసుకోవాలని కలలుకన్నాడు. తన అన్న అశోక్ సాయంతో తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. కానీ, కిషోర్ ముంబైలో అడుగుపెట్టిన కొన్నాళ్ళకే సైగల్ చనిపోవడంతో ఆయన కోరిక మరెన్నటికీ తీరకుండాపోయింది. సైగల్ కు, కిషోర్ కుమార్ కు ఓ పోలిక ఉంది. ఇద్దరూ శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోకుండానే గానకళలో ఆరితేరారు. అయితే, సైగల్ ప్రభావం నుంచి కిషోర్ ను బయటపడేసింది మాత్రం ఎస్.డీ.బర్మన్. ఆయన సంగీత దర్శకత్వంలో కిషోర్ అసలు సిసలు గాయకుడిగా రాటుదేలారు. కిషోర్ తనకంటూ కొత్త శైలి వెతుక్కున్నాక, వెనక్కు తిరిగి చూసుకోలేదు. ప్రతీ పాటలో ఆయన గంభీర స్వర ముద్ర స్పష్టంగా కనిపించింది. ఆయన హమ్మింగ్ ఓ స్పెషల్ ఎఫెక్ట్.కిషోర్ తన చిన్నతనంలో ఆయన రెండో అన్న అనూప్ తెచ్చిన విదేశీ రికార్డుల్లో యోడలింగ్ ను మొదటిసారిగా విన్నారు. ఆ తర్వాత అదే కిషోర్ కుమార్ బ్రాండ్ గా మారింది.ఎయిటీస్ లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సాగర్ సినిమాలో కూడా కిషోర్ గాత్రం అమృతాన్నే ఒలికించింది. నాలుగు దశాబ్దాలపాటు గళమెత్తిన కిషోర్ చిత్రసీమలో నాలుగు కాలాలపాటు గుర్తుండిపోయే ఆణిముత్యాలెన్నింటినో మనకు అందించారు. ఆయన గొంతులో పలకని రాగం లేదు. నవరస గాయకునిగా కిషోర్ కీర్తిశిఖరాలను అందుకున్నారు.
(స్పాట్ )
ఇంత అద్భుతమైన గాయకుడు కిషోర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాత్రం నటుడిగా. పేరు తెచ్చుకుంది కామెడీ హీరోగా. నిలిచి వెలిగింది ప్లేబ్యాక్ సింగర్ గా. ఈ దశలవారీ ప్రస్ధానం వెనుక ఎన్నో మలుపులున్నాయ్.. మెరుపులున్నాయ్
స్పాట్ (క్లిప్పింగ్)
కిషోర్ హీరోగా నటించిన ఆందోళన్, నౌకరీ,ముసాఫిర్ వంటి సినిమాల్లో తనకు తాను కొన్ని పాటలు పాడుకున్నరు. కిషోర్ కుమార్ ను కొంత కాలం ఫ్లాప్ లు వెంటాడాయి. కొన్ని ఫ్లాపుల తర్వాత కిషోర్ న్యూ ఢిల్లీ, చల్తీకా నామ్ గాడీ, ఆషా,హాఫ్ టికెట్ వంటి కామెడీ సినిమాల్లో నటించి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. చల్తీకా నామ్ గాడీలో అన్నదమ్ములు అశోక్, అనూప్, కిషోర్ ముగ్గురూ కలిసే నటించారు. ఇందులో కిషోర్ సరసన మధుబాల నటించింది.
(క్లిప్లింగ్)
ఓ సిటీ గర్ల్, ఓ కార్ మెకానిక్ ల మధ్య నడిచే ప్రేమకధే ఈ సినిమా. ఒక సింగర్ గా కిషోర్ లో ఉన్న టాలెంట్ ను, రేంజ్ ను మొదటిసారి గుర్తించింది ఎస్.డీ.బర్మనే. ఆయన సంగీత దర్శకత్వంలో టాక్సీ డ్రైవర్, ఫంతూష్, మునీంజీ, నౌదోగేరా, పేయింగ్ గెస్ట్, గైడ్, జ్యువెల్ తీఫ్, ప్రేమ్ పూజారి వంటి సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. ఇవన్నీ దేవానంద్ సినిమాలు కావడం కూడా ఓ విశేషం. ఈ కాంబినేషన్ వెనుక దేవ్, కిషోర్ ల దోస్తీ ప్రభావం కూడా ఉందనే చెప్పాలి.
(సాంగ్)
సచిన్ దేవ్ బర్మన్ తర్వాత ఆయన కుమారుడు రాహుల్ దేవ్ బర్మన్, శ్రీరామచంద్ర, శంకర్ జైకిషన్, బప్పీలహరి.. ఇలా అందరి మ్యూజిక్ డైరక్షన్ లో కిషోర్ వందలాది పాటలు పాడిండు. ఆర్డీ బర్మన్ ఆధ్వర్యంలో కిషోర్ సాధించిన తొలి హిట్ పడోసాన్. ఈ సినిమాలో కిషోర్ నటిస్తూనే పాటలు పాడారు. ఆర్డీ బర్మన్ తో కలిసి ఆయన ఖుష్బూ, పతంగ్, అమర్ ప్రేమ్, బుడ్డా మిల్గయా, అనామికా, ఆప్కీ కసమ్,, హీరాపన్నా వంటి ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. సంజయ్ దత్ చొలి చిత్రం రాఖీలో కూడా కిషోర్ చేత ఆర్డీబర్మన్ పాటలు పాడించారు. వీరిద్దరిదీ ఓ స్పెషల్ కాంబినేషన్. 1969లో శక్తీ సామంతా తీసిన "ఆరాధన" కిషోర్ కుమార్ ను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేసింది. ఈ సినిమాలో రాజేష్ ఖన్నాకు, కిషోర్ పాడిన పాటలు ఆసేతు హిమాచలాన్ని ఊపేశాయి. మేరీ సప్నోంకీ రాణీ అనే పాట యూత్ ను మైమరపించింది. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఆదే పాట.. అంతగా ఆ పాట ఆకట్టుకోవడానికి కిషోర్ గొంతులో పలికిన యవ్వనావేశమే కారణం.
(మేరీ సప్నోంకా రాణి సాంగ్)
అయితే, ఇదే సినిమాలో ఒంటరిగా దొరికిన అమ్మాయితే అబ్బాయి పెట్టే గుసగుసల తరహాలో పాడిన రూప్ తేరా మస్తానా.. ప్యార్ మేరా దీవానా.. పాట కిషోర్ కుమార్ కు తొలి ఫిలింఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది.
(రూప్ తేరా మస్తానా..సాంగ్)
కళ్యాణ్ జీ ఆనంద్ జీ మ్యూజిక్ డైరక్షన్ లో డాన్, కోరా కాగజ్, జానీ మేరా నామ్.. సినిమాల్లో కిషోర్ పాడిన పాటలు కూడా అదే రేంజ్ హిట్ కొట్టాయి. కొత్తతరం సంగీత దర్శకులతో కూడా కిషోర్ పనిచేశాడు. వారు స్వరపర్చిన ఎన్నో గీతాలకు ప్రాణం పోశారు కిషోర్. వారిలో చెప్పుకోదగ్గ మ్యూజిక్ డైరక్టర్ రాజేష్ రోషన్. ఆయన సంగీతదర్శకత్వంలో వచ్చిన చల్తే చల్తే, జూలీ, దో ఔర్ దో పాంచ్ .. సినిమాల్లో కిషోర్ పాడిన పాటలు అజరామరంగా నిలిచిపోయాయి. సంప్రదాయ సినీ సంగీతానికి డిస్కోను జోడించి బప్పీలహరి డైరక్షన్ లో కూడా కిషోర్ మెరుపులు మెరిపించారు. నమక్ హలాల్, షరాబీ వంటి సినిమాల్లోని పాటలు వింటే చాలు,, కిషోర్ బప్పీలహరి కాంబినేషన్ ఇచ్చిన కిక్ ఎలాంటిదో రుచి చూడొచ్చు.
(సాంగ్ బప్పిల హరి మ్యూజిక్ సాంగ్)
కళాకారులు సున్నిత హృదయులు, వారికి బయటి ప్రపంచానికి మధ్య సయోధ్య అంత సులభంగా కుదరదంటారు. ఇది కిషోర్ విషయంలో అక్షర సత్యమైంది. అందుకే ప్రపంచం అతన్ని ఎక్సెంట్రిక్ అంది. . కళాకారులందరిలాగే కిషోర్ చాలా సెన్సిటివ్. సున్నిత మనస్కుడు అవ్వడం వల్ల ఆయన చలా ఇబ్బందులు పడ్డారు. చాలా విషయాల్లో విపరీతంగా వ్యవహరించేవారని కిషోర్ గురించి చెప్పేవారు. ఆయన ఒక్కొక్క కీర్తిశిఖరం అధిరోహిస్తూ పోతున్నకొద్దీ ఆయనపై వింతవింత కధనాలు అంతకంతకూ ప్రచారంలోకి వచ్చాయి.ఆయన తన ఇంటి ఆవరణలో ఉన్న చెట్లతో ముచ్చటించే వాడని, ఒక్కో చెట్టును ఒక్కో పేరుతొ పలకరించేవాడని చెబుతారు. ఆయన్ కుక్కల పెంపకం గురించైతే ఎన్నెన్నో కధలున్నాయి.ఏకంగా ఇంటి గేట్ మీద " బీవేర్ ఆఫ్ కిషోర్" అని రాసుకొని కుక్కలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు... నో మనీ, నో వర్క్.. అనే సూత్రానికి కట్టుబడిన కిషోర్, కొన్ని సినిమాలకు డబ్బులిస్తామన్నా వద్దంటూ పనిచేశారు. కిషోర్ వైవాహిక జీవితం కూడా అంత సాఫీగా సాగలేదు. మొత్తం నలుగురిని పెళ్ళాడిన కిషోర్, ఎప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉండేవారు. మొదటిభార్య రుమా, కిషోర్ ను వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చేసుకున్న మధుబాల ఈ లోకాన్నే వదిలిపెట్టి వెళ్ళింది. ముచ్చటగా మూడోసారి పెళ్ళిచేసుకుంటే ఆ పెళ్ళి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. చివరిగా నాలుగోసారి బూరెబుగ్గల హీరోయిన్ లీనా చందావర్కర్ ను పెళ్ళిచేసుకున్నారు. అయితే, అప్పటికే ఆమె వితంతువు. పైగా ఆమె వయస్సు కిషోర్ కొడుకు అమిత్ కన్నా రెండేళ్ళే ఎక్కువ..
(క్లిప్పింగ్)
కిషోర్ మహా మొండి ఘటం.ఒకసారి కమిటైతే కాదనిపించడం ఎవరితరమూ అయ్యేది కాదు. మహామహులను కిషోర్ ఢీకొన్నారు. కొన్నాళ్ళు ఇబ్బంది పడినా, చివరకు తనమాటే నెగ్గించుకునేవాడు. అవి ఎమర్జెన్సీ రోజులు. ముంబైలో కాంగ్రెస్ ర్యాలీలో పాడమని సంజయ్ గాంధీ కిషోర్ ను అడిగారట. అయితే, దానికి కిషోర్ ససేమీరా అన్నాడట. ఫలితంగా ప్రభుత్వం ఆయనపై నిషేధం విధించింది. ఆలిండియా, దూరదర్శన్ లలో కిషోర్ పాట కనిపించరాదు.. వినిపించరాదంటూ హుకుం జారీ అయింది. అయినా కిషోర్ తన పట్టు విడవలేదు. చివరికి పరిశ్రమపెద్దలు జోక్యం చేసుకొని ఈ నిషేధం తొలగిపోయేలా చేశారు. ముఖేష్, మహ్మద్ రఫీల వంటి ఉద్ధండుల మధ్య కిషోర్ తన ఉనికిని బలంగానే చాటుకున్నారు. డిఫరెంట్ గొంతుతో ధాటిగా పాడే కిషోర్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
సాంగ్
కిషోర్ అభిమానులమని గర్వంగా చెప్పుకునేవారు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉన్నారు. అంతకన్నా ఓ సింగర్ కు కావాల్సింది ఏముంది.? మన తెలుగు మిస్సమ్మను హిందీలో "మిస్ మేరీ"గా తీశారు. నాగేశ్వరరావు పాత్రను అందులో కిషోర్ వేశారు. ఆయనకు జోడీగా మన జమునే నటించడం విశేషం. నటుడిగా కిషోర్ నటించిన సినిమాలు ఎంత బాగున్నా, అవన్నీ మసాలా సినిమాలే. వాటిల్లో కూడా ఆయన కామెడీ చేసి నవ్వించారు. కానీ, దర్శకుడిగా మారి కిషోర్ తీసిన సినిమాలన్నీ కూడా చాలా సీరియస్. సత్యజిత్ర ప్రభావంతో వాస్తవికతను చూపించేందుకు కిషోర్ ప్రయత్నించారు. కిషోర్ తీసిన "దూర్ గగన్ కీ ఛావో మే " అందుకు ఓ ఉదాహరణ. తను తీసిన సినిమాలన్నింటికీ ఆయనే సంగీతం, కధ, మాటలు, అన్నీ పుచ్చుకునేవారు. బహుముఖంగా తన ప్రజ్ఞాపాటవాలని ప్రదర్శించిన కిషోర్ ను గాయకునిగానే ప్రపంచం ఆదరించిందీ, గుర్తించిందీ. కిషోర్ మాత్రం ఈ గుర్తింపుతో నిమిత్తం లేకుండా తన మనసుకు నచ్చినట్టు జీవించారు. ఆడింది ఆట.. పాడింది పాటలాగా గడిపి ఇరవై ఏళ్ల క్రితం ఎవరికీ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయారు. ఆయన పాటకు పరవశించిపోయే అభిమానుల గుండెల్లో మాత్రం కిషోర్ ఎన్నటికీ చిరంజీవే.