ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Tuesday, September 27, 2011

బతుకమ్మ పండుగ విశిష్టత.. లోగుట్టు



బతుకమ్మ పండగ.. తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకొనే ముచ్చటైన పండగ. ఇందులో కులాల కట్టుబాట్లు, ధనికులమనే అహంకారాలు లేవు. కట్టుబాట్లన్నీమనుషులకే కాని నీటికి, పూలకూ లేవని చెబుతూ అందరూ సామరస్యంగా కలిసి మెలిసి జరుపుకునే పండగ. తెలంగాణ విశిష్టతను చాటిచెప్పే తీరొక్క పూల జాతర బతుకమ్మ. మట్టి మనుషుల మనసుల నిండా పూల వాసన గుప్పుమని గుభాళించే గొప్ప
బతుకమ్మ పండుగంటే.. తెలంగాణ పడుచులకు ఎక్కడలేని సంబరం.. కొమ్మ కొమ్మ సిగలో పూసిన పూల కొన గోటితో తెంపుకొని.. ఒద్దికగా ఒడినింపుకొని.. భక్తితో ఇంటికి తెచ్చుకుంటారు..ఏ ఇల్లూ చూసినా బతుకమ్మల ముచ్చట్టే.. ఏ బజారు చూసినా బతుకమ్మల జాతరే.. ఈ తొమ్మిది రోజులూ ఊరంతా బతుకమ్మే... ఊరూరా బతుకమ్మే.
తెలంగాణ ప్రాంతంలో సంస్కృతీ సంప్రదాయాలకు అద్ధం పట్టే పడుగ బతుకమ్మ.. ఈ బతుకమ్మ పండగ ఎంగిలిపువ్వు బతుకమ్మతో ఆరంభమై, విజయదశమికి ఒక రోజు ముందు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజుల పండగలో తీరొక్క పువ్వులతోబతుకమ్మను ఒద్దికగా పేర్చుకుంటారు. కలాలకు, మతాలకు అతీతంగా ముచ్చట్లు పెట్టుకుంటూ ముచ్చటగా జరుపుకునే పండుగ బతుకమ్మ.. వర్షాలు తగ్గుముఖం పట్టి నేల పై పుట్టిన ప్రతికొమ్మా పూవుకు పురుడు పోసే పూలరుతువిది.. నేలమ్మ సిగలో ప్రకృతి మాత తురిమిన పూలచెండు వెన్నెలై వెలుగులు చిమ్ముతుంది.. ఆ పండు వెన్నెల్లో.. పూల వెలుగుల్లో పడుచు కన్నులు చెంపలను నిండుతాయి. ఏపుగా ఎదిగిన పంటల నడుమ. విరగపూసిన పువ్వులతో సాయంకాలం వరకూ బతుకమ్మలను పేర్చుకుంటారు. బొడ్డెమ్మలను చేసుకుంటారు. గౌరమ్మను పుదిస్తారు. ఫలహారాలు చేసుకుంటారు. అప్పటికే ఇండ్లు, వాకిళ్లు అలికి, పూసి, ముగ్గులు వేసి, శుచిగా తీర్చి దిద్దుకుంటారు. ఉన్న దాంట్లోనే శుభ్రమైన బట్టలు కట్టుకొని బతుకమ్మ ఆటకు బయలు దేరుతారు.
పూల మద్యలో కొలువుదీరిన ఈ గౌరమ్మే బతుకమ్మ అని, ఆమే శ్రీమహాలక్ష్మి అవతారమని తెలంగాణ ప్రజల నమ్మకం.. తంగెడు పువ్వంటే గౌరమ్మకు ఇష్టమనీ, గౌరి పూజకు తప్పక తంగెడు పువ్వును వాడడం వాళ్ల ఆనవాయితీగా వస్తోంది..కొద్దిగా పసుపు తీసుకొని దాన్ని నీళ్లతో తడిపి నాలుగు వేళ్లతో ముద్దగా చేసి నిలబెడతారు. దానికి పసుపు కుంకుమలు అద్ది పసుపు గౌరమ్మ మీద వేస్తారు. ఆ గౌరమ్మను రెండు తమల పాకుల మీద పెడతారు...ఈ గౌరమమ్మే బతుకమ్మ అనీ, బతుకమ్మే గౌరమ్మ అనీ అంతటా విశ్వసిస్తారు. బతుకమ్మను పూజిస్తే.. ఆడవాళ్లకు ఆరోగ్యమనీ, కోరిన కోరికలు ఫలిస్తాయనీ, ఆయుష్షు, సకల సంపదలు పెరిగి ముత్తైవులుగా ఉంటారని జానపదుల నమ్మకం.
బతుకమ్మను పేర్చడం అంటే అంత సులువు కాదు.. పట్టుకుంటే తునిగి పోయే తంగేడు పూలను ఒద్దికగా పేర్చుకుంటూ బతుకమ్మను చేయడం అంటే ఎంతో ఓపిక.. నైపుణ్యం కావాలి.. ఏ మాత్రం తేడా వచ్చినా.. కష్టం పడి పేర్చిన బతుకమ్మ క్షణంలో చెదిరిపోతుంది..
బతుకమ్మను పేర్చడం కూడా ఒక కళ. తంగెడు పువ్వు, బంతిపువ్వు, గునుగుపువ్వు, గుమ్మడి పువ్వు, తీగమల్లె, మంకన పువ్వు, ఛెత్రి పువ్వు, గులాబి, పోకబంతి, కనకాంబరాలు, గన్నేరుపూలు, గోరెంకపూలు, , ఇట్లా ఎన్నో రకాల పువ్వులు బతుకమ్మలో కొలువుదీరుతాయి..
బతుకమ్మ ఎత్తుగా పేర్చడానికి...గునుగు పువ్వులను మొదలు కత్తిరించి రకరకాల రంగులల్లో అద్ది చిన్నచిన్న కట్టలుగా కట్టి పేర్చుకుంటారు. తెచ్చిన పువ్వును బట్టి పళ్లెమో,..వెడల్పాటి ఈత పల్లెకను తీసుకొని అందులో వృత్తాకారంగా అంచునుండి గోడకట్టినట్లు పూవుల కట్టలు పేర్చుతూ...బతుకమ్మ నిలవడానికి కడుపులో గుమ్మడి, ఆముదం, కాకర, బీర ఆకులు ఏవి దొరికినా వాటిని విరిచి ముక్కలు చేసి నింపుకుంటా అంగుళం అంగుళం మేర పైకి లేపుతారు.వరుస వరుసకూ పువ్వులు మారుతాయి. పూవుల రంగు మారుతుంది. క్రింద బాగంలో వెడల్పుగా మొదలైన గుండ్రని బతుకమ్మ త్రికోణాకారంలో గోపురంలా పైకి లేస్తుంది. శిఖరానికి ఒక పోకబంతి పువ్వు లేక ధగధగ మెరిసే వంకాయ రంగు పువ్వునో అందంగా అలంకరిస్తారు..
ఈ బతుకమ్మ ఒక్క అడుగు నుండి నాలుగు అడుగుల ఎత్తు వరకూ పేర్చుకొని.. తాము పేర్చిన బతుకమ్మను చూసి మురిసిపోతారు..
బతుకమ్మను పేర్చి మొదట దర్వాజ ఎదురుగా గోడ దగ్గర పీటవేసి వుంచుతారు. అగరొత్తులు ముట్టిస్తారు. ఎదురుగా పళ్లెంలో గౌరమ్మనుంచుతారు. ఆ పసుపు గౌరమ్మే బతుకమ్మ,
అన్ని పండుగలకు పెట్టే ప్రసాదాలు వేరు.. బతుకమ్మకు సమర్పించే ప్రసాదాలు వేరు.. తొమ్మిది రోజులు జరిపే బతుకమ్మ వేడుకల్లో... తొమ్మిది రోజులు.. తొమ్మిది రకాల ప్రసాదాలు బతుకమ్మకు సమర్పిస్తారు.
బతుకమ్మకు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పలహారాలు సమర్పిస్తారు. మొదటి రోజు- ఎంగిలిపువ్వు బతుకమ్మ అమావాస్య నాడు చేస్తారు. ఆ రోజు ప్రసాదంగా నువ్వులు, నూకలు, బెల్లం వుంటుంది. రెండో రోజు- అటుకుల బతుకమ్మ: సప్పడి పప్పు, బెల్లం, అటుకులతో ప్రసాదం చేస్తారు. మూడో రోజు మద్దపప్పు బతుకమ్మ..- ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం చేస్తారు..
నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ... పాలు, బెల్లం, నానేసిన బియ్యం ప్రసాదంగా సమర్పిస్తారు. ఐదో నాడు - అట్ల బతుకమ్మకు.. బియ్యం నానబెట్టి తీసి దంచి, లేదా విసిరి అట్లు, దోశలు, ఫలహారంగా పెడతారు.ఆరవరోజు. - అలిగిన బతుకమ్మ.. ఈరోజు బతుకమ్మను పేర్చి ఆట ఆడతారు గానీ, ఈ రోజు ప్రసాదం ఏమీ ఉండదు.ఏడవ రోజు - వేపకాయల బతుకమ్మ: సకినాలు చేసే పిండి పదార్థాన్ని చిన్నచిన్న వేపకాయలంత పరిమాణంలో వేపకాయలుగా, ముద్దలుగా చేసి నూనెలో దేవిన వంటకాలను ప్రసాదంగా సమర్పిస్తారు...ఎనిమిదోనాడు - వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యితో తయారు చేసిన ఫలహారం పెడతారు , చివరి రోజు బతుకమ్మను - సద్దుల బతుకమ్మ అంటారు.. ఐదు రకాల సద్దులు పెరుగన్నం సద్ది, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర , కొబ్బరి తురుము , నువ్వుల పొడి, రకరకాల సద్దులను ప్రసాదంగా
తొమ్మిది రోజులు బతుకమ్మలను చేసి, ఫలహారాలతో ఇంటి ముందు పెట్టుకొని ఉయ్యాల పాటతో ఆడుతారు., గ్రామ బొడ్రాయి దగ్గర కూడా అందరి బతుకమ్మలను ఉంచి, స్త్రీలందరూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొట్టుకుంటూ ఉయ్యాల పాట పాడుకుంటూ ఆడుతారు.డప్పుల దరువు, చప్పుట్ల దరువులు ఉత్సాహంగా ఊరిని కదిలిస్తుంటాయి. ఇక్కడ అన్ని కులాల వారూ చేరి ఐక్యతను, స్నేహాన్ని, గ్రామ బంధుత్వాన్ని కళ్లకు కట్టేలా ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు. బొడ్రాయి దగ్గర చాలా సేపు ఆడిన తర్వాత ఎవరి బతుకమ్మను వాళ్లు రెండు చేతులతో ఎత్తుకొని చెరువు దగ్గరికెళతారు. చెరువు దగ్గర బతుకమ్మలను దించి... ఆడి ఆ తర్వాత నీళ్లలో విడవడం ఆనవాయితీగా వస్తోంది.
పూవులు చెరువులో వేయడంలో ఒక శాస్త్రీయ దృక్పథం ఉందనిపిస్తుంది. బతుకమ్మలో పేర్చే ప్రతి పువ్వు ఆయుర్వేదంలో ఔషధ విలువలున్నవే.. పువ్వులు నీట చేరి కాలుష్యాన్ని నివారిస్తాయని శాస్త్రాల్లో చెప్పారు..
బతుకమ్మను విడవడంలో కూడా ఒక పద్ధతి వుంటుంది. మోకాళ్ల వరకు నీళ్లలో దిగాక... నీటిమీద బతుకమ్మ పళ్లెం ఉంచి, ఇంకా కొంచెం దూరం నడిచి తేలుతున్న బతుకమ్మనుంచి ఆ పళ్లాన్ని మెల్లగా కిందకి ఒత్తి పైకి తీస్తారు. నీళ్లపై తేలుతున్న బతుకమ్మను అలలతో ముందుకు నెట్టి వెనక్కి తిరిగి వస్తారు. వస్తూ వస్తూ పళ్లెంలో కొన్ని నీళ్లు తెచ్చి అందరి మీదా చల్లుతారు. నీళ్లు చల్లాక తెచ్చుకున్న ప్రసాదం ఒకరికొకరు పంచుకుంటూ ‘ఇచ్చుకుంటి వాయినం- పుచ్చుకుంటి వాయినం అనుకుంటూ... అందరూ ఒకచోట కూర్చొని ప్రసాదం తీసుకుంటారు.
ఇదీ పల్లె పడుచుల పండుగ బతుకమ్మ వేడుక.. అనాదిగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాల వెనుక దాగి ఉన్న విజ్ఞాన విషయాలు మనిషిని ఆరోగ్యంగా చేస్తాయని.. అంటువ్యాధులు ప్రభలకుండా ఈ ఆయుర్వేద సూత్రాలు కాపాడుతాయని విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతోంది.. ఈ పండుగ పూల ప్రజలందరూ సుఖసంతోషాలతో బతుకమ్మను జరుపుకోవలని కోరుకుంటూ.. మీ అందరికీ బతుకమ్మపండుగ శుభాకాంక్షలు

Friday, September 23, 2011

అంతరిక్షం నుంచి దూసుకొస్తున్న మృత్యు శకలాలు



సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం మొత్తం ప్రపంచం వణికిపోయింది.. అంతరిక్షం నుంచి నిప్పులు కక్కుకుంటూ ఈ ప్రపంచాన్ని అగ్నిగుండంగా మర్చడానికి ఓ మృత్యుశకలం దూసుకొస్తుందని భయపడింది.. ఆ మృత్యుశకలం పేరే స్కైలాబ్.. అంతరిక్ష ప్రయోగశాల.. ప్రపంచమొత్తాన్ని అగ్నిమారుస్తుందనుకున్న ఆ అగ్నివర్షం సముద్రం లో కురిసింది.. మళ్లీ ముప్పై ఏళ్ల తరువాత అదే భయం.. ఈ రోజు ఉదయం ఆర్స్ నేలను తాకే వరకు అదే ఆందోళన.. ఏ క్షణాన ముంపు ముంచుకొస్తుందని భయం.. ఇలా భయపడాలంటే కొన్ని వేల సార్లు భయపడాలి.. ఎందుకంటే అంతరిక్షం నిండా ఉపగ్రహాలే.. ఏదో ఓరోజు ఇవన్నీ భూమిమీద రాలాల్సినవే.. అంతరిక్ష ప్రమాదాల పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ..
ఒక పక్క ఈ విశాల విశ్వంలో స్వైర విహారం చేస్తున్న గ్రహశకలాలు ఎప్పుడు భూమిని ఢీ కొంటాయోనని మానవాళి భయపడుతోంది.. అపోసిస్ లాంటి భారీ శకలం భూమిని ఢీకొని ప్రళయాన్ని సృష్టిస్తుందని వణికుతోంది.. గ్రహ శకలాల నుంచి శాస్త్రవేత్తలు విశ్వమానవులు కాపాడగలరో లేదో గానీ.. వీళ్ళే మృత్యు శకలాలను మానవుడి నెత్తి పై సిద్ధంగా ఉంచుతున్నారు. ఇప్పుడు భూమి చుట్టూ వందల సం‌ఖ్యలో ఉపగ్రహాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఉపగ్రహాలన్నీ ఏదో ఒకరోజు కూలిపోవలసిందే.. ఆకాశం నుంచి కూలిపోయే ప్రతి ఉపగ్రహానికీ ఇలా భయపడాల్సిందేనా.. అసలీ దుస్థితి ఎందుకొచ్చింది. అంతరిక్షంలో అసలేం జరుగుతోంది.
భూమికి ఒకప్పుడు చంద్రుడు ఒక్కడే ఉపగ్రహం.. అంటే భూమి చుట్టూ తిరిగే వాటిని భూమికి ఉపగ్రహాలంటారు. కానీ ఇప్పుడు భూమికి సుమారు 8 వేల ఉపగ్రహాలు తయారయ్యాయి. 1957లో రష్యా తొలిసారిగా ఉపగ్రహాన్ని ప్రయోగించినపుడు అదో చిరకాల స్వప్న సాకారం. అప్పటి వరకు ఉపగ్రహం అనేది ఒక కాల్పనిక సాంకేతిక పరిజ్ఞానం. అది సాధ్యమయ్యేదా అని నిరాశ చెందిన శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. కానీ మారుతున్న కాలాన్ని బట్టి... పెరిగిన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి ఉపగ్రహమనేది ఇప్పుడొక చిన్న విషయంగా మారింది.. ట్రైనింగ్ లో ఉన్న యువ శాస్త్రవేత్తలు కూడా అవలీలగా ఉపగ్రహాలను తయారు చేసేంత స్థాయికి ఎదిగారు... కాని వచ్చిన చిక్కాల్లా అంతరిక్షంలో ప్రయోగించిన ఉపగ్రహాలు కాలం చెల్లాక అలాగే వదిలేస్తున్నారు. దీంతో అంతరిక్షం చెత్తబుట్టలా మారింది.. మరికొన్ని ఉపగ్రహాలు.. భూమ్యాకర్షణకులోనై భూమి వైపు దూపుకొస్తున్నాయి. ఈ శకలాలు కొన్ని భూ వాతావరణంలో చేరీ చేరకముందే భూ వాతావరణ ఘర్షణకు లోనై మాడిమసవుతాయి. వేగంగా దూసుకొచ్చే ఆ శకలాలు కొన్ని మండుకుంటూ భూమి ఉపరితలాన్ని తాకుతాయి. అప్పుడే పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఈ ముప్పు శాస్త్రవేత్తలకు తెలిసిందే అయినా.. పట్టీ పట్టనట్టు ఉంటున్నారు. ప్రపంచదేశాలన్నిటి నడుమ అవగాహన లేకపోవడం వల్ల ఈ నిర్లక్ష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది.
ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి ప్రతిదేశం ఆసక్తి చూపుతుండటంతో అంతరిక్షంలో తిరగాడే మానవ నిర్మిత వస్తువుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. నిర్ణీత కాలవ్యవధిదాకా పనిచేసి ఆ తరువాత మూలనపడ్డ శాటిలైట్స్, వాటి శకలాలు కూడా అంతరిక్షంలో తిరగుతూనే ఉన్నాయి. ఇలాంటివి సుమారు ఎనిమిదివేలదాకా ఉంటాయని అంచనా. ఇవి కాకుండా రాకెట్ ముక్కలు, స్పెష్ మిషెన్ లోని భాగాలు కూడా సొంత కక్ష్యల్లో తిరగుతున్నాయి. వీటిలో కొన్ని టన్నులకొద్దీ బరువున్నవి కాగా, మరికొన్ని కేవలం పది పౌండ్లు బరువున్నయి కూడా ఉన్నాయి. అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న వస్తువుల్లో కేవలం ఏడు శాతం మాత్రమే సాంకేతికంగా ఉపయోగపడుతున్నాయి.. మిగతావన్నీ అంతరిక్ష శిథిలాలే. వీటి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతుండటంతోనే సమస్య వచ్చిపడింది. 1957 నుంచి ఇప్పటివరకు 4,600ల ఉపగ్రహ ప్రయోగాలు జరిగాయి. మన భూమి చుట్టూ సుమారు ఎనిమిది వేల కృత్రిమ ఉపగ్రహాలు సంచరిస్తున్నాయి. వీటి సంఖ్య రాబోయే కాలంలో మరింత పెరగుతాయి.
అంతరిక్ష చెత్తలో 22 శాతం కాలం చెల్లిన ఉపగ్రహాల వల్ల ఏర్పడిందే. ఇది ఇంకా పెరిగితే ఉపగ్రహాలు ప్రమాదాల బారిన పడటం ఖాయం. రోడ్డు ప్రమాదలంత కామన్ గా అంతరిక్ష ప్రమాదాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. స్పేస్ ఆర్బిట్ లోకి ఉపగ్రహాన్ని పంపి సంబరపడిపోయే రోజులకు స్వస్తి పలకాలి. అంతరిక్షంలో పని లేకుండా తిరగే వేలాది శకలాల నుంచి ఉపగ్రహాలను రక్షించుకోవడం ఇప్పుడో పెద్ద సమస్య. అందుకే, సంపన్నదేశాలు... అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్తను తొలగించేపనిలో పడ్డాయి. అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్తను తొలగించడంకోసం ఇప్పటికే అనేక మార్గాలను అన్వేషించారు. అయితే పూర్తిగా తొలగించడం మాత్రం ఒక పెద్ద సవాలే. అంతరిక్షంలో శకలాల సంఖ్య పెరిగిపోతుంటే, రాబోయేది గడ్డుకాలమే. అంతరిక్షంలో తిరగాడే చెత్త పదార్ధాలను ముందుగా గుర్తించి వాటిని భూ వాతావరణంలోకి చేర్చి కాల్చేయాలి. కానీ అది అంత సులువైన పనికాదు. భారీ శకలాల నుంచి చిన్నాచితకా డెబ్రీస్ వేలాదిగా భూమిచుట్టూ తిరగుతున్నాయి. పైగా `స్పేస్ జంక్' ని తొలగించాలంటే అన్ని దేశాల మధ్య అవగాహన ఉండాలి. కలిసికట్టుగా కార్యక్రమం చేపట్టగలగాలి. గ్లోబల్ వార్మింగ్ విషయంలోనే అంటీముట్టనట్టున్న దేశాలు అంతరిక్ష చెత్త గురించి పట్టించుకుంటాయని ఆశించడం అత్యాశే అయినా అవసరమైన ఆశ.
ఉపగ్రహాలే అంతరిక్ష చెత్తగా మరాయానుకుంటే పొరపాటు. వ్యోమగాములు అంతరిక్షంలోకి చేరాక ఏ చిన్న వస్తువుని బయటకు విసిరేసినా అది స్పేస్ క్రాఫ్ట్ ను వెంటాడి వస్తుంది. అదే వస్తువును బలమైన శక్తితో విసిరితే ఆ వస్తువు వేరే కక్ష్య ను ఏర్పాటుచేసుకుని మళ్ళీ ఎక్కడోఓచోట అడ్డం తగులుతుంది. లేదా అలా విసిరివేయబడిన వస్తువు మరో శాటిలైట్ ని ఢీకొనే ప్రమాదమూలేకపోలేదు. అంటే స్పేస్ ట్రావెల్ అంత తేలిక కాదన్నమాట. ఏప్పుడో ఒకప్పుడు ఏ క్షణంలోనైనా వ్యర్ధ శకలాలు ఎదురుకావచ్చు. అవి స్పేస్ క్రాఫ్ట్ ని ఢీకొనక తప్పదు. 1996లో ఫ్రెంచ్ గూఢచారి ఉపగ్రహాన్ని సూట్ కేసంత సైజున్న ఓ శకలం ఢీకొంది. దీంతో ఆ ఉపగ్రహం దెబ్బతిన్నది. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో అత్యంత సామాన్యమైనవిగా మారిపోతాయన్నదే ఇప్పుడు శాస్త్రవేత్తలందర్నీ పీడిస్తున్న భయం.
చాలాకాలం నుంచి వేలాదిగా అంతరిక్షనౌకలను ప్రయోగించారు. వాటిలో చాలా మటుకు పనిపూర్తయ్యాక విచ్ఛిన్నమయ్యాయి. అయితే వాటిలో కొన్ని భాగాలు ఇప్పటికీ స్పేస్ ఆర్బిట్స్ లో తిరగుతూనేఉన్నాయి. ఇలాంటి శకలాలను భూమికి మరింత దూరంగా నెట్టివేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. అయితే ఇందుకు అయ్యే ఖర్చును ఎవరు భరిస్తారన్నది అసలు ప్రశ్న. లేజర్ కిరణాలను ఉపయోగించడం ద్వారా కూడా అంతరిక్షంలోని చెత్తను తొలగించవచ్చని అంటున్నారు. కోట్లాది డాలర్లు ఖర్చుచేసి నిర్ణీతకక్ష్యలోకి పంపినా వాటి ఆయుష్షు ఎంతకాలమో శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. 2009 ఫిబ్రవరి నెలలో ఎవ్వరూ ఊహించని విధంగా అమెరికా, రష్యాదేశాలకు చెందిన ఉపగ్రహాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం కారణంగా అంతరిక్షంలో శకలాలు భారీగా వెదజల్లబడ్డాయి. వాటిలో చాలామటుకు సొంత కక్ష్యల్లో తిరగుతున్నాయి.
అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాలు భూమ్యాకర్షణ శక్తి పరిధిలోకి ఎలా వస్తాయి. గతంలో 30 సంవత్సరాలకు ముందు ప్రపంచ ప్రజానీకాన్ని స్కైలాబ్ ఎందుకంత భయపెట్టింది. ఎక్కడో అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలు మానవమనుగడకు ముప్పు తేవడం వెనక కారణాలేంటి.. వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే. గతంలో స్కైలాబ్ ప్రయోగం గురించి తెలుసుకోవాల్సిందే..
అవి సాంకేతిక వ్యవస్థను కొత్తగా కొత్తగా వాడుకుంటున్న రోజలు. అంతరిక్ష ప్రయోగం చేయడమంటే కత్తి మీద సాములాంటిది. అయినా శాస్త్రవేత్తలు ధైర్యం చేశారు. వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షానికి పంపారు. కానీ ఆ ఉపగ్రహంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అంతే ఉపగ్రహం వచ్చిన దారి తిరిగి మళ్లింది. అంటే తిరిగి భూమి మీద కూలడానికి సిద్ధమయింది. అది ఎక్కడ ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. కానీ గండం తప్పింది. స్కైలాబ్ సముద్రంలో కూలడంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు.
అంతరిక్ష విజ్ఞానానికి బలమైన పునాదులు పడుతున్న రోజులవి.. అప్పుడప్పుడే ఉపగ్రహ వ్యవస్థ ఊపందుకుంటోంది.. సూర్యుడి పై విశేశాలు, వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి 1979లో అంతరిక్ష ప్రయోగ శాలను ఏర్పాటు చేశారు. దాని పేరే స్కైలాబ్. ఈ స్కైలాబ్ ప్రయోగం వికటించింది.. సాంకేతిక సమస్యలు రావడంతో మళ్లీ భూమి పరిధిలోకి బయలు దేరింది.. శాస్త్రవేత్తలకు ఏంచేయాలో అర్ధంకాలేదు. ఒకపక్క కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన ప్రయోగం విఫలమయిందే బాధ.. మరో పక్క ఆ స్కైలాబ్ చేయబోయే వినాశ ఎలా తప్పించాలనే ఆలోచన. ఈ వార్త ప్రసార సాధనాల ద్వారా ప్రపంచం మొత్తాన్ని చేరింది. . స్కైలాబ్ భూమిని తాకితే మహోత్సాతం తప్పదని ప్రజలంతా నిద్రలేని రాత్రులు గడిపారు. కొందరైతే ఇవే ఆఖరు గడియలని చేయాల్సిన ఎంజాయ్ చేశారు. ప్రపంచం తుడిచి పెట్టుకు పోతున్నంత హడావుడి చేశారు. కానీ గండం గడిచింది.. స్కైలాబ్ వైపు మళ్లి.. సముద్రంలో కూలడంతో పెను ప్రమాదం తప్పింది.. ప్రమాదం తప్పడంతో శాస్త్రవేత్తలంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. అంతేకాదు కొందరు తమ పిల్లలకు స్కైలాబ్ అని పేర్లు పెట్టుకున్నారంటే. స్కైలాబ్ ప్రపంచ పౌరుల పై ఎంత ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటీకీ ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ప్రాంతాలలో స్కైలాబ్ లున్నారు.
చరిత్ర పునరావృతం అయింది.. శాస్త్రవేత్తల నిర్లక్షమో... సమస్య వచ్చినప్పుడు చూద్దాంలే అన్న దాటవేత దోరణి వల్ల.. మళ్లీ ముప్పై ఏళ్ల తరువాత అట్లాంటి ప్రమాదమే ప్రపంచాన్ని వణికించింది. స్కైలాబ్ ను గుర్తుకు తెచ్చింది. అయితే పెరిగిన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం.. ఇప్పటికే చాలా టి.వి ఛానళ్లు ప్రపంచం తుడిచి పెట్టుకుపోతుందనే కట్టుకథలు నిత్యం ప్రసారం చేయడం.. అవేవీ జరగక పోవడం వల్ల ప్రజలు ఇదీ కూడా అట్లాంటి ఊహాజనిత ప్రమాదం గానే పరిగణించారు. అమెరికా, యూరప్ లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల ప్రజలు కాస్త ఆందోళన పడుడ్డా.. భారత్‌ దాని పరిధిలో ఉన్న ప్రజలు కనీసం దీని గురించి ఆలోచించడానికి కూడా సాహసించ లేదు.
ఆర్స్ ఉపగ్రహం ఎందుకు భూమి వైపు దూసుకొచ్చింది. అంతరిక్షంలో ఉన్న ప్రతీ గ్రహం ఏదో ఒకరోజు భూమి పరిధిలోకి రావలసిందేనా.. అలా అయితే చెత్త బుట్టలా మారిన అంతరిక్షం భూమి పై తన పగ తీర్చుకోబోతోందా.. ఇంతకీ ఇప్పుడు భూమిని తాకి ఆర్స్ ఉపగ్రహం ఎప్పటిది.. ఈ ఉపగ్రహం భూమి పై ఇంత హల్‌చల్ చేసే వరకు శాస్త్రవేత్తలేం చేస్తున్నారు.
నిప్పులు చిమ్ముతూ ఆర్స్ ఉపగ్రహం భూగోళం పై పేలిపోయింది.. 1991లో ప్రయోగించిన ఈ ఉపగ్రహం ఓజోన్ పొర అధ‌్యయనం కోసం ప్రయోగించారు. ఈ ఉపగ్రహం ఆరేళ్ళ క్రితమే అంతరిక్ష వ్యర్ధాల జాబితాలో చేరిపోయింది. మూడేళ్ల అవరసరాల కోసం అంతరిక్షంలోకి పంపిస యుఏఎస్ఆర్‌ను అగ్రరాజ్యం 15 ఏళ్లపాటు వినియోగించింది. ఇప్పుడది అదుపు తప్పి భూ వాతావరణం వైపుకు పయనిస్తోంది. ఆరున్నర టన్నుల బరువైన శాటిలైట్ శకలాల్లో చాలా వరకు.... భూ వాతావరణంలో ప్రవేశించగానే దగ్దమైపోతాయి ...మిగిలిన కొద్ది పాటి శకలాలు అంటే.. 532కిలోల బరువున్న ఉపగ్రహ శకలాలు భూగోళాన్ని ఢీకొన్నాయి.
ఈ సంఘటన నుంచి శాస్త్రవేత్తలు పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతరిక్షంలో భారీగా పేరుకు పోతున్న ఉపగ్రహాలను కాలం చెల్లగానే కాల్చేయాలి. లేజర్ కిరణాలతోనో.. లేదా ఇతర ఇంధనాలతోనే వీటని అంతరిక్షంలోనే మసి చేయాలి. వీటితో బాటు వ్యోమగాములు అంతరిక్షంలో వ్యర్ధ పదార్ధాలను విసరకూడదనే నియమం విధిగా పాటించాలి.
ఇక నుంచి ఏ ఉపగ్రహం,.. మానవాళికి విపత్తు కలిగించకుండా ఉండాలని క ోరుకుందాం.. అంతేకాదు అంతరిక్షం నుంచి మానవ ప్రయోగ వస్తువులేవీ భూమి పైకి దూసుకురావని ఆశిద్దాం.. భవిష్యత్తులోనైనా మన ప్రపంచ శాస్త్రవేత్తలు ఉపగ్రహాలను ప్రయోగించి వదిలేయకుండా.. చెత్త బుట్టలో ఉన్న ఉపగ్రహాలను అంతరిక్షలోనే బూడిద చేస్తారని ఆశిద్దాం..

Thursday, September 22, 2011

సమ్మె పోటుకు సామాన్యుడి కష్టాలు

సకల జనుల సమ్మెతో ప్రజలకు సకల కష్టాలెదురవుతున్నాయి.. సమ్మె సక్సెస్ మాట ఎలా ఉన్నా. సమాన్యుడికి మాత్రం సమ్మె.. సమ్మెట దెబ్బలా మారింది. ఎన్నాళ్లకు ముగుస్తుందో తెలియని సమ్మెతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.. బందుల పై ప్రజలు పడుతున్న ఇబ్బందుల పై హెచ్‌ఎంటీవీ స్పెషల్ స్టోరీ..
బ్యాంగ్ - ఇబ్బందులు

తెలంగాణ సాధన కోసం ఉద్యోగులు, ఉపాద్యాయులు, కార్మికులు చేస్తున్న సకల జనుల సమ్మె ఎప్పుడు మగుస్తుందో తెలియదు.. అసలు ముగుస్తుందో లేదో తెలియని పరిస్థితి.. ఎందుకంటే కేంద్రం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చేవరకు సమ్మె విరమించే సమస్యే లేదంటున్నారు ఉద్యోగులు.. కానీ సమ్మె వల్ల మామూలు ప్రజలు అష్ట కష్టాలెదుర్కుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల మాత్రం సమ్మె ప్రభావమే లేదంటున్నారు. 80 శాతం పాలన సుజావుగా సాగుతోందని బుకాయిస్తున్నారు.
ఈ మాట హైదరాబాద్‌లో కష్టాలు పడుతున్న మామూలు జనాన్ని అడిగితే అసలేం జరుగుతుందో చెబుతారు.. సమ్మె ప్రభావం సామాన్యు జీవితం పై ఎంత ప్రభావం చూపుతుందో తెలుస్తుంది. ఆర్టీసీ బస్సులు నడవక పోవడంతో.. సెట్విన్ బస్లుల దోపిడికి అంతులేకుండా పోయింది.. కోటి నుంచి అమీర్‌పేటకు 30 రూపాయల పై చిలుకు వసూలు చేస్తున్నారు. ఆటోవాళ్లు అడిగినంత ఇవ్వకుంటే మారు మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. మరో వైపు ఆ మాత్రం కూడా అవకాశం లేకుడా 24, 25 తేదీల్లో ఆటోలు కూడా బంద్ బాట పట్టాయి. సెట్విన్ బస్సులు కూడా బందులో పాల్గొనాలనే డిమాండ్ కూడా మొదలయింది. కాస్తో కూస్తో రైళ్లు ఆదుకుంటున్నాయంటే రైల్ రోకో కూడా ప్రకటించారు. ప్రభుత్వం తాత్కాలిక సిబ్బందితో బస్సుల నడిపిస్తుంటే వారికి ఎక్కణ్ణుంచి ఎక్కడికి ఛార్జీలు ఎంత తీసుకోవాలో తెలియక.. ఎక్కడికైనా పది రూపాయలే వసూలు చేస్తున్నారు. ఇక కూరగాయలు, చికెన్ మటన్ ల ధర చుక్కల్లో ఉంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల తాము కూడా రేట్లు పెంచక తప్పట్లేదంటున్నారు.
సింగరేణిలో బొగ్గు పెల్ల కదలక పోవడంతో బొగ్గు నిల్వలు అడుగంటాయి.. రెండు రోజులకు మించి బొగ్గు లేదని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే అంటున్నారు. సింగరేణి సమ్మె ప్రభావం విద్యుదుత్పత్తి పై పడటంతో గ్రామాలన్నీ అంధకారం అయ్యాయి. పోనీ పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి పంపిణీ చేద్దామంటే కరెంటోళ్ల సమ్మ అంటూ విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగారు. దీంతో పట్టణాల్లో కూడా కోత మొదలయింది. ఇప్పటికే హైదరాబాద్ లో రెండు గంటల ప్రకటిత కోత విధిస్తున్నారు. మరో రెండు రోజుల్లో రెండు గంటలను నాలుగు గంటలకు పెంచే అవకాశం ఉంది. మరో వైపు స్కూళ్లు కూడా మూతపడ్డాయి. సమ్మెకు మద్దతుగా ప్రభుత్వ వైద్యులు కూడా అవుట్ పేషంట్లను పట్టిచ్చుకోవడం మానేశారు. ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఆసుపత్రుల డాక్టర్లు విధులను బహిష్కరించారు. సమ్మెలో పాల్గొంటున్న విద్యార్ధి, ఉద్యోగుల పై జరుపుతున్న దాడులకు నిరసనగా తాము దీక్ష చేపట్టినట్టు డాక్టర్లు చెబుతున్నారు.
సామాన్య ప్రజలు మాత్రం సమ్మె నిర్వహణ తీరు మారిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నారు. అయితే సమ్మ ప్రభావానికి ఎన్ని సర్వీసులు బందైనా మద్యం షాపుల మాత్రం జోరుగా సాగుతుండటం కొస మెరుపు.
బ్యాంగ్

క్రిస్టల్ స్కల్ గొప్పతనం



ఈ విశాల ప్రపంచంలో నిశీధి రహస్యాలెన్నో తరాల తరబడి ఛేదించకుండా అలా సుప్తావస్థలోనే మగ్గిపోతున్నాయి. ప్రపంచ చరిత్రలో వేల సంవత్సరాలుగా కొన్ని వింతలు వింతలుగానే మిగిలి పోయాయి. ఆధునిక నాగరికత ప్రారంభం కాక ముందే అత్యంత సూక్ష్మ సాంకేతిక వ్యవస్థలు అభివృద్ది చెంది సమసి పోయాయన్న వాదనలకు అంత బలం లేకున్నా.. 85 సంవత్సరాల క్రితం ఈ భూమి పై వెలుగులోకి వచ్చిన క్రిస్టల్ స్కల్స్ ఓ అపూర్వ ఘట్టానికి తెరలేపినయి. ప్రాచీన సమాజం వాడిన సాంకేతిక పరిజ్ఞానం కింద మన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏ పాటిదో తెలుస్తోంది.. ఇంతకీ ఏంటా క్రిస్టల్ స్కల్స్..వాటి ప్రత్యేకత ఏంటి..
***************************************************************
అది చూడ్డానికి గాజు నిర్మితమైన ఉండే కపాలం.. కానీ గాజు కాదు.. దాన్ని తయారు చేయడం అంత తేలిక కూడా కాదు.. నిజానికి మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్న క్రిస్టల్ స్కల్ చాలా సామాన్యమైనదిగా కనిపిస్తుంది.. ఫ్యాన్సీ షాపులో దొరికే గాజు వస్తువుల్లా కనిపించే ఈ క్రిస్టల్ స్కల్స్ వేల సంవత్సరాల క్రితం అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడ్డాయి.
ఈ భూమి అద్భుత రహస్యాలను ముద్రించుకున్న గ్రంధం.. వేలాది సంవత్సరాలుగా చరిత్ర పుటల్లో.. భూమి పొరల్లో తనకు తాను.. మూల చరిత్రలను, పాద ముద్రలను రాసుకున్న విశాల పత్రం.. మనిషి తన జీవిత కాలంలో కేవలం వంద సంవత్సరాల ప్రపంచాన్ని మాత్రమే చూడ గలడు. తనకు ముందు ఏం జరిగిందో చూడాలంటే సాధ్యం కాదు. ఇప్పుడంటే విజువల్స్ రికార్డ్ చేయడం సాధ్యమవుతుందిగానీ రెండు వందల సంవత్సరాలకు ముందు పూర్తిగా అంధకార యుగం.. రెండు వందల సంవత్సరాల క్రితానికి నేటికి ఈ భూమి పై ఊహాతీత మార్పులు జరిగాయి. అటువంటిది వేల సంవత్సరాలలో ఈ భూమి పై ఎన్ని మార్పులు జరిగి ఉండాలి.. ఈ భూమి ఖండఖండాలుగా విడిపోయి. తిరిగి ప్రాంతాలుగా విభజింప బడినట్టు పరిశోధనల్లో రుజువయింది.. అవును. ఆ ఖండ చలనాల్లో ఎన్నో ఆనవాళ్లు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. . ఎన్నో అతీత శక్తులు వెలుగు చూడకుండా భూమి పొరల్లో కలిసిపోయాయి.. అలా మానవ చరిత్రలో కొంతకాలం వెలుగు వెలిగి నిశీధిలో కలిసిపోయి.. తిరిగి గత 85 సంవత్సరాల క్రితం వెలుగు చూసి పరిశోధకులకు సవాలుగా నిలిచిందే క్రిస్టల్ స్కల్
ఈ ప్రపంచం ఒకప్పుడు అవిభాజ్యంగా ఉందని.. భూమి సముద్రం అనే రెండు ఖండాలుగా ఉండేవని ఖండ చలన సిద్ధాంతం చెబుతోంది. భూమి పొరల్లో వచ్చిన మార్పుల వల్ల భూగోళం పై ఉన్న భూభాగం ఖండఖండాలుగా విడిపోయింది. భూమి ఇలా ‌ఖండాలుగా విడిపోయేటపుడు ఎన్నో ప్రాంతాలు సముద్రగర్భంలో కలిసిపోయాయి.. ఎన్నో ప్రాంతాలు జలగర్భం నుంచి పైకి వచ్చి కొత్త ప్రాంతాలుగా విలసిల్లాయిని శిలాజ పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో దీవులు సముద్ర గర్భంలో దాగిన భూబాగమే.. అందుకే పరిశోధకుల తవ్వకాల్లో వీటిలో సముద్ర జీవుల శిలాజాలు లభిస్తున్నాయి. అంతేకాదు భూమి పై నాగరికత విలసిల్లిన ప్రాంతాలు ఖండ చలనంలో విడిపోయి కనుమరుగయి పోయాయి. అలా కనుమరుగయి పోయిన నగరమే.. అట్లాంటిస్.. యస్.. అట్లాంటిస్ నగరం ఒకప్పుడు ప్రపంచ చరిత్రలో అధునికత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్న నగరంగా చెబుతారు.. అయితే ఇక్కడ నివసించిన వారికి కొన్ని అతీత శక్తులున్నాయని.. వారికున్న శక్తులతో అద్భుతాలు సృష్టించగలిగేవారని ప్రచారంలో ఉంది. అయితే ఆ అట్లాంటిస్ నగరమనేది వాస్తవానికి ఎక్కడ ఉందనేది ఇతిమిద్దంగా తెలియదు. అయితే ఈ నగరం ఉత్తర.. దక్షణ అమెరికాల మద్యబాగంలో ఉండి ఉండేదన్న వాదనలున్నాయి. ప్లేటో తన రచనల్లో అట్లాంటిస్ నగరం గురించి ప్రస్తావించాడు. తన పూర్వికులు చెప్పిన విషయాల ప్రకారం అట్లాంటిస్ వంటి నగరాలు అత్యంత అభివృద్ది చెందిన నాగరికతను కలిగి ఉన్నాయని.. అక్కడ ఆధునిక సాంకేతిక విజ్ఞానం దొరికే అవకాశం ఉందని ఉదహరించాడు. అయితే కాలగర్భంలో ఆ నగరం సముద్రం పాలయిందని.. భూకంపాలు, సునామీ వంటి ఉత్పాతాల వల్ల నగరం మునిగిపోయిందనే వాదన ఉంది. కొందరు మాత్రం అట్లాంటిస్ అనేది కేవలం కట్టు కథ అని కొట్టిపారేశారు. మరికొందరు మెక్సికో నగరపు సానువుల్లో అట్లాంటిస్ ఉందని వాదించారు. ఏది ఏమైనప్పటికీ అట్లాంటిస్ నగరం ఉందా లేదా.. ఉంటే దాని గర్భంలో ఏమైనా ఆధునిక శాస్త్ర పరిజ్ఞాన ఆనవాళ్లు దొరుకుతాయా అనే అన్వేషణకు బయలుదేరాడు ఒక పరిశోధకుడు.
ప్రపంచానికి ఈ అట్లాంటిస్ నగరం ఆనవాళ్లు చూపించాలనే తపనతో ఒక పరిశోధకుడు బయలు దేరాడు.. అతడే మిచల్ హెడ్జెస్.. భూగోళ చరిత్రలో అద్భుతాలు సృష్టించిన ఓ అసమాన్య నగరపు ఆనవాళ్లను అన్వేషించుకుంటూ వెళ్లిన మిచల్ హెడ్జెస్ కు అంతుబట్టని ఎన్నో అద్భుతాలు ఎదురయ్యాయి.. యావత్ ప్రపంచం నివ్వెరపోయే అద్భుతాలెన్ో తారసపడ్డాయి.. ఆ అద్భుతాల్లో ఒకటి క్రిస్టల్ స్కల్ .. కనీసం మానవుడు ఊహించడానికి కూడా సాహసం చేయని ఒక అపురూప నిర్మాణం.. దాని వయసును కూడా నిర్ధారించడానికి అలివికాని పదార్ధంతో చేయబడ్డ ఒక మానవాతీత పరికరం.. వేలాది సంవత్సరాల కిందటి నిర్మాణం చెక్కుచెదరకుండా తన ప్రాభవాన్ని కోల్పోకుండా లభించిన ఓ మిస్టీరియస్ ఆబ్జెక్ట్ .. క్రిస్టల్ స్కల్..
ఇంతకీ క్రిస్టల్ స్కల్ గొప్పతనం ఏంటి.. మంచుముక్కలా ఉన్న ఈ క్రిస్టల్ స్కల్ కు అంత ప్రాధాన్యం ఎందుకొచ్చింది. గాజుకుప్పెలా.. పేపర్ వెయిట్ లా అలంకరణ కోసమే తయారు చేశారా అనుకున్నంత ఒక అందమైన నిర్మాణానికి పరిశోధకులు ఎందుకింత ప్రాధాన్యం కల్పించారు. ఈ క్రిస్టల్ స్కల్ లో పరిశోధకులకు కనిపించిన అద్భుతాలేంటి.. నిజంగా అద్భుతాలే జరిగితే వాటిద్వారా వాళ్లు నేర్చుకున్న పాఠాలేంటి.. క్రిస్టల్ స్కల్స్ మానవాళికి నేర్పిన కొత్త విషయాలేంటి..
ఇక్కడ మనకు గాజు ముద్దలా కనిపిస్తున్న ఈ క్రిస్టల్ స్కల్ మామూలు పుర్రె కాదు. ఏదో ఆనందం కోసం తయారు చేసుకున్న ఒక అపురూప పరికరం కాదు. అట్లాంటిస్ నగర ఆనవాళ్లను పరిశోధించాలని బయలుదేరిన మిచెల్ హెడ్జెస్ ఎన్నో దండకారణ్యాలు దాటుకుంటూ వెళ్లాడు. కానీ తనకు ఎక్కడా అట్లాంటిస్ ఆనవాళ్లు లభించలేదు. తనతో బాటు తన కుమార్తె అన్నాను కూడా వెంట తీసుకెళ్లి అడవుల్లో తిప్పాడు. మిచెల్లి హెడ్జెస్ కూతురు.. అన్నా కూడా చాలా తెలివైనది.. వయసులో చిన్నదైనా పరిశోధన మొత్తాన్ని ఆసక్తిగా తిలకించేది.. అట్లాంటిస్ నగరం సముద్ర గర్భంలో మునిగిపోయిందనుకున్న మిచెల్ నిరాశతో వెనుతిరగాలను కున్నాడు. కానీ ఆ రోజు సాయంత్రం ఓ అద్భుతం జరిగింది. తాము నివసిస్తున్న గుడారాలకు దగ్గరలో ఒక లోయలో ధగధగా వెలిగిపోతున్న గాజు పుర్రెను చూసింది అన్నా.. అంతే మరుక్షణమే ఆ ప్రాంతాన్ని తవ్వి ఆ పుర్రెను వెలికి తీసింది.. కేవలం క్రిస్టల్ కపాలం మాత్రమే అభించింది. మూడు నెలల తరువాత దవడ బాగం కూడా లభించింది.. ఆ కపాల బాగానికి సరిపోయి ఉండటంతో ఇది ఆ కపాలానిదేన్న నిర్ణయానికి వచ్చారు. కానీ మాయన్ నాగరికత విలసిల్లిందిగా చెప్పబడే ఆ ప్రాంతంలో ఆ క్రిస్టల్ స్కల్ ఎందుకుంది.. దీనికున్న మహిమలు ఏంటి.. మహిన్వితమైనదే అయితే ఇంతకాలం ఎందుకు మరుగున ఉన్నది ఇవన్నీ హెడ్జెస్ కు అర్దం కాని ప్రశ్నలు.. 1924 అట్లాంటిస్ శిథిలాల కోసం జరిపిన తవ్వకాల్లో వెలుగు చూసిన నిజాలు చాలాకాలం చీకట్లోనే మగ్గిపోయాయి.. తాను చూసిన నిజాలేవీ.. బయటి ప్రపంచంతో పంచుకోడానికి ఎందుకో మిచెల్ ఇష్టపడలేదు. క్రిస్టల్ స్కల్ కు సంబంధించిన విషయాలను బయటి ప్రపంచానికి తెలియజేస్తే వాటిని దుర్వినియోగం చేస్తారనే భయం కావచ్చు. లేదా దాన్ని తన నుంచి దూరం చేస్తారనే భయం కావచ్చు.. లేదా అంతకు మించి వాటి గురించి ఆయనకు ఏదైనా అద్భుతం తెలిసి ఉండాలి.. కానీ ఇవేవీ చెప్పకుండానే.. తనకు తాను నిర్ణయించుకున్న నియమాల బంధీలో ఈ రహస్యాలను శాశ్వతంగా బందీ చేశాడు.. రోజుల తరబడి చేసిన పరిశోధనా ఫలితాలు బయటి ప్రపంచానికి అందకుండానే శాశ్వతంగా సమాధి అయ్యాయి. మిచెల్లీ హెడ్జెస్ రాసుకున్న పరిశోధనా పత్రాలు చాలా కాలం చిత్తు ప్రతుల్లా బుట్టదాఖలై హెడ్జెస్ లైబ్రరీలో ఓ పరిశోధనా హస్తం కోసం వేయి కళ్లతో ఎదురు చూశాయి.. మిచెల్ మరణానంతరం.. అన్నా క్రిస్టల్ స్కల్ గురించి లోకాలని వెలుగు చూపింది.. తన తండ్రితో బాటు తాను ఎలా అడవుల్లో గడిపిందో నోరు మెదిపింది.. తండ్రి బతికున్నంత కాలం మౌనంగా ఉన్న అన్నా.. తండ్రి మరణానంతరం తాను కనుగొన్న విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయకుంటే వ్యర్ధమనుకుందో ఏమో క్రిస్టల్ స్కల్ ను పట్టుకొని అన్ని ప్రాంతాలు తిరగి దాని గొప్పతనం గురించి పరిచయం చేసింది.. అంతే ప్రపంచ శాస్త్రవేత్తలు నివ్వెరపోయారు. క్రిస్టల్ స్కల్ గొప్పతనం.. దాని నిర్మాణ శైలి.. అందరినీ ఆకట్టుకుంది..
అన్నా చూపిన క్రిస్టల్ స్కల్ పూర్తిగా మానవుడి పుర్రెకు సారూప్యాన్ని కలిగి ఉంది.. అయితే దీని నిర్మాణానికి ఉపయోగించిన పదార్ధం అత్యంత కఠినమైన క్వార్ట్జ్ ఖనిజంతో తయారు చేయబడింది. క్వార్ట్జ్ ఖనిజాన్ని అంత నునుపుగా నగిశీలు దిద్దడం అంత సులువైన విషయం కాదు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందిన ఈ రోజుల్లో కూడా క్వార్ట్జ్ పదార్ధంతో అంత నైపుణ్యమైన శిల్పాన్ని చెక్కడం సాధ్యం కాదు. అసలు ఇది కేవలం భ్రమా లేక వాస్తవమా.. నిజంగా వేల సంవత్సరాల క్రితం దేనా లేక అన్నా ఏదైనా నాటకమాడుతోందా అని పరిశోధించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. దీంతో మరో కొత్త విషయం వెలుగు చూసింది. అన్నా చూపిన ఆ క్రిస్టల్ స్కల్ ఎప్పటిది.. అది నిజంగా త్రవ్వకాల్లో లభించిందేనా.. ఎన్నో లక్షల సంవత్సరాల కిందటి శిలాజాల వయసును గుర్తించ గలుగుతున్న శాస్త్రవేత్తలు ఈ క్రిస్టల్ స్కల్ వయసును ఎందుకు కనిపెట్టలేకపోయారు. ఇంతకీ ఈ క్రిస్టల్ స్కల్ గొప్పతనం ఏంటి.. కేవలం క్వార్ట్జ్ ఖనిజంతో అంతే అత్యంత కఠినమైన పదార్ధంతో నైపుణ్యంగా తీర్చిదిద్దడమే దీని ఘనతా లేక ఇంకా వేరే అద్భుతాలైమైనా ఉన్నాయా..
క్రిస్టల్ స్కల్ ఎంత కఠినమైన పదార్ధంతో తయారు చేయబడిందో దీని వెనకున్న మర్మాన్ని కనుగొనడం కూడా అంతే కఠినంగా మారింది. ఎందుకంటే ఏ వస్తువుగానీ.. శిలాజం గానీ.. శిధిలంగానీ.. దొరికిన ఆనవాళ్లను బట్టి దాని వయసు కనుగొనాలంటే కచ్ఛితంగా ఆ బాగంలో కార్భన్ పదార్ధం ఉండి తీరాలి. ఆ కార్భన్ పదార్ధం కూడా ఉద్ఘారం చెందుతూ ఉంటే. కార్భన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా ఆ వస్తువు ఏ కాలం నాటిది. ఎన్ని వందల సంవత్సరాలనాటిదనే విషయం తేలికగా చెబుతారు. కానీ మనకు అభించిన ఈ క్రిస్టల్ స్కల్ పూర్తిగా క్వార్ట్‌జ్ ఖనిజంతో తయారవడం వల్ల దీనిలో లేశ మాత్రం కూడా కార్భన్ లేక పోవడం వల్ల దీని వయసును నిర్ధారించడం సాధ్య పడలేదు. వేల సంవత్సరాల క్రితం తయారు చేయబడ్డదైనా.. నాలుగు రోజుల క్రితం తయారుజేయబడ్డంత ఫ్రెష్ గా ఉండటం మరోప్రత్యేకత.. వీటన్నిటికీ మించి ఈ క్రిస్టల్ స్కల్స్ గురించి రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి.. కారణం అన్నా చూపిన క్రిస్టల్ డోమ్ లాంటివే మరికొన్ని వెలుగులోకి రావడం.. దాంతో బాటు.. క్రిస్టల్ స్కల్స్ ను ఫోటోలు తీసినపుడు రకరకాల ఇమేజెస్ రావడం. ఆశ్చర్యాన్ని గొలిపే అంశం.. దాంతో బాటు కొందరు పరిశోధకులు క్రిస్టల్ పుర్రెలకు యుగాంతానికి దగ్గర సంబంధం ఉందని చెప్పడంతో క్రిస్టల్ స్కల్స్ పై మరింత ఆసక్తి నెలకొంది.
క్రిస్టల్ స్కల్స్ కు యుగాంతానికి సంబంధం ఏంటి.. నిజంగా ఈ పుర్రెలకు అంత మహత్యం ఉందా. అసలు ఇన్నేళ్ల పరిశోధనలో క్రిస్టల్ స్కల్స్ లో మనిషి కనిపెట్టిన అద్భుత అంశం ఏంటి.. మిచెల్ క్రిస్ట్ల్ స్కల్ ను ప్రపంచానికి చూపించాక రకరకాల క్రిస్టల్ స్కల్స్ పుట్టుకొచ్చాయి. ఇవన్నీ నిజమైనవేనా.. లేక ఇందులో కూడా మాయగాళ్లు చేరి మానవాళిని తప్పుదోవ పట్టిస్తున్నారా..చూద్దాం..
ఈ క్రిస్టల్ స్కల్స్ నిర్మాణా శైలిని బట్టి చూస్తే ఇవి ఇప్పటికిపుడు తయారు చేసినంత ఫ్రెష్ గా ఉన్నాయి. వీటిని తయారు చేసిన టెక్నాలజీ కూడా అద్భుతంగా ఉంది. కానీ వీటి వయసు లెక్కించడానికి ఎటువంటి ఆధారాలు లేకపోవడం.. ఆర్గానిక్ సబ్టెన్సెస్ ఏదీ అందుబాటులో ఉండకపోవడం ఒక చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే యువ శాస్త్రవేత్తలు మాత్రం ఇవి కేవలం 150 నుంచి 200 సంవత్సరాల మద్యకాలంలో జర్మనీలో తయారు చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మానవ నిర్మితమై ఎంతటి నైపుణ్యం పనితీరుకైనా ఆ వస్తువు తప్పకుండా చాలా సన్నపాటి గీతలు ఉండి తీరుతాయని.. కానీ ఈ క్రిస్టల్ స్కల్ పై ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో పరిశీలించినా చిన్న గీత కూడా కనిపించక పోవడం వల్ల ఇది ఆధునిక పరికరాలతోనే తయారు చేశారనే వాదనకు తెరతీస్తున్నారు. అయితే పరిశోధకులకు కూడా అందని వాదన ఇదే.. వాస్తవానికి ఈ క్రిస్టల్ స్కల్స్ అనేవి మానవులు తయారు చేసినవి కాదు అనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ఎందుకంటే అట్లాంటిస్ నగరం.. మాయన్ నాగరికత విలసిల్లిన రోజుల్లో ఈ భూమి పైకి అతీత శక్తులుండే వారు సంచరించే వారని.. వారే ఈ క్రిస్టల్ స్కల్ లను బహుకరించారని ప్రచారం జరుగుతోంది. దేవలోకం నుంచి ఏలియన్స్ వంటి వారు భూలోక వాసులకు ఇచ్చిన బహుమానాలుగా భావిస్తున్నారు. మరో కథనం ప్రకారం భూమి పై ఇప్పటికి కూడా చిన్న, చిన్న క్షుద్ర పూజలకు పుర్రెలనే వాడుతారు. అలాగే ఆనాడు ఈ క్రిస్టల్ స్కల్స్ తో తంత్రాలు నిర్వహిచేవారని కూడా అర్ధం చేసుకుంటున్నారు. పుర్రె ఆకారాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారనే దాని పై పెద్దగా స్పష్టత లేకున్నా.. ఈ స్పటిక పుర్రె వెనుక పెద్ద కథే ఉంది. ఈ ప్రపంచం మొత్తం మీద 13 క్రిస్టల్ స్కల్స్ ఉన్నాయి. వీటిలో 12 పుర్రెలు వర్తులాకారంలో నిర్ధిష్టమైన దూరంలో అమర్చి.. మద్యలో వాటిలో మూలాధారమైన స్కల్ ను అమరిస్తే.. యుగాంత సమయంలో ఇవన్నీ ఒక్కచోటకు వచ్చి ఒక్కొక్క స్కల్ లో ఉన్న పవర్ ను షేర్ చేసుకొని అద్భుతాన్ని సృష్టిస్తాయనే కథనం ప్రచారంలో ఉంది. అందుకే ఈ క్రిస్టల్ స్కల్స్ కోసం తీవ్రంగా వెతుకులాట ప్రారంభించారు శాస్త్రవేత్తలు.. వారి అన్వేషణలో రకరకాల స్పటిక పుర్రెలు లభించాయి. మిచెట్ ప్రపంచానికి ఇచ్చిన పుర్రె కాకుండా మెక్సికో, మద్య అమెరికా, దక్షణ అమెరికాలలో రకరకాల క్రిస్టల్ స్కల్స్ లభ్యమయ్యాయి. వీటిల్లో అనేకం నకిలీలు పుట్టుకొచ్చాయి. తమను తాము ప్రచారం చేసుకోవడానికి వీటిలో కొన్నింటిని నకిలీలను పట్టుకొచ్చే నకిలీ పరిశోధకులు కూడా తయారయ్యారు. ప్రతి స్కల్ ను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే వాటిని మ్యూజియంలో భద్రపరిచేందుకు శాస్త్రవేత్తలు మొగ్గు చూపుతున్నారు.
క్రిస్టల్ స్కల్ ఇప్పుడొక హాట్ టాపిక్ గా మారింది. క్రిస్టల్ స్కల్ పేరు మీద ఎన్నో డాక్యుమెంటరీలు, సినిమాలు వచ్చాయి. తాజాగా కొన్ని వీడియో గేములు కూడా క్రిస్టల్ స్కల్ పేరుతో వస్తున్నాయి. ఒక క్రిస్టల్ స్కల్ తోనే దానికి అంత క్రేజ్ వచ్చిందనుకుంటే పొరపాటు. మద్య అమెరికా, దక్షణ అమెరికా, ప్రాంతాలలో ఇంకా చాలా రకాల క్రిస్టల్ స్కల్స్ లభించడంతో ఇవన్నీ ఒక చోట పెడితే ఏమవుతుందోనన్న ఆసక్తి ఉంది. మిచెల్లీ హెడ్జెస్ కనిపెట్టిన క్రిస్టల్ స్కల్ తరువాత 1900 సంవత్సరంలో మరో పుర్రె కనుగొన్నారు. కురువింద రూపంలో ఉన్న ఈ పుర్రెను గ్వాటిమాలా, మెక్సీకో ప్రాంతంతో కనుగొన్నారు. దీన్ని ఓ మాయన్ పూజారి కనుగొన్నాడు. దీన్ని అమెథిస్ట్ స్కల్ గా పిలిచారు. దీన్ని కూడా క్వార్ట్‌జ్ తో తయారు చేసినప్పటికీ పర్పుల్ క్వార్ట్‌జ్ కావడం వల్ల మిగతా స్కల్స్ తో నిర్మాణ సారూప్యం ఉన్నా చూడ్డానికి కొంత వైరుధ్యంగా ఉంటుంది. దీని తరువాత మాక్స్ గా పిలవబడే టెక్సాస్ క్రిస్టల్ స్కల్స్ కూడా చాలా ప్రాధాన్యం వచ్చింది. వీటి తరువా ఇ. టి స్కల్ దొరికింది. ఇది మిస్ట్ లా. .పొగకమ్మిన క్రిస్టల్ లా.. లేత కొబ్బరి రంగులో ఉంటుంది. గ్వాటిమాలా, హోండోరస్ పరిధుల్లో రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ స్కల్ లభించింది. తరువాత హ్యాండ్ కర్వ్డ్ బ్రెజిలియన్ క్రిస్టల్ స్కల్ లభించింది. అట్లాంటియన్ క్రిస్టల్ స్కల్ అని మరో నాలుగు రకాల స్కల్స్ దొరికాయి. ఈ స్కల్స్ మొత్తం యుగాంతం లో తమ ప్రభావం చూపుతాయనే కథ ప్రచారంలో ఉంది. అయితే ఇంకా కొన్ని స్కల్స్ దొరకాలని.. కొందరు పరిశోధకులు చెబుతున్నారు. నిజంగా యుగాంతమప్పుడే వీటి ప్రభావం చూపేవైతే ఇవి ఎక్కడున్నా నేల మాళిగల్లో ఉన్నా ఒక చోటకు చేరి ఒక విపత్తునుంచి భూమిని కాపాడగలవని కొందరు గ్రీకు పురాణ గాథలు వల్లిస్తున్నారు. అలా మహా విపత్తు నుంచి భూమిని కాపాడేందుకే భులోకేతర శక్తులు వీటిని మన పూర్వికులకు బహుమతిగా ఇచ్చి ఉంటారనే పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది.
పాశ్చాత్య దేశాల్లో వినిపిస్తున్న కథనాలను బట్టి.. లాటిస్ అమెరికా, మద్య అమెరికా పౌరులతో మాయన్ లు కలిసిమెలిసి ఉండేవారని వినికిడి.. అయితే మాయన్ లకు భూలోకేతర శక్తులతో సంబంధాలున్నాయని కూడా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నవి. ఎందుకంటే ప్రపంచ నాగరికథల్లో మాయన్ల నాగరికత భిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా ప్రకృతి శక్తులతోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తయారు చేయగల సత్తా వారికే సొంతం. అంతే కాకుండా.. పర్యావరణ కాలుష్య రహిత సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించడంలో మాయన్ లు దిట్ట. అయితే వీరికి ఈ పరిజ్ఞానం పంచిపెట్టింది ఏలియన్స్ అనే అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. దీంతో బాటు అంతరించిపోయిన నాగరికతగా పిలవబడే.. అట్లాంటిస్ నాగరికుల ప్రోత్సాహంతోనైనా వీరు ఈ సాంకేతిక పరిజ్ఞానం సొంతమయిందనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనప్పటకీ.. క్రిస్టల్ స్కల్స్ ఓ మిస్టరీ గానే మిగిలిపోయాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికే సవాలుగా మిగిలిన క్రిస్టల్ స్కల్స్ గురించి త్వరలోనే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. ఈ పరిశోధనల్లో కొత్త విషయాలు తెలిస్తే రానున్న రోజుల్లో నానో టెక్నాలజికి మరింత ఉపయోగపడుతుందని ఆశిద్దాం.

Saturday, September 17, 2011

'ఆ చల్లని సముద్రగర్భం/దాచినబడబానల మెంతో?

జనం పిలుపులోని ఈ ''అభ్యుదయగీతం'' 1977 ముద్రణలో ప్రచురించబడిన ఖండికలలో కొంత మార్పులతో పాడుకోవడం జరుగుతున్నది. 1977 ముద్రణకు జనం పాడుకోవడానికి గల భేదము క్రింది విధంగా వుంది: 1977 ముద్రణలోని తొలి ఖండిక పల్లవిగా పాడుతున్నప్పటికి తొలి ఖండికలోని ''ఆ చల్లని... బడబానల మెంతో?'' యథాతథంగా పాడుతూ ''ఆ నల్లని.... భానువులెందరో?''లోని ''భానువులెందరో?''కు బదులుగా ''భాస్కరు లెందరో?'' అని పాడు కోవడం కనిపిస్తుంది.రెండవ ఖండికలో ''భూగోళం... కూలిన సురగోళాలెన్నో?''లోని ''కూలిన''కు బదులుగా ''రాలిన'' అని మార్చిపాడుతూ, ఇక ''ఈ మానవ... పరిణామాలెన్నో?'' యథాతథంగా పాడుకోవడం కనిపిస్తున్నది.
డాక్టర్‌ దాశరథి కృష్ణమాచార్యులు ''అగ్నిధార'' మలిముద్రణ (1963)లో ''పురాస్మృతులు'' పేరుతో రాయబడిన కృతజ్ఞతా వాక్కులలో ''నా అచ్చైన పుస్తకాలలో మొట్టమొదటిది అగ్నిధార సాహితీమేఖల 1949లో అచ్చైంది'' (దాశరథి కవిత 1.11.1977 ముద్రణలో పురాస్మృతులు, 1వ పేజీ) అని చెప్పుకొన్నారు. అయితే నేడు తొలి ముద్రణ అగ్నిధార ప్రతి లభించడం లేదు. కాని-
1954 జూలై 19 ''కృష్ణాపత్రిక'' సంచిక (10 వ పేజీ)లో పరిచయం శీర్షిక కింద ''మన తెలంగాణా కవిమిత్రులు-దాశరథి'' అనే వ్యాసంలో బి. రామరాజుగారు ''దాశరథి ప్రతి రచనా సజీవమైనది. అతని కఠిన ముఖాంతరమున విశాల నీరదానీకము వచ్చి దాగి దయనీయముగా విలపించగా అసంఖ్యాకముగా ఖటికాలు తస్ఫుట పద్య జాలములు వాకలు వాకలై గుండెలు పొంగిపోవగా అలుగులు వారును. అట్టి అలుగును బంధించి తెచ్చి మీకు చూపించడానికి నాకు శక్తి చాలుతుందా? ఈ పృచ్ఛాగీతం చూడండి'' అంటూ ఈ కింది పృచ్ఛాగీతాన్ని ఉటంకించారు:
''ఆ చల్లని సముద్రగర్భం దాచిన/ బడబానలమెంతో?/ ఆ నల్లని ఆకాశంలో కానరాని/భానువు లెందరో?/ భూగోళం పుట్టుకకోసం కూలిన/ సురగోళా లెన్నో?/ నరమానవ రూపంకోసం జరిగిన/ పరిణామాలెన్నో?/ ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన/నరకంఠాలెన్నో?/ శ్రమజీవుల పచ్చినెత్తురులు త్రాగని/ ధనవంతులెందరో?/ అణగారిన అగ్నిపర్వతం కనిపెంచిన/ ''లావా'' ఎంతో?/ ఆకలితో చచ్చేపేదల శోకంలో/ కోపం ఎంతో?/ పసిపాపల నిదుర కనులలో ముసిరిన/ భ'వితవ్యం ఎంతో?
గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని/ కావ్యాలెన్నో?''
ఈ పృచ్ఛాగీతం పై రూపంలో (లైన్స్‌తో సహా) ఉటంకించబడింది. (మలిముద్రణ అలభ్యం).
అయితే, దాశరథిగారి ''దాశరథి కవిత'' ముద్రణ (1.11.1977)లో పేరు పెట్టుబడని ఓ గీతం (102, 103 పేజీలలో.) దానికి పేరుకు బదులుగా ప్రశ్నార్థకం (?) ఉన్నది. ఆ గీతం పైనచూపినట్లు రెండు రెండు పాదాలుగా కాక నాలుగు పాదాలుగల ఖండికలుగా ఈ క్రింది రూపంలో వుంది:
1. ''ఆ చల్లని సముద్ర గర్భం/దాచిన బడబానలమెంతో?
ఆ నల్లని ఆకాశంలో/కానరాని భానువులెందరో?
2. భూగోళం పుట్టుక కోసం/ కూలిన సురగోళాలెన్నో?
ఈ మానవ రూపంకోసం/ జరిగిన పరిణామాలెన్నో?
3. ఒక రాజును గెలిపించుటలో/ఒరిగిన నరకంరవాలెన్నో?
శ్రమజీవుల పచ్చినెత్తురులు/త్రాగని ధనవంతులెందరో?
4. అన్నార్తులు అనాధలుండని/ఆ నవయుగ మదెంత దూరమో?
కరవంటు కాటకమంటూ/కనిపించని కాలాలెప్పుడో?
5. అణగారిన అగ్నిపర్వతం/కనిపించిన ''లావా'' ఎంతో?
ఆకలితో చచ్చే పేదలు/శోకంలో కోపం ఎంతో?
6. పసిపాపల నిదుర కనులలో/ముసిరిన భవితవ్యం ఎంతో?
గాయపడిన కవి గుండెల్లో/రాయబడిన కావ్యాలెన్నో?
7. కులమతముల సుడిగుండాలకు/బలికాని పవిత్రులెందరో?
భారతావని బల పరాక్రమం/చెర వీడేదింకెన్నాళ్ళకో?''
అను ఈ ఏడు ఖండికలు వున్నాయి. అయితే, బి. రామరాజుగారు ఉటంకించిన గీతంలో కంటే ''దాశరథి కవిత'' (1977) ముద్రణలో ఎక్కువ ఖండికలు వున్నాయి. అవి 1977 ముద్రణలోని నాలుగవ ఖండిక ''అన్నార్తులు... మదెంత దూరమో/కరవంటూ.... కాలాలెప్పుడో?'' అలాగే ఏడవ ఖండిక ''కులమతముల... పవిత్రు లెందరో?/భారతావని... దింకెన్నా ళ్ళకో?'' పూర్తిగా నూతనమైనవి. ఈ నాలుగు పాదాలుగల రెండు ఖండికలు తొలి, మలి ముద్రణలో ఉండి ఉండకపోవచ్చు. తొలి ముద్రణలో ఉండివుంటే బి. రామరాజుగారు వదిలి వుండేవారు కాకపోవచ్చు. అయితే, మరో అనుమానం కూడా కలుగవచ్చు. అదేమిటంటే, ఈ పేరులేని గీతం తొలి ముద్రణలో ఉండి ఉండకపోవచ్చునేమో అని. కాని, అలాంటి అవకాశం లేనేలేదు. ఎందుకంటే, దాశరథిగారు మలిముద్రణలో ''పురాస్మృతులు''లో ''ఈ అగ్నిధారలో అన్ని ఖండికలు చాలావరకు నా జైలు జీవితంలోను, జైలునుంచి వెలువడిన కొత్తలోను రాసినవి'' అని చెప్పివున్నారు. దాశరథిగారిని 1948లో వరంగల్‌ జైలు నుండి నిజామాబాద్‌ జైలులోకి మార్చారు. తరువాత హైదరాబాద్‌ (చంచల్గూడా) జైలుకి మార్చారు. అయితే, అగ్నిధార 1949/ఆగస్టు నెలలో ముద్రించారు. పైవిషయాలనుబట్టి ''పృచ్ఛాగీతం'' (?) జైలులో వుండగానో, జైలు నుండి విడుదలైన తరువాతనో వ్రాయబడి తొలి ముద్రణలో చేరివున్నట్లుగానే చెప్పవచ్చును. ఇక ఖండికలోని మార్పులు పరిశీలించినట్లయితే, బి. రామరాజుగారి వ్యాసంలో ''నరమానవ రూపం... పరిణామాలెన్నో?'' అన్న ఖండిక ఉటంకించగా, 1977 ముద్రణ రెండవ ఖండికలో ''ఈ మానవ రూపం... పరిణామాలెన్నో?'' అని వుంది. నాలుగవ ఖండికగా-
''అన్నార్తులు అనాధలుండని/ఆ నవయుగ మదెంత దూరమో? కరవంటు కాటకమంటూ/కనుపించని కాలాలెప్పుడో?''ను చేర్చడం కనిపిస్తున్నది. అంతేకాక, ఏడవ ఖండికగా-
''కులమతముల సుడిగుండాలకు/బలిగాని పవిత్రులెందరో?
భారతావని బలపరాక్రమం/చెర వీడేదింకెన్నాళ్ళకో?''ను కూడా కొత్తగా చేర్చినట్లు విశదమవుతుంది. అయితే, పై విషయాల మార్పులనుబట్టి తొలిముద్రణలోని పృచ్ఛాగీతం (?) మార్చబడి ఉండవచ్చును. (సరిపోల్చడానికి, తొలి- మలి ముద్రణ ''అగ్నిధార'' ప్రతులు అలభ్యం.) ఈ పృచ్ఛాగీతం (?) జనవ్యవహారంలో ''అభ్యుదయగీతం'' పేరుతో (ఏడు ఖండికలు) పిలవబడుచున్నది. జనం నాలుకలపై, గాయకుల గొంతులలో ఓలలాడుతున్నది. అయితే, ఈ ఏడు ఖండికలలో తొలి ఖండికను పల్లవిగాను, మిగతా ఆరు ఖండికలను చరణాలుగాను పాడుకోవడం జరుగుతున్నది.
జనం పిలుపులోని ఈ ''అభ్యుదయగీతం'' 1977 ముద్రణలో ప్రచురించబడిన ఖండికలలో కొంత మార్పులతో పాడుకోవడం జరుగుతున్నది. 1977 ముద్రణకు జనం పాడుకోవడానికి గల భేదము క్రింది విధంగా వుంది: 1977 ముద్రణలోని తొలి ఖండిక పల్లవిగా పాడుతున్నప్పటికి తొలి ఖండికలోని ''ఆ చల్లని... బడబానల మెంతో?'' యథాతథంగా పాడుతూ ''ఆ నల్లని.... భానువులెందరో?''లోని ''భానువులెందరో?''కు బదులుగా ''భాస్కరు లెందరో?'' అని పాడు కోవడం కనిపిస్తుంది.
రెండవ ఖండికలో ''భూగోళం... కూలిన సురగోళాలెన్నో?''లోని ''కూలిన''కు బదులుగా ''రాలిన'' అని మార్చిపాడుతూ, ఇక ''ఈ మానవ... పరిణామాలెన్నో?'' యథాతథంగా పాడుకోవడం కనిపిస్తున్నది.
మూడవ ఖండికలో ''ఒక రాజును.. కంఠాలెన్నో?''ను యథాతథంగా పాడుతూ, ''శ్రమజీవుల పచ్చినెత్తురులు త్రాగని ధనవంతులెందరో?''ను పూర్తిగా పరిహరించి, 1977 ముద్రణలోని ఏడవ ఖండికలోని తొలి రెండు పాదాలైన ''కులమతముల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో?''ను స్వీకరించారు. అంతేకాక, 1977 ముద్రణలోని ఏడవ ఖండికలోని చివరి రెండు పాదాలైన ''భారతావని బలపరాక్రమం చెరవీడేదింకెన్నాళ్ళకో?''ను గీతం నుండి పూర్తిగా పరిహరించారు.
నాలుగవ ఖండికగా 1977 ముద్రణలోని నాలుగవ ఖండికను పరిహరించి, జనవ్యవహారంలో నాలుగవ ఖండికగా-
''మానవ కళ్యాణం కోసం/ పణం ఒడ్డిన రక్తం ఎంతో?/ రణరక్కసి కరాళనృత్యం/ రాల్చిన పసి ప్రాణాలెన్నో?''/ అను కొత్త ఖండికను పాడుకోవడం కనిపిస్తుంది./ అయిదవ ఖండికగా 1977 ముద్రణలోని ఐదవ ఖండికను పూర్తిగా గీతం నుండి పరిహరించి, ఈ కింది ఖండిక పాడబడుచున్నది:/''కడుపు కోతతో అల్లాడిన/కన్నులలో విషాదమెంతో?/ఉన్మాదుల ఆకృత్యాలకు / దగ్ధమైన బ్రతుకులు ఎన్నో?''
అను ఈ నూతన ఖండికను స్వీకరించారు. అయితే, నాలుగవ, ఐదవ ఖండికలను ఎవరు ఎప్పుడు చేర్చారో ఇదమిద్ధంగా ఆధారాలు లభించడంలేదు. (అయితే, 1998-99లో వరంగల్‌ ఆర్‌ఇసిలో రామాయణంపై సదస్సు జరిగిన సందర్భంగా దాశరథి రంగాచార్యుల వారిని ''పృచ్ఛాగీతంలో (జనవ్యవహారంలో అభ్యుదయగీతం) చేర్చబడిన నూతన ఖండికలను దాశరథి కృష్ణమాచారిగారే 1977 ముద్రణ తరువాత చేర్చారా?'' అని అడుగ్గా, ''చేర్చివుండవచ్చును, గుర్తులేదు'' అన్నారు.)
ఆరవ ఖండికగా 1977 ముద్రణలోని ఆరవ ఖండిక పరిహరించబడి, 1977 ముద్రణలోని నాలుగవ ఖండిక పాడుకొనబడుచున్నది. వరగా ఏడవ ఖండిక. 1977 లోని ఏడవ ఖండికలోని తొలి రెండు పాదాలు, మూడవ ఖండికలో చివరి రెండు పాదాలుగా కనిపిస్తాయి. కాని, 7 వ ఖండికలోని చివరి రెండు పాదాలు మాత్రం గతం నుండి పరిహరించబడినవి. ఇక 7 వ ఖండికగా 1977 ముద్రణలోని 6 వ ఖండిక పాడుకొనబడుచున్నాయి.
పైన చెప్పుకొన్నటువంటి మార్పుల చేర్పులతో వున్న పృచ్ఛాగీతం. అగ్నిధార తొలి ముద్రణ అనంతరం 'కృష్ణాపత్రిక'లో పరిచయం శీర్షిక కింద ''మన తెలంగాణా కవిమిత్రులు - దాశరథి'' పేర బి. రామరాజుగారి వ్యాసంలో పది పాదాలుగాను, 1977వ ముద్రణలో ఏడు ఖండికలుగాను అగుపిస్తున్నది. అయితే, మలి ముద్రణలోని గీతమే 1.11.1977లో ముద్రితమైన ''దాశరథి కవిత''లో యధాతథంగా ముద్రితమైవుండవచ్చు. అందులో అగుపిస్తున్న ఏడు ఖండికలు జన వ్యవహారంలో కూడా ఏడు ఖండికలుగానే వున్నప్పటికీ మార్పుల అనంతరం ఈ పృచ్ఛాగీతం కింది రూపాన్ని సంతరించుకొన్నది:
1. ''ఆ చల్లని సముద్రగర్భం/దాచినబడబానల మెంతో?
ఆ నల్లని ఆకాశంలో/కానరాని భాస్కరులెందరో?
2. భూగోళం పుటుyక కోసం/రాలిన సురగోళాలెన్నో?
ఈ మానవ రూపంకోసం/జరిగిన పరిణామాలెన్నో?
3. ఒక రాజును గెలిపించుటలో/ఒరిగిన నరకంఠాలెన్నో?
కులమతాల సుడిగుండాలకు/బలికాని పవిత్రులెందరో?
4. మానవ కళ్యాణం కోసం/పణం ఒడ్డిన రక్తం ఎంతో?
రణరక్కసి కరాళనృత్యం/రాల్చిన పసిప్రాణాలెన్నో?
5. కడుపుకోతతో అల్లాడిన/కన్నులలో విషాదమెంతో?
ఉన్మాదుల అకృత్యాలకు/దగ్ధమైన బ్రతుకులు ఎన్నో?
6. అన్నార్తులు అనాధలుండని/ఆ నవయుగమదెంత దూరమో?
కరవంటు కాటకమంటూ/కనిపించని కాలాలెపుడో?
7. పసిపాపల నిదుర కన్నులలో/ముసిరిన భవితవ్యం ఎంతో?
గాయపడిన కవి గుండెలలో/వ్రాయబడని కావ్యాలెన్నో?''
ఈ విధంగా జనంతో మమేకమైన ఈ గీతాన్ని సినీనటుడు, దర్శకుడు అయిన భానుచందర్‌గారు ''కామ్రేడ్‌'' అనే సినిమాలో (1995-96), జె.వి రాఘవులుగారి సంగీత సారథ్యంలో ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం గారిచే పాడించి, సెల్యూలాయిడ్‌ పైకి తీసుకొచ్చారు.
ఈ విధంగా సినిమాలోకి స్వీకరించబడిన ఈ గీతం జన వ్యవహారంలోని నాలుగవ ఖండికలో ''మానవ కళ్యాణం కోసం/పణం ఒడ్డిన రక్తం ఎంతో?''లోని ''పణం ఒడ్డిన''కు బదులుగా సినిమా పాటలోని రెండవ చరణంలో ''పణమొడ్డిన'' అని మార్చటం జరిగింది. అదే విధంగా జన వ్యవహారంలోని చివరి ఖండికలోని ''గాయపడిన కవి గుండెల్లో/వ్రాయబడని కావ్యాలెన్నో?'' లోని ''వ్రాయబడని''కి బదులుగా ''వ్రాయబడిన'' అన్న సవరణ కనిపిస్తుంది
దాశరథి కవి సంకలనంలో వచ్చి, జనం గుండెల్లో మారుమ్రోగుతూ, తదనంతరం సినిమారంగం చేత ఆకర్షించబడి, అక్కడా తన సత్తా నిరూపించుకొని నిలబడి ఎన్నో వసంతాలు పూర్తి చేసుకొని ఇప్పటికీ నేనున్నానంటున్న ఈ గీతం బి. రామరాజు గారన్నట్లు నాడు ''పృచ్ఛాగీతం'', నేడు ''అభ్యుదయగీతం.'' అయితే, శ్రీమతి విజయభారతిగారు వెలుగు పాటల సంకలనంలో ఐదవ ఖండికలో మూడవ పాదం ''ఉన్మాదుల అకృత్యాలకు'' పరిహరించి, కొత్తగా ''ధనవంతుల దుర్మార్గాలకు''అని కొత్త పాదం స్వీకరించడం కనిపిస్తున్నది. ఇంకా ఎన్ని మార్పులకు నోచుకోనుందో?

Thursday, September 8, 2011

గాలికి జైల్లో ఏ.సి గాలి...


బయటి ప్రపంచంలో రాజభోగాలు అనుభవించిన వారెవరైనా జైలుకెళితే చిప్పకూడు తినాల్సిందే అనుకుంటాం... అది రాజైనా రామలింగ రాజైనా... కారాగారంలో పడ్డారంటే కారంలేని పప్పుకూడు.. చాప నిద్ర తప్పదంటారు.. కానీ చంచల్ గూడ జైల్లో బెయిల్ కోసం ఎదురు చూస్తున్న రామలింగరాజు గానీ... తాజాగా చంచల్ గూడ జైలుకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి కూడా ఇవే కష్టాలు పడుతున్నాడా.. బంగారు పళ్లెంలో పంచభక్ష్య పరమాన్నం తిన్న వ్యక్తి ఉప్పుకారం లేని చిప్పకూడు తింటున్నాడంటే నమ్మాలా.. సాధారణ ఖైదీలాగే చూస్తున్నామంటున్న జైలు అధికారుల మాటల్లో నిజమెంత.. హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ..
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం మనది.. పౌర హక్కులు.. చట్టాలు.. ఆదేశిక సూత్రాలు అందరికీ సమానమని చదువుకున్నాం.. కానీ దేశ సంపదను దోచుకున్న నేరగాళ్లకోచట్టం.. జేబుదొంగలకో చట్టం అని రుజువు చేస్తున్నారు మన అధికారులు.. కోటాను కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి ఇటు ప్రజలకు అటు ప్రభుత్వాన్ని మోసం చేసిన ఘనాపాటీలు జైల్లో కూడా రాజభోగాలు అనుభవిస్తున్నారు.
బళ్లారి గనుల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన గాలి జనార్దన్ రెడ్డిని ఒక సాధారణ ఖైదీగానే చూస్తున్నామంటున్న అధికారుల మాటలు నమ్మశక్యంగా లేవనిపిస్తోంది. ఎందుకంటే
గాలి జనార్దన్ రెడ్డి, సామాన్య కుటుంబంలో పుట్టినా కాలం కలిసి రావడంతో బంగారు జరీ పట్టుపంచె, స్వర్ణ సింహాసనం, పుష్పక విమానాల్లాంటి కార్లు, హెలికాప్టర్లు, హంసతూలికా తల్పం లేనిదే కునుకు తీయడు. రాయల విలాసాలకు ఏమాత్రం తీసిపోని ఈ రాయలసీమ వాసి సాధారణ ఖైదీలా జీవితం గడపడమంటే .. స్వర్గంలోంచి అమాంతంగా నరకంలోకి దూకడంమే.. ఒకవేళ కలిసిరాని కాలం.. విధి చేతిలో వింత నాటకమంటూ గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ వచ్చే వరకు కళ్లుమూసుకుందామనుకున్నా జైలు అధికారులు ఊరుకోరు. గాలి జనార్దన్ రెడ్డి లాంటి బంగారు బాతు దొరికాక సేవలు చేసుకొని కటాక్షం పొందకుంటే అంతకుమించిన దురదృష్టమేముంటుందని వారి బాధ.. మామూలుగా జైలుకొచ్చే విచారణ ఖైదీల జేబులు లూఠీ చేస్తారనే అవవాదు ఎలాగూ ఉంది.. సగం సిగరెట్ డబ్బాల నుంచి డిపాడిట్ డబ్బుల వరకూ వసూలు చేసిన సందర్భాలు కోకొల్లలు.. అటువంటిది విఐపి ఖైదీలు జైలు గుమ్మం తొక్కారంటే అధికారుల హడావుడి అంతా ఇంత కాదు.
జైలు నిబంధనల ప్రకారం ఆరు దాటితే ఖైదీలు బ్యారక్ దాటకూడదు. ఆరు గంటలకే ఖైదీలందరినీ బ్యారక్ లలోకి పంపి తాళాలేస్తారు. అత్యవసరమైతే తప్ప తాళాలు తీయరు. మామూలు సమయంలో ఖైదీల ములాకత్‌కు వచ్చేవారు నిర్దేశించిన ప్రాంతంలోనే కలుస్తారు. బంధువులు ఇంట్లో తయారుచేసి తెచ్చే తినుబండారాలను అనుమతించరు. కేవలం పండ్లు, కవర్ చేసిన ప్యాకెట్ లను మాత్రమే అనుమతిస్తారు. ముఖ్యంగా కమ్యునికేషన్ సాధనలేవీ ఖైదీలకు అందుబాటులో ఉండవు.. బయటి ప్రపంచం గురించి తెలియాలంటే న్యూస్ పేపర్, కంబైన్డ్ టి.వి ... కానీ ఈ కండిషన్లన్నీ సాధారణ ఖైదీలకు మాత్రమే.. దేశ సంపదను దోచుకున్న వారికి.. ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన వారికి మాత్రం కాదని తెలుస్తోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం సత్యం కుంభకోణంలో జైలుకెళ్లిన రామలింగరాజును కూడా సాధారణ ఖైదీలాగా చూస్తున్నామని అప్పట్లో అధికారులు ప్రకటనలు గుప్పించారు.. కానీ జైలు గోడల మద్య జరుగుతున్న తంతు వేరని సమాచారం.. ప్రజాధనం దోచుకున్న కృషిబ్యాంక్ వెంకటేశ్వర్ రావు కూడా జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడని సమాచారం.. సత్యం రామలింగరాజు గానీ.. కృషి బ్యాంక్ వెంకటేశ్వర్ రావు గానీ.. ఎక్కువ సమయం జైలు సూపరింటెండెంట్ ఏ.సి గదిలోనే గడుపుతున్నట్టు సమాచారం.. ఎవరైనా బంధువులను కలవాలంటే.. సూపరింటెండెంట్ రూంలోకే పిలిపించుకొని మాట్లాడుతారని వినికిడి.. ఆఫీసుకు వచ్చినట్టే ఇంటి వద్ద వండిన ఆహారం వస్తుందని జైలు వర్గాలు బాహాటంగానే చెప్పుకుంటున్నాయి. ఇక వీరి చేతికి అలవాటు పడ్డ మొబైల్ ఫోన్ మోగని ఘడియంటూ ఉండదు. ఇప్పటి వరకు ఈ విఐపి ఖైదీలకు గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సహచరుడు శ్రీనివాస్ తోడయ్యారు... ఈ విఐపి విచారణ ఖైదీల కోసం సూపరింటెండెంట్ రూం కాస్తా ఏ.సి బ్యారక్ గా మారిందని చెప్పొచ్చు.
బ్యాంగ్

Wednesday, September 7, 2011

ఢిల్లీలో ఇప్పటి వరకు జరిగిన పేలుళ్లు ఇవే..


దేశ రాజధాని బాంబు పేలుళ్లతో వణికి పోతోంది.. గత రెండు దశాబ్దాలుగా సుమారు 20కి పైగా పేలుళ్లు జరిగాయి.. ఈ పేలుళ్లలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.. సుమారు రెండు వేల మందికి పైగా క్షతగాత్రులయి.. శాశ్వత వికలాంగులుగా మారారు... ఉగ్రవాదులు అమర్చే బాంబు పేలుళ్లలో సామాన్యులే సమిధలవుతున్నారు.. ఇప్పటి వరకు ఢిల్లీలో జరిగిన బాంబ్ పేలుళ్ల పై స్పెషల్ స్టోరీ.
దేశ రాజధాని ఢిల్లీ.. దేశ రాజకీయాలన్నీ ఇక్కడే కేంద్రీకృతమయి ఉంటాయి.. అందుకే ఉగ్రవాదుల కళ్లన్నీ రాజధాని పైనే.. ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాలంటే ఎక్కడో ఒక చోట బాంబులు పెట్టి ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకుంటారు. గత రెండు దశాబ్దాల కాలంలో ఢిల్లీ లో పేలిన బాంబుల చరిత్ర చూద్దాం..
1993 సంవత్సరం మార్చి 12 న జరిగిన పేలుళ్లలో 257 మంది చనిపోగా 1400 మంది గాయపడ్డారు..
1997లోనే.. 7 సార్లు పేలుళ్లు జరిగాయి..
1997 జనవరి 9న ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు జరిగిన పేలుళ్లలో50 మంది గాయాల పాలయ్యారు.
అక్టోబర్ 1న సర్దార్ బజార్ ప్రాంతంలో జరిగిన పేలుళ్లలో 30 మంది గాయపడ్డారు.
అక్టోబర్ 10 న శాంతి వనం, కౌరియాపూల్, కింగ్స్ వే క్యాంప్ లలో జరిగిన వరస పేలుళ్లలో ఒకరు చనిపోగా 16 మంది గాయపడ్డారు.
అక్టోబర్ 18న రాణీబాగ్ లో జరిగిన బాంబు పేలుళ్లలో ఒకరు ప్రాణాలు కోల్పోగా 23 మంది గాయపడ్డారు.
నవంబర్ 30న ఎర్రకోట వద్ద జరిగిన జంట పేలుళ్లలో ముగ్గురుచనిపోగా 70 మంది గాయపడ్డారు.
డిసెంబర్ 30న పంజాబీ బాగ్ వద్ద బస్సులో జరిగిన పేలుళ్లలో నలుగురు చనిపోగా 30 మంది గాయపడ్డారు.
ఆ తరువాత తిరిగి 1998లో జూలై 26న కాశ్మీర్ గేటు వద్ద నిలిపిన అంతర్జాతీయ బస్సులో జరిగిన పేలుడులో ఇద్దరు చనిపోగా ముగ్గురు గాయపడ్డారు
2000 సంవత్సరం జూన్ 18 న ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో ఎనిమిదేళ్ల బాలిక తో బాటు మరొకరు ప్రాణాలు కోల్పోగా... డజన్ మంది గాయపడ్డారు.
2001 అక్టోబర్ 1న జరిగిన పేలుళ్లలో 35 మంది చనిపోయారు..
మళ్లీ రెండు నెలల తరువాత పార్లమెంట్ పై జరిగిన దాడిలో ఐదుగురు గన్ మెన్ లతో సహా 12 మంది చనిపోయారు.
మే 14న ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో పిల్లలు పెద్దలూ అంతా కలిపి సుమారు 30 మంది చనిపోయారు..
2005, మే 22 న రెండు సినిమా హాళ్లలో జరిగిన జంట పేలుళ్లలో ఒకరు ప్రాణాలు కోల్పోగా 60 మంది తీవ్రంగా గాయపడ్డారు
2005 సంవత్సరంలో అక్టోబర్ నెలలో దీపావళికి ముందు ఢిల్లీ మార్కెట్ లో జరిగిన పేలుళ్లలో 62 మంది చనిపోయారు.. వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు.
2006 లో ఏప్రియల్ 14 న పాత ఢిల్లీలో జామా మసీద్ ప్రాంగణంలో జరిగిన పేలుళ్లలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
2008 సంవత్సరంలో సెప్టెంబర్ 13 న జరిగిన సీరియల‌్ బాంబు పేలుళ్లలో 25 మంది చనిపోగా 100మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో 14 రోజుల తరువాత మెహ్రౌలీ ఫ్లవర్ మార్కెట్ లో జరిగిన పేలుళ్లలో ఒకరు ప్రాణాలు కోల్పోగా 23 మంది గాయాలపాలయ్యారు. అదే నెలలో 27న మెహ్రాలీ మార్కెట్ లో జరిగిన పేలుళ్లలో ముగ్గురు చనిపోగా 21 మంది గాయపడ్డారు.
2011 మే 25 న హైకోర్టు పార్కింగ్ స్థలంలో పాలిథీన్ కవర్ లో బాంబ్ పెల్చారు. అయితే ఈ పేలుళ్లలో ప్రాణ నష్టం జరుగలేదు.
తాజాగా ఈ రోజు (సెప్టెంబర్ 7,2011) జరిగిన బాంబు పేలుళ్లో 9 మంది చనిపోగా 45 మందికి పైగా గాయపడ్డారు.
ఉగ్రవాదులు సృష్టించే మారణ హోమంలో సామాన్య మానవులే సమిధలవుతున్నారు... ఉగ్రవాదుల లక్ష్యాల కోసమో.. ఉనికి కోసమో సామాన్య పౌరులు ప్రాణాలు ఫణంగా పెట్టాల్సి వస్తోంది.




హర్కత్ ఉల్ జీహాద్ అల్ ఇస్లామీ... (హుజీ) రక్త చరిత్ర



పట్టపగలు ఢిల్లీ హైకోర్టు వద్ద కారు బాంబును పేల్చింది తమ సంస్థ సభ్యులేనని హర్కత్‌ ఉల్‌ జిహాద్‌ అల్‌ ఇస్లామీ (హుజీ) సంస్థ దేశంలోని పత్రికలు, న్యూస్‌ చానల్స్‌ కార్యాలయాలకు ఫ్యాక్స్‌లో పంపిన లేఖలో ప్రకటించింది.పాకిస్తాన్‌ కి చెందిన ఈ సంస్థ సభ్యులు బంగ్లాదేశ్‌ ద్వారా మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సంస్థకు మన దేశంలోని అన్ని నగరాల్లో స్లీపర్‌ సెల్స్‌ ఉన్నాయి. స్థానికులు ఇచ్చే ఆశ్రయం, అందించే సహాయ సహకారాలోతేనే ఈ సంస్థ తన కార్యకలాపాలను నిరాటంకంగా సాగిస్తోంది. హుజీ ఎప్పుడు పుట్టిందో ఖచ్చితమైన సమాచారం ఏదీ లేకపోయినప్పటికీ, సోవియట్‌ ఆఫ్ఘన్‌ యుద్ధ సమయంలో ఈ సంస్థ ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థకు ఖ్వాజీ సైఫుల్లా అఖ్తర్‌, ఆయన అనుచరులు మౌలానా ఇర్షాద్‌ అహ్మద్‌,మౌలానా అబ్దుస్‌ సమద్‌ సియాల్‌లు పునాదులు వేశారు.వీరంతా పాక్‌లోని కరాచీకి చెందిన వారు. అప్పట్లో ఈ సంస్థను జామియాత్‌ అన్సరుల్‌ ఆఫ్ఘనీన్‌ అనే పేరుతో పిలిచేవారు. ఆఫ్ఘన్‌ యుద్ధానంతరం అది హుజీగా పేరు మార్చుకుంది.భారత్‌లోని జమ్ము కాశ్మీర్‌ లోని ముస్లింలు జరిపే పవిత్ర యుద్ధానికి (జిహాద్‌కి) మద్దతు ఇవ్వడం ప్రధాన లక్ష్యంగా ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
1989లో ఆఫ్ఘన్‌ నుంచి సోవియట్‌ దళాలు ఉపసంహరణ తరువాత పాకిస్తాన్‌కే చెందిన మరో ఉగ్రవాద సంస్థ హర్కత్‌ ఉల్‌ ముజాహిద్దీన్‌తో కలిసి కార్యకలాపాలను ముమ్మరం చేసింది. జమ్ము,కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేందుకు హర్కత్‌ ఉల్‌ అన్సార్‌ అనే సంస్థను ఇవి ప్రారంభించాయి. ఈ సంస్థను 1997లోనే అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.కొన్ని ప్రాంతాల్లో ఈ సంస్థ హర్కత్‌ ఉల్‌ ముజాహిద్దీన్‌ పేరిట పని చేస్తూ వచ్చింది. బంగ్లాదేశ్‌ కేంద్రంగా హుజీ-బి ఏర్పడింది. హుజీ సంస్థ ఇస్లాంలో దేవబంద్‌ ఆలోచనా విధానానికి చెందిన తీవ్ర వాద సంస్థ. ఇస్లాం ధర్మ పరిరక్షణ కోసం పవిత్ర యుద్ధం సాగించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ నుంచి ఈ సంస్థ సభ్యులు ఉత్తేజాన్ని పొంది తమ కార్యకలాపాలను విస్తృతం చేశారు. భారత్‌లో హుజీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా నిమితులైన బషీర్‌ అహ్మద్‌ మీర్‌ 2008 జనవరి 25వ తేదీన జమ్ము కాశ్మీర్‌లోన దోడా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.అంతకుముందు సంవత్సరం అతడు ఉత్తర, ఆగ్నేయ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులకు పిలుపు ఇచ్చాడు. పర్యవసానంగానే రాజస్థాన్‌లోని ఆజ్మీర్‌ షరీఫ్‌పైనా,ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ బాంబు దాడులు జరిగాయి. అలాగే,హుజీ సంస్థకు చందిన షాహిద్‌ బిలాల్‌ అనే పాక్‌ జాతీయుడు కూడా భారత్‌లో పెక్కు దాడులను పురికొల్పాడు.2007 ఆగస్టు 30వ తేదీన కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడు.అయితే, అతడు బతికే ఉన్నాడానీ, కరాచీ, ఢాకాల మధ్య తిరుగుతూ హుజీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. హైదరాబాద్‌కి చెందిన బిలాల్‌ 2002లో బంగ్లాదేశ్‌కి పారిపోయాడు. హైదరాబాద్‌కి చెందిన అనేక మంది యువకులను అతడు తమ సంస్థలో చేర్పించాడు.మక్కా మసీదు పేలుళ్ళకేసులో అతడి పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందిత. అతడు 2002-03లో సౌదీ అరేబియా వెళ్ళి అక్కడ శిక్షణ పొందాడు.హైదరాబాద్‌లోని మూసారాం బాగ్‌కి చెందిన బిలాల్‌ 2005లో హైదరాబాద్‌ తిరిగి వచ్చాడు. గుజరాత్‌ హోం మంత్రి హరేన్‌ పాండ్య హత్యకేసులో నిందితులతో అతడికి సంబంధాలు ఉన్నాయి. అలాగే, ఈ సంస్థకు చెందిన ఇతర నాయకులకు భారత్‌లోని వివిధ నగరాల్లో ఆశ్రయం ఇచ్చే వారు ఉన్నారు. స్థానిక యువకులకు మంచి ఆదాయం ఆశ జూపి హుజీ సంస్థలోకి రిక్రూట్‌ చేయించడం వీరి కార్యకలాపాల్లో ముఖ్యమైనది.
20 దేశాలకు విస్తరణ
హుజీ సంస్థ కార్యకలాపాలు 20 పైగా దేశాలకు విస్తరించాయి. 2005లోనే ఈ సంస్థ కార్యకలాపాలు భారత్‌, చెచెన్యా, ఉజ్బెకిస్థాన్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, తజికిస్తాన్‌, ఇరాన్‌, మలేసియా, ఫిజీ, అమెరికా, ఇంగ్లాండ్‌లతో సహా 24 దేశాలకు విస్తరించినట్టు సమాచారం ఉంది. 2007 ఫిబ్రవరిలో జరిగిన సంర&°తా ఎక్స్‌ప్రెస్‌ పేలుడు సంఘటనలో కూడా హుజీ పాత్ర ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సంవత్సరం మే 25వతేదీన హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్‌లోనూ, కోఠీలోని గోకుల్‌ చాట్‌లోనూ సంభవించిన పేలుళ్ల వెనుక కూడా హుజీ హస్తం ఉంది. అలాగే, 2008 మే 13వ తేదీన జైపూర్‌లో వరుస పేలుళ్ళ సంఘటనతో కూడా హుజీకి ప్రమేయం ఉంది.2007 మే 18వ తేదీన హైదరాబాద్‌లోని మక్కా మసీదు పేలుళ్ళ కేసులో కూడా హుజీ పాత్ర ఉంది.2007 వారణాసి, ఫైజాబాద్‌, లక్నోలలో జరిగిన పేలుళ్లలో హుజీకి సంబంధాలు ఉన్నాయి. హుజీకి చెందిన స్లీపర్‌ సెల్స్‌ ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లతో సహా పెక్కు రాష్ట్రాల్లో పని చేస్తున్నాయి. పాకిస్తాన్‌ రహస్య గూఢచార సంస్థ ఐఎస్‌ఐతోనూ, తాలిబన్‌, అల్‌ ఖైదా వర్గాలతోనూ హుజీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే, పాక్‌ కేంద్రంగా పని చేసే లష్కర్‌ ఎ తోయిబా, జైష్‌ ఎ మహ్మద్‌ తదితర సంస్థలతో కూడా సంబంధాలు ఉన్నాయి. హుజీని అమెరికా విదేశాంగ శాఖ 2008 మార్చిలో ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.ఆ సంస్థకు వివిధ బ్యాంకుల్లోని ఖాతాల్లోని నిధులను స్తంభింపజేయాల్సి ఉంది. కానీ, ఎక్కడికక్కడ స్థానికుల సహాయంతో ఆ సంస్థ తన కార్యకలాపాలను నిరాఘాటంగా కొనసాగిస్తోంది.

Monday, September 5, 2011

గాలి కేసులు ఇవే...!


అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారంటూ అరెస్టు చేసిన గాలి సోదరుల పై 8 రకాల కేసులు నమోదు చేసింది.. నేరపూరితంగా కుట్ర చేయడం, మోసం చేయడం, అటవీ సొమ్మును ధ్వంసం చేయడం వంటి పలు కేసుల్లో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. మైనింగ్ మాఫియా గాలి జనార్దన్ రెడ్డి పై ఓబుళా పురం అక్రమాలకు సంబంధించన ఆరోపణల నేపద్యంలో సిిబిఐ మొత్తం 8 రకాల కేసులు నమోదు చేశారు.
ఐపిసి సెక్షన్ 120బి కింద నేరపూరిత కుట్ర కేసు చేసినట్టగా కేసు నమోదు చేశారు.. దీంతో బాటు మోసం చేసినందుకు ఐపిసి 420... చోరీ సొమ్మును స్వీకరించినందుకు ఐపిసి 411 కింద, ప్రభుత్వాస్తులను ధ్వసం చేసినందుకు గానీ ఐపీసి 427.. ఇతరులకు చెందిన ఆస్తుల్లోకి అక్రమంగా ప్రవేశించిన నేరానికి ఐపిసి 448 లు నమోదు చేశారు.. వీటితో బాటు.. అటవీ చట్టం ప్రకారం నిషిద్ద ప్రాంతంలో ప్రవేశించి అటవీ సంపదను ధ్వంసం చేసినందుకు గానూ సెక్షన్ 26 కూడా నమోదు చేశారు.. అక్రమాలకు సహకరించిన అధికారుల పై అవినీతి నిరోదక చట్టం 13బై1 కూడా చేర్చింది.. వీటితో బాటు మినరల్స్, మైనింగ్ చట్టాలకు సంబధించిన కేసులను కూడా అన్వయిస్తారు.
ఈ కేసులను 2009లోనే నమోదు చేసినా గాలి జనార్దన్ రెడ్డి కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడంతో.. అప్పటికి తాత్కాలికంగా తెరపడింది. తాజాగా లోకాయుక్త నివేదికను అనుసరించి సిబిఐ స్టేను వెకేట్ చేయించి గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసింది..

Sunday, September 4, 2011

ఎవరీ గాలి సోదరులు..? గాలివాటం...


అక్రమ గనుల తవ్వకంలో అరెస్టయిన గాలి సోదరుల మైనింగ్ మాఫియా గా ఎలా ఎదిగారు.. అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టిన గాలి సోదరులు కోట్లకు ఎలా పడగలెత్తారు... చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి దివాళా తీసిన గాలి సోదరులు కర్నాటక రాజకీయాల్లో కింగ్‌మేకర్ లా ఎలా మారారు. తమను పొలిటికల్‌గా జన్మనిచ్చిన పార్టీ ఇబ్బంది పడే పరిస్థితులెందుకొచ్చాయి... ఇంతకీ గాలి సోదరుల పొలిటికల్ ప్రొఫైల్ పై హెచ్ ఎం టీవీ స్పెషల్ స్టోరీ.
గాలి సోదరులు... తక్కువ కాలంలో గల్లీ రాజకీయల నుంచి ఢిల్లీ రాజకీయలను శాసించే స్థాయికి ఎదిగిన నేతలు.. రెండు రాష్ట్రాల రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్న గాలి బ్రదర్స్ ప్రస్థానంలో ఎన్నో మలుపులు.. వారికి ఈ లైమ్ లైట్ ఓవర్ నైట్ లో ఆయాచితంగా వచ్చింది కాదు..
సాధారణ కానిస్టేబుల్ కుటుంబం నుంచి పుట్టిన గాలిసోదరులు.. వీరిలో పెద్ద సోదరుడి పేరు గాలి కరుణాకర్, రెండవ వాడు జనార్దన్ రెడ్డి, ఆఖరు వాడు సోమశేఖరురెడ్డి. వీరు బతుకు దెరువు కోసం బళ్ళారి రోడ్ల పై తిరిగిన రోజులే ఎక్కువ.. టూ వీలర్ పై తిరుగుతూ బతుకుదెరువు కోసం వెతుకులాటలో ఎన్ని గడపలో ఎక్కి దిగారు... 1998లో లో ఎన్నోబుల్ సేవింగ్ అండ్ ఇన్వేస్ట్‌మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి ఇబ్బందులు పడ్డారు. ఈ కంపెనీ పెట్టి 200 కోట్లకు మోసం చేశారన్న ఆరోపణలు రావడంతో మళ్లీ ఇబ్బందులెదుయ్యాయి.. 1999లో మైనింగ్ రంగంలో అడుగు పెట్టిన గాలి సోదరులకు కాస్త కలిసొచ్చే రోజులు వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో.. బళ్లారిలో సోనియా గాంధీ తన ప్రాభవాన్ని చాటుకుంటున్న తరుణంలో ఎప్పటికపుడు సుష్మాస్వరాజ్ సోనియాకు చెక్ పెడుతూ వచ్చింది. సరిగ్గా అదే సమయంలో సుష్మా స్వరాజ్ దత్తపుత్రుడిగా పిలుచుకొనే శ్రీరాములు గాలి బ్రదర్స్ ను పొలిటికల్ స్క్రీన్ పైకి తెచ్సారు. సుష్మా స్వరాజ్ అండ దండలతో బిజేపీ పార్టీ పటిష్టతకు గాలి బ్రదర్స్ సర్వశక్తులు ఒడ్డారు. దీంతో కర్నాటక రాజకీయాల పై గట్టి పట్టు తెచ్చుకోగలిగారు..
కర్నాటక రాజకీయాల పై గాలి సోదరుల తొలి ప్రభావం బళ్లారి మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలతో ప్రారంభమయింది. ఈ ఎన్నికల్లో బిజేపీ ఘన విజయం సాధించింది. ఈ విజయం వెనుక గాలి సోదరుల ప్రభావాన్ని అధిష్టానం గుర్తించింది. ఆ తరువాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గాలి సోదరుల ప్రభావం కనిపించింది.. బళ్లారి లోక్ సభ స్థానంలో 1952 నుంచి గెలుస్తూ వస్తున్న అభ్యర్థి పైగాలి కరుణాకర్ రెడ్డి గెలిచారు.. గాలి సోదరుల రాజకీయ వ్యూహాలతో కర్నాటకలో భారతీయ జనతా పార్టీకి కొత్త జీవం వచ్చింది. కర్నాటకలో జిల్లాల నుంచి గల్లీల వరకు గాలి ప్రభావం పాకింది.. రాజకీయంగా తమకంటూ బలమైన పునాదులు వేసుకున్నారు.
ఒకపక్క రాజకీయంగా ఎదుగుతూనే మరో పక్క అదే పలుకుబడిని ఉపయోగించుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించ సాగారు.. అంతర్జాతీయంగా ఇనుప ఖనిజం ఎగుమతుల్లో గాలి సోదరులు తమ కంటూ ప్రత్యేక స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఓబుళాపురం మైనింగ్ అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించింది.. ఇది బళ్లారి సరిహద్దుల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోకి కూడా చొచ్చుకొచ్చింది. ఈ కంపెనీకి శ్రీరాములు మేనేజింగ్ డైరక్టర్. చైనా తన ఇన్‌ఫ్రా స్టక్చర్ కోసం గాలి సోదరుల ఐరన్ ఓర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడంతో.. ఓబుళాపురం తవ్వకాలు ఊపందుకున్నాయి. లక్షల్లో ఉన్న వ్యాపారం వందల కోట్లకు చేరింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం గాలి బ్రదర్స్‌కు కావలసిన సహాయ సహకారాలు అందించడంతో రెండు రాష్ట్రాల్లో ఐరన్ ఓర్ వ్యాపార సామ్రాజ్యానికి ఎదురులేని నేతలుగా ఎదిగారు.. తమకంటూ సొంత హెలికాప్టర్ కొనుగోలు చేశారు. ఈ హెలికాప్టర్ తరచూ పార్టీ కార్యకలాపాలకు కూడా వాడేవారు.
గాలి సోదరుల మైనింగ్ పై అనేక ఆరోపణలు వచ్చాయి... అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారని రాజకీయ పార్టీలు దుమారం రేపాయి. మైనింగ్ వ్యాపారం నుంచి మైనింగ్ మాఫియాగా ఎదిగిన వ్యాపార సామ్రాట్టులను కదిలిస్తే రెండు రాష్ట్రాల రాజకీయ పునాదులే కదిలేలా పాతుకుపోయారు. కర్నాటకలో బిజేపీ పార్టీలో ఉంటూనే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉండటం గాలి బ్రదర్స్ కే చెల్లింది.. పేద కుటుంబం నుంచి రాజకుటుంబం స్థాయికి ఎదిగిన బళ్లారి సోదరుల జీవతం బంగారు మయంగా మారింది.
గాలి అక్రమ గనుల వ్యవహారం వల్ల కర్నాటకలో ప్రభుత్వాలే ఒడిదుడుకుల్లో పడాల్సి వచ్చింది.. గాలి వ్యాపారం యడ్యూరప్ప పదవికి ఎసరు పెట్టింది. అక్రమాల పై వేసిన లోకాయుక్త కమిటీ గాలి వ్యవహారం పై పూర్తిస్థాయి వివరాలు సేకరించి తన నివేదికలో పొందుపరిచింది. లోకాయుక్త నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి.
గాలి జనార్దన్ రెడ్డి బంగారం కుర్చీలోనే కూర్చుంటారు. దాని ఖరీదు 2.2 కోట్ల రూపాయలు. బంగారంతో తయారు చేసిన విగ్రహాలకు పూజలు చేస్తారు. వాటి విలువ రూ. 2.28 కోట్లు. రూ. 13.15 లక్షల విలువ చేసే బెల్టు ధరిస్తారు. గాలి జనార్దన్ రెడ్డి జీవితమంతా స్వర్ణమయమే. బంగారు పళ్లెంలోనే తింటారు. గిన్నెలు, చెంచా, ఫోర్కు, కత్తి అన్నీ బంగారంతో చేసిన వాటినే ఉపయోగిస్తారు.. వీటి విలువ లక్షల్లో ఉంటుందని అంచనా
సాదాసీదా జీవితం నుంచి వేల కోట్ల రూపాయలకు పడగలెత్తిన గాలి సోదరుల పై ఎన్నో సార్లు ఐటి దాడులు జరిగాయి.. తాజాగా సిబిఐ దాడితో గాలి వ్యాపార సామ్రాజ్య లోగుట్టు మరింత తెలిసే అవకాశం ఉంది..

Saturday, September 3, 2011

ఇక్కడ ప్రశ్నిస్తే... చంపేస్తారు..


మనది ప్రజల చేత.. ప్రజల వలన.. ప్రజల కొరకు ఏర్పడ్డ ప్రజాస్వామ్యం.. ఇది కేవలం ప్రజాశ్రేయస్సుకే పనిచేస్తుంది.. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.. ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛకు గౌరవం ఉంది.. అందరికీ సమాన హక్కులు కల్పించే అతిపెద్ద రాజ్యాంగం.. కానీ ఇవన్నీ మనం చదువున్న పాఠ్య పుస్తకాల్లోనే.. నిజ జీవితంలోకి అడుగు పెట్టామా.. లేదా ఒక్కసారి భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారా.. అప్పుడు తెలసుస్తుంది అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం యొక్క నిజస్వరూపం.. దానికి రుజువులివిగో
మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.. ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. ఎక్కడైనా అడుక్కోవచ్చు.. కావాలంటే స్మగ్లింగ్ చేసి బతకొచ్చు.. హత్యలు చేసి బయటకు రావచ్చు.. నేర చరిత్ర ఉన్నా చట్ట సభల్లో కుర్చీలిరగ్గొట్టొచ్చు. కానీ పాలక పక్షాన్ని పల్లెత్తు మాట అన్నారా.. హక్కుల పేరుతో గళమెత్తారా.. లేదా అవినీతి అంటూ జబ్బలు చరిచారా.. ఇక మీకు నూకలు చెల్లినట్టే.. అయితే ఈ వైకరి స్వాతంత్ర్యం రాక మునుపు నుంచి, స్వాతంత్ర్యంలాంటిది వచ్చాక కొనసాగి, గత దశాబ్ద కాలంగా వేగంగా జరుగుతున్న విపరీత పరిణామాలే దీనికి సాక్ష్యం..
పేరు ఏదైనా కావచ్చు.. బినాయక్ సేన్.. జితేన్ మరాండీ.. రాందేవ్ బాబా.. కేజ్రీవాల్.... ఈ పేర్లు ఈ మద్యకాలంలో తరచూ పత్రికల్లో వినిపింస్తున్నాయి.. వీళ్లందరి సిద్ధాంతాలు వైరైనా... దారులు వేరైనా లక్ష్యం ఒకటే.. దోపిడిని నివారించడం. కాగితాల్లో ఉన్న ప్రజాసంక్షేమం సామాన్యుడి గుమ్మం ముందుకు రావలన్నదే ధ్యేయం.. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుబాటులో ఉండాలనేదే వీరి వాదన.. ఇందులో కొందరికి సిద్ధాంతాలతో పనిలేదు.. రాద్దాంతాలతో పనిలేదు.. వారిపని వారు చేసుకుపోతారు.. బినాయక్ సేన్ లాంటి వాళ్లు కేవలం వైద్య సహాయంతోనే ప్రజలకు చేరువవుతారు.. జితేన్ మరాండి లాంటి వ్యక్తులు తమ గళంతో ప్రజలకు దగ్గరవుతారు.. రాందేవ్ బాబా, హజారే, కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు జాతి ప్రయోజనాలు కాపాడే వాక్పటిమతో దగ్గరవుతారు.. కానీ వీరందరూ ప్రజలతో మమేకమై ప్రజాభిమానం చూరగొంటే తప్పులేదు.. ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవాలే గానీ ప్రజల్ని ప్రభుత్వం మీదకు ఉసిగొల్పకూడదు. తీవ్రవాదం పేరుతో గిరిజనుల పై జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించకూడదు.. ప్రభుత్వం నియమించిన ప్రైవేట్ గూండాలను వ్యతిరేకించ కూడదు.. అభివృద్ది పేరుతో అడవులను నరికి గిరిజనుల కాళ్లకింద పొదగి ఉన్న ఖనిజాలను కొల్ల గొట్టడాన్ని ప్రశ్నించకూడదు.. ప్రపంచ దేశాలనే ఆశ్చర్యంలో ముంచేంతగా పెరిగిపోతున్న నల్లధనం నిల్వలను వేలెత్తి చూపకూడదు. ఆ నిల్వలను పెంచుతున్న అవినీతిని ప్రశ్నించకూడదు.. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. అగ్రరాజ్య ఆదేశాలను ప్రత్యక్షంగా అమలు చేస్తున్న ప్రభుత్వ వైఖరిని పల్లెత్తు మాట కూడా అనకూడదు... ప్రశ్నించడం కాదు కదా.. ప్రశ్నిస్తారన్న అనుమానం వచ్చినా.. వారి శేష జీవితం కారగారవాసమే.. కాస్త గట్టిగా మాట్లాడే వాళ్లయితే.. ఏదో ఒక తీవ్రవాదసంస్థ కార్యకర్త పేరుతో ఉరికంభం ఎక్కితీరాల్సిందే. ఇదే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలవబడే భారతదేశంలో పౌర స్వేచ్ఛ, పౌర హక్కులు.. ప్రజా సంక్షేమం పై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వాలు ప్రజల తరుపున పోరాడుతున్న వారి పై కక్ష సాధింపు చర్యలెందుకు.. బినాయక్ సేన్ కు కారాగారవాస మెందుకు.. షర్మిలా ఛానూకు నిరాహార దీక్ష పదేళ్లుగా కారాగారంలోనే చేయాల్సిరావడమెందుకు.. ప్రచారానికి పాటను ఎన్నుకున్నందుకు జితేన్ మరాండీకి తన పేరే తనకు శాపంగా ఎందుకు మారింది.. నిన్నగాక మొన్న అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్లు తీసుకురావాలని హజారేను వెనకుండి నడిపించిన మేథావులకు ఇన్నేళ్లనుంచి పోని నోటీసులు ఇప్పుడే ఎందుకు పోస్టవుతున్నాయి.. వీటన్నిటికీ ఒకటే కారణం.. రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడటమే.. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించడమే... ప్రజల పక్షాన నిలవడమే వీరు చేసిన పాపం..

తిరుమల తిరుపతి పాలక మండలి.. గోవిందా..గోవిందా..



టిడిడి కొత్తగా ఏర్పాటు చేసిన పాలక మండిలి వివాదాస్పదమవుతోంది.. 7గురి సభ్యులతో మాత్రమే వేసిన ఈ కమిటీ పదవీ కాలాన్ని కేవలం సంవత్సరానికే పరిమితం చేయడం వివదానికి తెరలేపింది. అయితే అధికారుల మాత్రం గతంలో జరిగిన తప్పులు పునారవృతం కాకుండా ఉండేందుకే మార్పులకు శ్రీకారం చుట్టామని చెబుతున్నారు.ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన టిటిడి పాలక మండలి వివాదాస్పదమవుతోంది.. రెండు సంవత్సరాల పదవీకాలానికి వేయాల్సిన కమిటీని కేవలం సంవత్సరకాలానికి వేయడం ఒక కారణమైతే.. 15 మంది సభ్యులుండాల్సిన స్థానంలో కేవలం 7గురితో సరిపుచ్చడం వివాదానికి మరోకారణం. ఎండోమెంట్ నిబంధనల ప్రకారం 6ఎ గ్రేడ్ కు చెందిన అన్ని ఆలయాల్లో పాలక మండలి తప్పకుండా 15 మంది సభ్యులు ఉండి తీరాలి. వీరిలో 11 మంది అఫిషియల్స్ ఉండగా మిగిలిన నలుగురు అఫిషియల్ సభ్యులు. కానీ ఇప్పుడు 7గురు సభ్యులతో ఏర్పాటు చేసిన పాలక మండలిలో చైర్మన్ తో కలిపి నలుగురు అఫిషియల్ సభ్యుల మిగతా ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు.. ఎక్స్ అఫిషియో మెంబర్లకు ఓటింగ్ ఉండదు కాబట్టి ఉన్న నలుగురిలో ఇద్దరు ఏ ఇద్దరు నిర్ణయాన్ని వ్యతిరేకించినా ఆ నిర్ణయం ఆమోదం కాదు. అపీషియో మెంబర్లు బేసి సంఖ్యలో ఉంటే ఓటింగ్ ఒక్క ఓటుతో నెగ్గే అవకాశం ఉంటుంది.. కానీ ఇప్పుడు పాలక మండలి ప్రకారం అది సాధ్యం కాదు.. అధికారుల మాటలు పెడ చెవిన పెట్టి ప్రభుత్వం వేసిన ఈ పాలక మండలికి వ్యతిరేకంగా టిటిడి సిబ్బంది కోర్టుకెక్కనున్నారు..మరోవైపు టిటిడి పాలక మండిలి నియామకం పై వస్తున్న ఆరోపణలకు ఎండోమెంట్ ప్రిన్స్‌పుల్ సెక్రటరీ సమాధానమిచ్చారు. గతంలో ముగ్గురు అధికారులతో పాలక మండలి నడిపించామని.. ఇప్పుడు 7గురితో నడపడం ఎందుకు సాద్యం కాదని ప్రశ్నిస్తున్నారు. దేవాదయ నిబంధనల ప్రకారం 3 నుంచి 11 మంది సభ్యులను నియమించ వచ్చని అయితే ప్రస్తుతానికి కేవలం 7గురిని నియమించామన్నారు. దీనితో బాటు దేవాలయాల్లో ఎటువంటి పాలక మండలి ఉండాలనే విషయం పై దేవాదయ శాఖ ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘ ఈ నెల 9వ తేదీన నివేదిక ఇస్తుంది. నివేదికను బట్టి ఎంత మందిని నియమించాలి.. నియమించే వారిలో.. రాజకీయ వ్యక్తులకు ప్రాధాన్యమివ్వాలా లేక అధికారులకు ప్రాధాన్యమివ్వాలా అనే అంశంలో ఒక నిర్ణయానికి వస్తామని పి.యస్ చెబుతున్నారు. గతంలో పాలక మండలి పదవీకాలాన్ని రెండు సంవత్సరాలు ఉంచబట్టి అరాచకాలు పెరిగాయని.. ఇప్పుడు కేవలం సంవత్సరకాలం పెట్టి ఎటువంటి వివాదాలు లేకుంటే మరో సంవత్సరం పొడిగించే అవకాశముందన్నారు. గతంలో టిటిడిలో వచ్చిన వివాదాలు పునరావృతం కాకూడదనే సి.యం ఈ విధానానికి శ్రీకారం చుట్టారని ప్రిన్స్‌పుట్ సెక్రటరీ రమణాచారి చెబుతున్నారు.



నేతలు ఆస్తులు తక్కువచేసి చెప్పటమెట్లా...

నేతలు ఆస్తులు తక్కువచేసి చెప్పటమెట్లా...


చంద్రబాబు నాయుడు తన ఆస్తుల వివరాలు ప్రకటించడంతో... మిగతా నేతలు కూడా తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలనే డిమాండ్ ఊపందుకుంది... ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ తమ ఆస్తులను వెల్లడించక తప్పని పరిస్తితి.. బినామీ ఆస్తులను కప్పిపెట్టి కొసర ఆస్తులను చూపించడానికి నేతలు కసరత్తు చేస్తున్నారు.
ఆస్తుల విషయంలో పారదర్శకత అవసరమంటూ చంద్రబాబు తన ఆస్తుల చిట్టా విప్పాడు.. తాను.. తన కుటుంబం... తన ఆస్తి అంటూ.. మీడియా ముందు పద్దులు అప్పజెప్పారు.. బాబు లెక్కలన్నీ తప్పుల తడక.. అబద్దాల కుప్ప అంటూనే.. తమ లెక్కలను ఎలా తప్పించాలా.. అని నేతలు హైరానా పడుతున్నారు.. అసలు ఆస్తులను దాచిపెట్టి బీదవాణ్ణని చెప్పుకోవడమెలా అని ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆస్తి వివరాలను తక్కువ చేసి చెబితే దాచిన ఆస్తులకు ఎక్కడ ఎసరు వస్తుందో నని నేతలు వణుకుతున్నారు... అలా కాదని బినామీలను నమ్ముకుంటే.. వారెక్కడ హ్యాండిస్తారోననే బెంగ వెంటాడుతుంది.. ఉన్న ఆస్తులను తక్కువ చేసి చూపడానికి సీనియర్ అకౌంటెంట్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ కు మాంచి గిరాకీ వచ్చింది. చంద్రబాబుకున్న వేలాది కోట్లను దాచి పదుల సంఖ్యలో చూపగలిగిన చతురత వెనుక సూత్రదారి ఎవరోనని ఆరాతీస్తున్నట్టు సమాచారం. ఆ లెక్కన తమ ఆస్తిని సింగిల్ డిజిట్ మించకుండా చెప్పేందుకు సాధ్యమైనంత వరకు కుక్కి కుక్కి కుదించేపనిలో నేతలు బిజీ బిజీగా ఉన్నారు. నేతలు కనీసం ఆ విధంగా ఆస్తులు వెల్లడించినా మిగిలిన ఆస్తుల పని ప్రతిపక్షాలు, ప్రజలు చూసుకుంటారని మేథావులు విశ్లేషిస్తున్నారు.

Friday, September 2, 2011

నండూరి... ఇకలేరు..

నండూరి రామ్మోహన్ రావు

విశ్వరహస్యాలను విప్పి చెప్పిన కలం ఆగిపోయింది... సాహితీ లోకంలో తనదైన ముద్ర వేసుకున్న అపర మేథావి నండూరి రామ్మోహన్ రావు... మనల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన విజయవాడ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.. వివిధ పత్రికల్లో సంపాదకుడిగా.. రచయితగా నండూరి సుపరిచితులు.. ఆయన రాసిన నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం ప్రజాదరణ పొందిన రచనలు. నండూరి మరణ వార్త సాహితీ అభిమానులను విషాదంలో ముంచింది.. పాశ్యాత్య తత్వవేత్తల జీవితాన్ని, భారతీయ తత్వవేత్తల జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన పరిశోధకుడు.. జీవితంలో ఎక్కువ కాలం సత్యశోధనకే తన జీవితాన్ని అంకితం చేసిన సునిశిత మేథావి..