ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, April 28, 2012

భాను పోలీసులకు ఏం చెప్పాడు ? సూరి హత్య వెనక దాగిన రహస్యం (ఒరిజినల్ స్టోరీ)


భానుకిరణ్... ఈ పేరు చెబితే రకరకాల ఊహాగానాలు వెల్లువలా పెల్లుబికుతున్నాయి. భాను సూరిని నమ్మించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడని... హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకొని విచ్చలవిడిగా తిరిగాడని.. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఉహాగానాలన్నీ వాస్తవాలేనా... అసలు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో భాను ఏం చెప్పాడు ...? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు అందరి మదినీ తొలుస్తున్నాయి... ఈ ప్రశ్నలన్నిటీకి సమధానాలు హెచ్ఎంటీవీ చేతికి చిక్కాయి. పోలీసులకు భాను ఏం చెప్పాడో చూద్దాం..
భాను పోలీసులకు ఏం చెప్పాడు.. జనాల్లో ప్రచారమవుతున్న విషయాలకు భాను వాగ్మూలానిక కొద్దిగైనా పొంతన ఉందా... భాను పై ఏ ఆధారం లేకుండా ఇన్ని రకాలుగా ప్రచారం జరుగడం వెనుక ఎవరున్నారు. ఇంతకీ భాను వాగ్మూలంలో ఏముందో చూద్దాం.. రాష‌్ట్రంలో ఇప్పుడు భానుకిరణ్ పేరు ఒక సంచలనం ... భానుకు హీరోయిన్లతో సంబంధాలున్నాయని, 800 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడని పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అసలు వాంగ్మూల పత్రాలను హెచ్ఎంటివి సంపాదించింది ... బయట జరుగుతున్న ప్రచారానికి వాంగ్మూలంలో ఉన్నదానికి అసలు పొంతనే లేదనే విషయాన్ని గుర్తించింది. పోలీసులకు భాను ఇచ్చిన వాంగ్మూలం పూర్తి పాఠం ఇలా ఉంది ... భాను కుటుంబ సభ్యులందరూ ఉన్నత చదువులు చదివి..బాగా స్థిరపడిన వారే. భాను తల్లిదండ్రులు దామోదర్‌రావు, మీనాకుమారి. భానుకు ఓ తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. తల్లి మీనాకుమారి ప్రధానోపాధ్యాయురాలు.. తండ్రి దామోదర్ రావు 1997లో చనిపోయారు. తమ్ముడు వంశీకృష్ణ బెంగళూరు హెచ్‌ఎఎల్‌లో పనిచేస్తుండగా.. సోదరి భర్త బ్రహ్మానందం సెంట్రల్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇంత ఉన్నతమైన కుటుంబంలో భాను మాత్రం నిందితుడిగా మారాడు. పాలిటెక్నిక్ చదువుతూ మధ్యలోనే మానేసిన భాను... చింత గోపి, నర్సింహారెడ్డి, సతీష్, గణేష్‌ వంటి భాగస్వామ్యులుతో 1999లో అనంతపురంలో లిక్కర్ బిజినెస్ చేశాడు. ఆ తరువాత కొండాపురం సురేష్, సింహాద్రిపురం శేఖర్ రెడ్డి సాయంతో... చర్లపల్లి జైలులో ఉన్న మద్దెల చెరువు సూరిని భానుకిరణ‌్ కలిశాడు. తరువాత 2002లో హైదరాబాద్ లో కాల్ డైవర్షన్ స్కీమ్ బిజినెస్‌ ప్రారంభించాడు. అంకిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, లక్కిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, దంతులూరి కృష్ణ అలియాస్ మంగలి కృష్ణ, సుంకు సుదర్శన్ రెడ్డి, శెట్టినారాయణ, రమేష్ రెడ్డి, ఎరుకల వెంకట మదన్ మోహన్ రెడ్డి, కైతి నర్సింహారెడ్డి, మధుసూదన్ రెడ్డితో కలిసి అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్ కుంభకోణానికి పాల్పడ్డాడు. భాను గ్యాంగ్ లోని 11మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. 2003లో ఖాదర్ , లోక్ నాథ్ తో కలిసి కాల్ డైవర్షన్ స్కీమ్ మళ్లీ మొదలుపెట్టాడు. 2006లో శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తి ద్వారా బాడీగార్డు మన్మోహన్ సింగ్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలోనే ఖమ్మంలో రివాల్వర్ లైసెన్స్ సంపాదించిన భాను..లైసెన్స్ కోసం పోలీసులకు, అధికారులకు భారీగా లంచాలు ముట్టజెప్పాడు. భాను కిరణ్ 2006 వరకు సాదా సీదా దందాలు చేశాడు. ఆ తరువాత క్రమంగా బెదిరింపులకు... సెటిల్ మెంట్ లకు దిగి పోలీసులకు రెగ్యులర్ కస్టమర్ గా మారిపోయాడు. నగరంలో భాను అంటే తెలియని వ్యాపరిగానీ అధికారి గానీ లేనంతగా పాపులర్ అయ్యాడు. తుపాకుల కొనుగోళ్లు, అక్రమ వసూళ్లు భానుకు చేయితిరిగి విద్యగా మారింది 2006లో దందాలు చేయడం మెుదలుపెట్టిన భాను కొందరు పెద్దల సాయంతో దాన్ని నిరాటంకంగా కొనసాగించాడు. . ఖైరతాబాద్ సిఐ ఇండియా సాఫ్ట్ వేర్ ఇన్స్టిట్యూట్ యజమాని కళ్యాణ్ చక్రధర్‌రెడ్డి ని బెదిరించి భాను ముఠా 12కోట్లు వసూలు చేసింది. ఈ కేసులో ఎ వన్ గా కాశెట్టి ప్రతాప్, ఎ టుగా ప్రదీప్ కుమార్, ఎ త్రీగా మధుమోహన్ రెడ్డి, ఎ ఫోర్ గా భాను, ఎ ఫైవ్ గా కృష్ణకిషోర్, ఎ సిక్స్ గా నాగిరెడ్డి రవికృష్ణారెడ్డి, ఎ సెవెన్ గా బయ్యపురెడ్డి , ఎ ఎయిట్ గా సురేందర్ రెడ్డి, ఎ నైన్ గా రఘునాథ్ రెడ్డి, ఎ టెన్ గా అశోక్ రెడ్డి, ఎ లెవెన్ గా దంతలూరి కృష‌్ణ అలియాస్ మంగలి కృష్ణ, ఎ ట్వెల్వ్ గా గంగాధర్‌లు ఉన్నారు. భానుతో కలిపి మొత్తం 12మందిని సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. 2008లో దంతలూరి కృష్ణ అలియాస్ మంగలి కృష్ణ ద్వారా భాను ... అనిల్ సాయంతో 5 తుపాకులను కొనుగోలు చేశాడు. 2009 మార్చిలో అక్రమ ఫైనాన్స్ దందాకి తెర తీశాడు భాను . ఈ కేసులో ఎ వన్ గా పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి , ఎ టుగా సర్వేష్, ఎ త్రీగా రాహుల్ కుమార్, ఎ ఫోర్ గా సంజయ్ భరద్వాజ్ అలియాస్ పండిట్, ఎ ఫైవ్ గా మహ్మద్ జఫర్, ఎ సిక్స్ గా జహంగీర్ ఖాన్, ఎ సెవన్ గా భాను, ఎ ఎయిట్ గా మాధవయ్య, ఎ నైన్ గా అబ్దుల్ రవూఫ్, ఎ టెన్ గా భంగి రాజు, ఎ లెవెన్ గా కర్నె శివప్రసాద్ రెడ్డి, ఎ ట్వెల్వ్ గా మోహన్ వినోద్ అలియాస్ చక్రి ఉన్నారు. భానుతో సహా గ్యాంగులోని పన్నెండు మందినీ బేగంపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇంతవరకూ భాను తన ముఠాతో వసూళ్లు, అక్రమ దందాలకు పాల్పడ్డాడు. ఈ ఎపిసోడ్స్ అన్నింటిలో సూరి హస్తం ఎక్కడా లేదు. కానీ 2009లో సూరి సోదరి హేమలతా రెడ్డితో కలిసి సూరి జైలు శిక్షను తగ్గించేందుకు భాను విశ్వ ప్రయత్నం చేశాడు. దీంతో భాను.. సూరిల మధ్య నమ్మకమైన స్నేహం చిగురించింది. అప్పటి నుంచి సూరికి భాను నమ్మిన బంటుగా మారాడు. భాను లేనిదే సూరి ఏమీ చేయలేనంతగా నమ్మాడు.
2009 లో సూరి సోదరి హేమలతా రెడ్డితో కలిసి సూరి జైలు శిక్షను తగ్గించేందుకు భాను తీవ్రంగా ప్రయత్నించాడు. తరువాత కొద్ది రోజుల్లోనే సూరి బయటకు వచ్చాడు. ఇక్కడే సూరి, భానుకిరణ్‌ల మధ్య స్నేహం చిగురించింది. ఇద్దరూ కలిసి అనేక మందిని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారు ... దీంతో తిరిగి సూరి మళ్లీ జైలుకు వెళ్లాడు. సూరి పేరు చెప్పుకుని భానుకిరణ్ దందాలు, భూ ఆక్రమణలు, సెటిల్‌మెంట్లు మెుదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే 2010లో నిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్నా రాణి కి కూకట్ పల్లిలో ఉన్న 684 గజాల స్థలాన్ని ... భాను గ్యాంగ్ ఆక్రమించింది ... ఈ కేసులో ఎ వన్ గా కందుకూరు దేవేందర్ రెడ్డి, ఎ టుగా పరమేశ్వర్ రెడ్డి, ఎ త్రీగా ఎరుకల సురేందర్ రెడ్డి , ఎ ఫోర్ గా నిమ్స్ డాక్టర్ శరత్ చంద్ర నాగవర ప్రసాద్, ఎ ఫైవ్ గా మధుమోహన్ రెడ్డి, ఎ సిక్స్ గా అల్లూరి భానుప్రకాష్ లను కూకట్ పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు .. ఈ కేసులో భానుతో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు బుక్ చేశారు ... 2010 ఆగస్టులో సినీనిర్మాతలు శింగనమల రమేష్, సి. కళ్యాణ్ లు భానును కలిసి తమకు సహకరించాల్సిందిగా కోరారు. అప్పటి నుంచి భానుకిరణ్‌కు సినీ ఇండస్ట్రీతో పరిచయాలు మెుదలయ్యాయి. శింగనమల రమేష్, సి. కళ్యాణ్‌ల తరపున రంగంలోకి దిగిన భాను బాలాజి కలర్ ల్యాబ్ లో షాలిమార్ వీడియోస్ అధినేతను బెదిరించారు ... కొమురంపులి, ఖలేజా సినిమా వీడియో హక్కుల కోసం చెల్లించిన డబ్బుల విషయం మరిచి పోవాలని హెచ్చరించారు. 2010 సెప్టెంబర్ లో సినీ ఫైనాన్షియర్ వైజయంతీ రెడ్డి, సదానందంను బాలాజీ కలర్ ల్యాబ్ కు పిలిపించి భాను సెక్యురిటీ గార్డు మన్మోహన్ రివాల్వర్ తో బెదిరించారు ... 2010 నవంబర్ నెలలో తన అనుచరులు కొద్దిమంది తో కలిసి విజయవాడ అన్నపూర్ణ ప్యాకేజింగ్ యూనిట్ యాజమాన్యం లో తలెత్తిన వివాదాన్ని సూరి పేరు చెప్పి భాను సెటిల్ చేశారు. 2010లో సూరి జైలు నుండి విడుదలైన తరువాత సూరి సాయంతో కలిసి బెదిరింపులకు, బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. అంతకుముందు కొనుగోలు చేసిన రెండు రివాల్వర్ లను అదే ఏడాది అక్టోబర్ నవంబర్ నెలల్లో భాను తెప్పించుకున్నాడు. బెదిరింపులు, సెటిల్‌మెంట్లతో సంపాదించిన సొమ్ముని రక్తచరిత్ర సినిమాకి పెట్టుబడిగా భాను పెట్టాడు. సూరితో విభేదాలు తలెత్తడంతో 2011 జనవరి 3న మద్దెల చెరువు సూరిని తన అనుచరులతోపాటు మరో్ నలుగురి సాయంతో భాను మట్టు పెట్టాడు. ఇదీ భాను ఇచ్చిన వాంగ్మూలం. భాను పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి చూస్తే అతని గ్యాంగ్ లో పనిచేసిన వారు , సహకరించిన వారి సంఖ్య ఏభైకి పైమాటేనని చెప్పవచ్చు. అంటే సూరి హత్యతో నేర ప్రపంచంలో వచ్చిన ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటే, పాత పద్ధతిలో వ్యవహారాలు నడపాలనుకుంటే భాను గ్యాంగ్ లో ఇప్పటికిప్పుడు ఏభై మంది రెడీగా ఉన్నారు. ఈ గ్యాంగ్ సభ్యుల లెక్కలతో పాటు, భాను సొంతంగా సంపాదించిన భూములు, బినామీ పేర్లతో రిజిస్టర్ చేసిన భూములు వివరాల లెక్క తేల్చే పనిలో పడింది సిఐడి. ఈ మేరకు సిఐడి అధికారులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ , రెవెన్యూ శాఖలకు లేఖలు రాశారు ... ఆ వివరాలు అందితే భాను ఆస్తుల విలువ తేలిపోతుంది ... మరోవైపు సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎన్ని సినిమాలకు భాను ఫైనాన్స్ చేశాడు ... శింగనమల, చిల్లర కళ్యాణ్ సహకారంతో సినిమా ఇండస్ట్రీలో భానుకు ఏర్పడ్డ పరిచయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ... ఇదీ భాను పోలీసులకు చెప్పిన వాగ్మూలం... ఈ వాగ్మూలం ప్రకారం భాను నేర చరిత్రకు... సూరి పరిచయం కంటే ముందే పునాదులు పడ్డాయని తెలుస్తోంది. అయితే ఆయన సంపాదించిన ఆస్తులెన్ని.. సినీ నటులతో ఉన్న సంబంధాలు ఎటువంటివి అనేది సీఐడీ పోలీసులే తేల్చాల్సి ఉంది.
..

Friday, April 27, 2012

బంగారు లక్ష మేన్ కు శిక్ష... శిక్ష వెనుక దాగిన కుట్ర


బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు సీబీఐ కోర్టు శిక్ష విధించింది. 11 ఏళ్ల క్రితం నకిలీ ఆయుధ డీలర్ల నుంచి ముడుపులు తీసుకుంటున్న వ్యవహారాన్ని తెహల్కా డాట్ కాం బయట పెట్టింది. ఇన్ని సంవత్సరాల తరువాత కోర్టు బంగారు లక్ష్మణ‌్ దోశిత్వాన్ని నిర్ధారించింది. ఈ అపరాదానికి గానూ బంగారు లక్ష్మణ్‌కు శిక్ష విధించింది. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు కటకటా వెనక్కు వెళ్లాల్సినంత నేరం ఏం జరిగింది. అసలు బంగారు లక్ష్మణ్ చేసిన నేరమేంటి.. కేసు పూర్వా పరాల పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం అది బీజేపీ దేశాన్ని పాలిస్తున్న సమయం.. కేంద్రంలో బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ అధ్యక్షస్థానంలో ఉన్న బంగారు లక్ష్మణ్ ఆయుధ డీలర్ల వద్ద నుంచి భారీగా ముడుపులందుకుంటున్నాడని ఓ న్యూస్ పోర్టల్ కు సమాచారం అందింది.. ఒక్క ఆయుధ వ్యాపార లావాదేవీల్లోనే కాక ఇతర కీలక ఒప్పందాల్లోనూబంగారు లక్ష్మణ్... లక్షల్లో లాగుతున్నాడని తెలుసుకుంది. ఆధారాల్లేకుండా ఆరోపణలతో వార్తలు రాయకుండా... అసలు నిజం రాబట్టాలని స్టింగ్ ఆపరేషన్‌కి దిగింది. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు. ఏకంగా ఎనిమిదిసార్లు ఆయుధ డీలర్ల అవతారంలో... విలేకరులు బంగారు లక్ష్మణ్‌తో భేటీ అయ్యారు. తాము వెస్ట్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులమని నమ్మబలికారు. భారత సైన్యానికి థర్మల్ హ్యాండ్ హెల్డ్ ఇమేజర్స్ సరఫరా చేసేందుకు వీలుగా రక్షణ మంత్రిత్వ శాఖను ఒప్పించాలని కోరారు. ఎనిమిది సార్ల భేటీ తరువాత బంగారు లక్ష్మణ్‌కు నమ్మకం కలిగి డీల్‌కు ఒప్పుకున్నారు. దీనికి గానూ అక్షరాలా లక్షరూపాయలు డిమాండ్ చేశారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న పాత్రికేయులు .. ఆ లక్ష.. లక్ష్మణ్ చేతిలో పెట్టారు. ఈ వ్యవహారమంతా బీజేపీ ప్రధాన కార్యాలయంలోనే జరిగింది. ముడుపులు ముట్టిన మరికాసేపట్లో దేశంలో సంచలన వార్త.. లంచం వ్యవహరం బయటపడగానే బంగారు లక్ష్మణ్ రాజీనామా చేశారు. 2001లో జరిగిన ఈ సంఘటనపై సిబిఐ ప్రత్యేక కోర్టు ఇన్నేళ్ల తర్వాత తీర్పు వెలువరించింది. అవినీతి నిరోధక చట్టం కింద బంగారు లక్ష్మణ్ కు శిక్ష విధించింది. కోర్టు తీర్పు విన్న బంగారు లక్ష్మణ్ నిశ్చేశ్చుడయ్యాడు. చాలా సేపు సాక్షుల బోనులోనే గడిపాడు. ఆయన పీఎస్ సత్యమూర్తి అప్రూవర్ గా మారడంతో... అయనకు కోర్టు క్షమాబిక్ష పెట్టింది. 2011 మే నెలలోనే బంగారు లక్ష్మణ్ పై అవినీతి ఆరోపణలు ఖరారయ్యాయి. ఈకేసుపై ఈనెల 2న విచారించిన కోర్టు తన తీర్పును రిజర్వులో వుంచింది. బోఫోర్స్ కేసులో దెబ్బ తిన్న కాంగ్రెస్ తీర్పు వెలువడిన వెంటనే బిజెపి పై విరుచుకుపడింది. అవినీతిపై అనర్గళంగా ఉపన్యాసాలిచ్చే బిజెపి ఓ సారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎద్దేవా చేసింది. అద్దాల మేడల్లో ఉన్నవాళ్లు ఇతరుల పై రాళ్లు విసరొద్దని హితవు పలికింది.

Thursday, April 26, 2012

భార్య శవంతో శృంగారం.. ఈజిప్ట్ లో శవ సంపర్కం.. చె/కొత్త చట్టం


భార్యంటే కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజ్యోషు మాతా అని వర్ణిస్తారు. ఏడడుగులు వేసిన రోజు నుంచి జీవితాంతం తోడు నీడగా నడిచిన భార్య తోడు బాసి పోతే ఆ శోకం తీరనిది. .. తన సహచరి రేపటి నుంచి కనిపించదన్న చేదు నిజం జీర్ణించుకోలేక కుమిలి కుమిలి ఏడ్చే క్షణాలవి. కానీ ఈ విషాద క్షణాల్లో కదలని కట్టెలాగా పడి ఉన్న భార్యతో శృంగారాన్ని అనుమతించాలని ఈజిప్ట్ సర్కారు కొత్త చట్టం తెస్తోంది. ఈ చట్టం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సర్కారు ఇదేమీ పట్టించుకోకుండా కొత్త వివాదానికి తెరలేపింది. ఈజిప్ట్ అంటేనే వింత ఆచారాలకు నిలయం.. పురాతన కాలం నుంచీ ఈజిప్టియన్ల ఆచారాలు, సంప్రదాయాలు ప్రపంచానికి భిన్నంగానూ, వింతగానూ ఉంటాయి. ఒక్కోసారి అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతకు ఆనవాలంగా కన్పిస్తే మరోసారి ఆటవిక జాతులు కూడా తలదించుకొనే అసభ్య ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. తాజాగా ఈజిప్ట్ సర్కారు రూపొందించిన చట్టం ఈ విషయాన్ని రుజువు చేస్తుంది. జీవితాంతం కష్టాల్లో... కన్నీళ్లలో తోడూ నీడగా నిలిచిన సహచరి అంతిమ సంస్కారానికి... ఈజిప్ట్ సర్కారు కొత్త సంప్రదాయం జత చేస్తోంది ... భార్య కాలం చెల్లాక కూడా ఆరు గంటల వరకు ఆమెను సంభోగ వస్తువుగా వాడుకునే హక్కును భర్తకు కల్పించేందుకు కొత్త చట్టం తెస్తోంది. వినడానికే కష్టంగా ఉన్నా ఇది వాస్తవం. భార్య చనిపోతే పుట్టెడు దు:ఖంతో ఉన్న భర్త శృంగారపుటాలోచనలు ఎలా చేస్తాడనే ఇంగితం లేకుండా ఈ ఆచారానికి తెరలేపుతోంది. పైగా ఈ చట్టానికి ఫేర్‌వెల్ ఇంటర్‌కోర్సు డ్రాఫ్ట్ లా అని పేరు పెట్టింది. చనిపోయిన భర్తతో శృంగారంలో పాల్గొనే భార్యకు హక్కు ఉందంటూ మెరాకో మత పెద్ద జామ్ జామీ గతంలో వ్యాఖ్యానించారు. ఇది దుస్సాద్యమే అయినా అప్పట్లో దుమారం లేచింది. మొరాకో మతపెద్ద మాటలను ప్రామాణికంగా తీసుకొని ఈజిప్ట్ రాజకీయ నాయకులు శవసంపర్క చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. ఈ చట్టం పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజాసమస్యలన్నీ గాలికి వదిలి అనైతిక చట్టాల పై దృష్టి సారించడం చూస్తే... ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పై ఉన్న విశ్వసనీయత ఏపాటిదని స్థానిక ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Wednesday, April 25, 2012

భారత్‌ పరువు తీసిన గణాంక సంస్థలు- అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది

మన్మోహన్ సర్కారు అసమర్ధ సర్కారని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. రాజకీయాలు మన్మోహన్ సింగ్ ను బలహీనుడిగా తయారు చేశాయి. కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రభ తగ్గింది. ఆర్ధికసంస్కరణల జోలికి పోకుండా ప్రజాకర్షక బడ్జెట్‌లతో ప్రభుత్వం నెట్టుకొస్తుందని ఏజన్సీలు ఎద్దేవా చేశాయి. దీంతో ఆర్ధిక వృద్ధి కుంటుబడటమే కాకుండా దేశం పూర్తిగా వెనకబడుతోందని అభిప్రాయపడ్డాయి. పరిస్థితిలో మార్పు రాకుంటే రేటింగ్ మరింత తగ్గిస్తామని ఏజన్సీలు హెచ్చరించాయి. మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇంతగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం వెనుక మర్మం ఏంటి అనే విషయం పై ప్రత్యేక కథనం. దేశ ఆర్ధిక పరిస్థితి.. దానికి కారణా పై అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు విశ్లేషణతో కూడిన హెచ్చరికలు చేశాయి. భారత ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోడానికి ఎంతో కాలం లేదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు బల్లగుద్ది చెప్పాయి. దీనికి కారణం మన్మోహన్ సర్కారేనని తేల్చాయి. ఆర్ధికాభివృద్ధి క్షీణించడానికి ప్రభుత్వ ఉదారవాద విధానాలు ఎలా దోహద పడ్డాయో విశ్లేషిస్తూ.. ఏజన్సీలు ప్రభుత్వ పనితీరును ఉతికారేశాయి. భారత ఆర్ధిక వ్యవస్థ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నది మన్మోహన్ సర్కారేనని ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజన్సీ మూడీస్ కుండ బద్దలు కొట్టింది. ఈ కారణాల వల్లనే ఉత్తర ప్రదేశ్ లో ఘోరంగా విఫలమైందని విశ్లేషించింది. 1990 దశకంలో మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్నపుడు ఆర్ధిక సంస్కరణలకు పెద్ద పీఠ వేయడంతో జీడీపీ 8 శాతం వృద్ధి రేటు సాధించిందని తెలిపింది. కానీ ప్రస్తుతం...అదే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండి కూడా గాడి తప్పుతున్న ఆర్ధిక వ్యవస్థను దారిలో పెట్టలేక పోతున్నారని విమర్శించింది. 2012 అర్ధ సంవత్సరానికి గానూ జీడీపీ వృద్ధి రేటు 6 శాతానికి పడిపోయినా ఆశ్యర్యం లేదని తెలిపాయి. దీనికి కారణం ప్రభుత్వ అసమర్ధత తప్ప మరోటి కాదని సంస్థలు విశ్లేషించాయి. కాంగ్రెస్ పార్టీని సమర్ధవంతంగా ముందుకు నడిపించగల నాయకుడే లేడని తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎన్ని గంటలు కష్టపడ్డా ఫలితం శూన్యమైందని.. దీనికి కారణం మన్మోహన్ ప్రభుత్వ విధానాలేనన్నాయి. మరోవైపు ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజన్సీ ఎస్ అండ్ పీ కూడా మూడీస్ రేటింగ్ ఏజన్సీతో గొంతుకలిపింది. తాము రేటింగ్ తగ్గించడానికి కారణం ప్రభుత్వ విధానాలే అని తేల్చిచెప్పింది. ఇంకా మరో అడుగు ముందుకేసి 2012-13 ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 5.3శాతం నమోదు కావచ్చని బాంబు పేల్చింది. ఆర్ధిక సంస్కరణల్లో పురోగతి లేకపోవడం వల్లనే తాము రేటింగ్ తగ్గించామని చెప్పుకొచ్చింది. దేశ ఆర్ధిక వ్యవస్థకు అధిక ద్రవ్యలోటు, భారీ రుణ భారాలు గొడ్డలి పెట్టుగా మారాయని ఎస్ అండ్ పీ సంస్థ విశ్లేషించింది. రానున్న సాధారణ ఎన్నికల వరకు ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేనందున సంస్కరణలు వచ్చే అవకాశం లేదు. ఫలితంగా పరిస్థితిలో పెద్ద మార్పు వచ్చే అవకాశం లేకపోవచ్చని తెలిపారయి దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రేటింగ్ సంస్థలు కొన్ని సూచనలు చేశాయి. సబ్సిడీలను తగ్గించుకోవాలని, సేవా పన్ను అమలు చేయాలని సూచించింది. బ్యాంకింగ్, భీమా రంగాల్లో విదేశీ భాగస్వామ్యాన్ని పెంచగలిగితే ఫలితాలు మెరుగవుతాయని అభిప్రాయపడింది. మరోవైపు ఉదారవాద విధానాలు విడనాడకుంటే రానున్న రోజుల్లో రేటింగ్‌మరింత తగ్గిస్తామని హెచ్చరించాయి. ఏజన్సీలు రేటింగ్ తగ్గించడం పై ఇటు ప్రభుత్వం, అటు ప్రతి పక్షాలు స్పందించాయి. భారత రుణ రేటింగ్‌ను ప్రతికూలంగా మార్చడం సరైన సమయంలో వచ్చిన హెచ్చరికగా భావించాలని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ప్రతిపక్ష బీజీపీ మాత్రం దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలవడానికి కారణం పాలనా పగ్గాలు, నిర్ణయాధికారం మన్మోహన్ సింగ్ చేతిలో లేకపోవడమే కారణమని విమర్శించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే మదుపర్ల విశ్వాసాన్ని కోల్పోయి భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించాయి.

Monday, April 16, 2012

వందేళ్ల సినిమాలో ఒడిదుడుకులు.. వందేళ్ల సినిమాకు వందనాలు




ఆ సాయంత్రం ముంబయిలోని ఒలంపియా థియేటర్ ముందు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఓ అద్భుతానికి పునాదులు పడబోతున్నాయి. అయితే అది విజయవంతంగా మారుతుందా లేదా అనేది అందరి మదినీ తొలుస్తున్న ఉత్కంఠ.. అక్కడ ఉన్న వారంతా ఒక చారిత్రాత్మక సంఘటనకు సాక్షులు. చిత్ర రూపకర్త దాదాసాహెబ్ ఫాల్కే తన ఎన్నో ఎళ్లుగా నిరీక్షిస్తున్న కలను సాకారం చేసుకోవడాన్ని అక్కడికి చేరిన ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. దాదాసాహెబ్ స్వదేశీ నిర్మిత పూర్తి నిడివిగల చిత్రాన్ని నిర్మించగలిగారు. ఇది చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది.
భారతీయ చలన చిత్రానికి వచ్చే శనివారానికి వందేళ్లు పూర్తవుతున్నాయి. సరిగ్గా ఏప్రియల్ 21, 1913 తేదీన రాజా హరిశ్చంద్ర చలనచిత్రం వెండి తెరపై వెలుగులు చిమ్మింది. కదిలే బొమ్మలను కళ్లముందు ఆవిష్కరించింది.
అయితే చలన చిత్రాన్ని తొలిసారిగా వెండి తెరకు పరిచయం చేసిన భారతీయుల్లో ఫాల్కే ఒక్కరే మొదటి వారు కాదు.. రాజా హరిశ్చంద్రకంటే ముందు పుండలిక్ చిత్రం విడుదలయింది. అయితే ఇది మొత్తం విదేశీ సాంకేతిక సిబ్బందితో... విదేశీయుల సహకారంతో తెరకెక్కింది. కానీ రాజా హరిశ్చంద్ర మాత్రం పూర్తి నిడివి భారతీయతతో ఉట్టి పడుతుంది.
భారతదేశం వలస పాలకుల ఉక్కు పాదాల కింద ఉన్న కాలంలో ఒక స్వదేశీ చిత్రం రావడం చాలా కష్టం. కానీ వెన్ను చూపని ధైర్యానికి తోడు.. కఠోర శ్రమ ఆ లక్ష్యాన్ని నెరవేరేలా చేసింది.
సినిమా తొలినాళ్లలో అందరినీ ఒక్కటి చేసింది. సినిమా చూస్తున్నంత సేపూ కలిమి లేముల ధ్యాసే లేదు. సినిమాకు ఒక సామాజిక బాధ్యత ఉండేది. ముందు వలసలో కూర్చునే వారు... బాల్కనీలో కూర్చునే వారు అనే తేడా ఉన్నప్పటికీ చిత్రాన్ని చూసి ఆనందించడంలో ఎటువంటి తేడా లేదు.. ఆ చీకట్లో తారతమ్యాలన్నీ కనిపించకుండా మాయమయ్యేవి.
స్వాతంత్ర్యానికి పూర్వం వచ్చిన చిత్రాలన్నీ దేశభక్తి ఉట్టిపడేలా తీసినవే.. అప్పటి చిత్రాల్లో క్రూరత్వం, నగ్నత్వం తక్కువగా ఉండటం వల్ల పెద్దగా సెన్సార్ అవసరం రాలేదు. కానీ తొలిసారి.. భక్త విధుర చిత్రం వివాదానికి తెరలేపింది... ఈ చిత్రం రాజకీయ కోణంలో తీసిన వివాదాస్పద చిత్రంగా భావించారు.


ప్రధాన చిత్రాలకు పాటలే ప్రాణం... ఒక్కోసారి ఈ సాహిత్యం సమాజాన్ని కదిలించేదిగా ఉండేది. 1943లో అశోక్ కుమార్ రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ కిస్మత్ ఓ సంచలనం.. అందులో దూర్ హఠో యే దునియా వాలా.. హిందుస్థాన్ హమారా.. అనే పాట.. వలస పాలకులకు ఓ సవాలుగా మారింది.
భారతీయ చలన చిత్రం కేవలం ఒక వ్యాపార దృక్పదంగా మిగల్లేదు. ఎక్కువ మంది నిర్మాతలు చలన చిత్రాన్ని ఒక బంగారు గుడ్లు పెట్టే బాతులా వినోదాత్మకంగా తీర్చి దిద్దడానికి ప్రాముఖ్యం ఇచ్చినా... శాంతారాం, మెహబూబ్‌ఖాన్, బిమల్‌రాయ్, అబ్బాస్ వంటి వారు సామాజిక కోణంలో ఉన్న చిత్రాలకే ప్రాముఖ్యతనిచ్చారు. సామాజిక సమస్యలను తెర పైకి ఎక్కించి వినోదాత్మకంగా రూపొందించి.. తాము చెప్పాల్సిన సందేశాన్ని సమాజానికి అందించే వారు. అంతేకాదు. వీరెవరూ తమ చిత్రాలు సమాజానికి ప్రతిబింబాలుగా ఉండాలని కోరుకోలేదు. తమ చిత్రాల ద్వారా ఏదో మార్పు రావాలని ఆశపడ్డారు. ఆ ఆశతోనే కులతత్వం పై, లింగ వివక్ష పై రకరకాల ప్రయోగాలు చేశారు.
భారతీయ చలన చిత్రంలో కొన్ని చిత్రాలు మైలు రాళ్లుగా నిలిచాయి. సత్యజిత్ రే తీసిన పథేర్ పాంచాలి చిత్రం 1956లో బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంట్ బహుమతికి ఎంపికయింది. మరుసటి ఏడాది అమిత్ శంబు మిత్రా రూపొందించిన జగ్తేరహో చిత్రం కార్లోవీ వ్యారీ చిత్రోత్సవంలో మొదటి బహుమతి గెలుచుకోవడంతో... భారతీయ దర్శకులకు తాము గొప్ప చిత్రాలను రూపొందించగలమనే ఆత్మస్థైర్యం పెరిగింది.
ఇండియన్ సినిమా శరవేగంగా అభివృద్ధి చెందింది... జాతీయ బాష నుంచి స్థానిక బాషల్లో కూడా చిత్రాలు తీయగలిస్థాయికి ఎదిగింది.. 1962లో మొదటి బోజ్‌పురి చిత్రం... గంగా మయ్యా థోహె పియరీ చదాహిబో.. విడుదలయింది. దీంతో ప్రాంతీయ బాషలు తమ మాండలికాల్లో భావోద్వేగాలను తెరకెక్కిండంలో విజయవంతం అయ్యాయి.
భారతీయ చిత్రం ఉత్తర భారతం.. దక్షిణ భారత ప్రాంతాలలో ఎవరికి వారు విభిన్న శైలిలో చిత్రాలు నిర్మించడం ప్రారంభించారు. 1950 మరియు 60 లలో వస్తున్న అధునాతన బాషా పద్దతులను అనుసరిస్తూ... జెమినీ, ఏవీఎం, ప్రసాద్ ప్రొడక్షన్స్ చిత్రాలను రూపొందించుకుంటూ వెళ్లాయి.. ఈ పాటలు గ్రాంఫోన్ నుంచి రేడియోలో వినడం.. వాటిని జాతి మొత్తం ఆలపించడం ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
ఇంతింతై వటుడింతై అన్న చందంగా భారతీయ చలన చిత్రం ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక చిత్రాలను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది.. ఇటు వ్యాపర పరంగా గానీ.. సాంకేతిక పరంగా గానీ ప్రపంచ చిత్రాలకు పోటీనిస్తోంది. అంతర్జాతీయంగా భారీ వసూళ్లు రాబడుతున్నాయి. త్రీ ఇడియట్స్ చిత్రం భారతదేశం వెలుపల పది మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. మైనేమ్ ఈజ్ ఖాన్ చిత్రం దక్షిణ కొరియాలో 2.6 మిలియన్లు వసూలు చేసింది. రోజు రోజుకూ సినిమా తన రూపం మార్చుకుంటోంది. పాటల చిత్రణలోనూ... చిత్రం నిడివిలోనూ.. తెరపై ఆవిష్కరించే విధానంలో.. శబ్ద మాధ్యమంలో వినూత్న మార్పులు వస్తున్నాయి.
వందేళ్ల భారతీయ చలన చిత్రం ఓ అద్భతం.. నాటి నుంచి నేటి వరకు ఎందరో కళాకారులు చిత్రలే లోకంగా బతికారు. ఎంజీఆర్, ఏఎన్నార్, యన్టీఆర్.. రాజ్‌కుమార్, అమితాబ్ బచ్చన్, ఉత్తమ్ కుమార్.. వంటి వారు తమ కలలను సాకారం చేసుకున్నారు. తెర పై మెరిసి తారలుగా చెలామణి అయ్యి లక్షలాధి అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు.. భారతీయ చలన చిత్రం మరిన్ని శతదినోత్సవాలు జరుపుకోవాలి... అందుకే భారతీయ చిత్రానికి శత సహస్రమానం భవతి చెబుదాం..

Saturday, April 14, 2012

నైజీరియాలో పుడితే ఎయిడ్స్ తప్పదా..?


దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ ప్రమాదకర స్థాయిలో విజృంబిస్తోంది. మొత్తం జనాభానే తుడిచేస్తుందా అనేంతటి భయంకర గణాంకాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా నైజీరియా అత్యున్నత అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా పుట్టిన శిశువుల్లో సుమారు 70 వేల మందికి హెచ్ఐవీ సోకినట్టు తేలింది. వీరితో బాటు అనేక మంది గర్భిణిలకు హెచ్ఐవీకి సంకేతంగా క్షయ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నట్టు తెలిపారు.
ఆఫ్రికాలో హెచ్ఐవీ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తుందనేది ఎప్పటి నుంచో వింటున్న విషయమే... కానీ తాజా అధ్యయనాలు చూస్తే వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. నైజీరియా ఉన్నతాధికారులు వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పుట్టిన పిల్లల్లో సుమారు 70 వేల మంది శిశువులకు పైగా హెచ్ఐవీతో జన్మించారని అధికారులు చెబుతున్నారు. దీంతో బాటు గర్బిణీల్లో చాలా మంది క్షయ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారని తేలింది.
అయితే క్షయ వ్యాధి హెచ్ఐవీకి సూచకంగా చెబుతారు. గర్భిణీలకు ఎక్కువ మందికి క్షయ ఉండటం హెచ్ఐవీకి సూచకంగానే భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే... రానున్న పది, ఇరవై ఏళ్లలో ఆఫ్రికాలో హెచ్ఐవీ మరణాలు ఎక్కువ సంఖ‌్యలో ఉండబోతున్నాయని అధికారులు చెబుతున్నారు. స్టేట్ యాక్షన్ కమిటీ ఆన్ ఎయిడ్స్ సంస్థ ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తోంది. నైజీరియా ప్రజలను చైతన్యం చేయడంలో వివిధ రకాల సంస్థలు కలిసి పనిచేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ‌్యంగా తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ సోకకుండా ఇంజక్షన్లు ఇప్పించడంలో చొరవ చూపాలని చెబుతున్నారు.

భౌషా ఇప్పుడు అంబేడ్కర్ కంటే... ఒక జార్జిరెడ్డి సమాజానికి అత్యవసరం



ప్రవహించే ఉత్తేజాలకు పురుడు పోసే ఉస్మానియా శిఖరంలో పుట్టిన ఉద్యమ ధృవతార జార్టిరెడ్డి... అణగారిన అట్టడువర్గాల ప్రతినిధి అంబేడ్కర్.. యాదృచ్ఛికంగా ఈ రోజే ( 14 ఏప్రియల్) జార్జిరెడ్డి వర్ధంతి, అంబేడ్కర్ జయంతి ఒకే రోజు రావడం వల్ల ఉద్యమ స్ఫూర్తి రగిలించే రోజుగా మిగిలింది.. వాస్తవానికి ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో అంబేడ్కర్ అవసరం ఇక లేదేమో అనిపిస్తుంది. అంటే దళిత బహుజనులు బాగుపడ్డారని... వెలివేత నుంచి.. అంటరాని తనం నుంచి బయట పడ్డారని కాదు... అంబేడ్కర్ లా ఆలోచించే చైతన్యం ఇప్పుడు ప్రతి దళితుడిలో వచ్చింది.. వెనకబడిన తరగతులు కూడా ఒక్కటవ్వాలని అప్పుడప్పుడు ఉద్యమ పిడికిళ్లు బిగిస్తున్నారు. కానీ ఎటొచ్చీ.. ఇప్పుడు ఉద్యమ ప్రస్థానంలో పిడికిలెత్తి బిగించి అన్యాయాన్ని.. రాజ్య దురహంకారాన్ని ప్రశ్నించగలిగే విద్యార్ధి మేథావులు కాస్త కరువయ్యారని కష్టంగానైనా చెప్పక తప్పని పరిస్థితి. క్యాంపస్ రిక్రూట్ మెంట్లు... కార్పోరేట్ కల్చర్ అభివృద్ధి చెందాక.. సమాజం గురించి.. దాని మనుగడ గురించి... ఆలోచించే తీరికా ఓపికా విద్యార్ధుల్లో తగ్గిందనే చెప్పాలి. ఆధునిక సమాజం నేర్పిన రకరకాల వ్యసనాల వల్ల కావచ్చు.. బ్రతుకుదెరువుకు బాండెడ్ లేబర్ గా మరిన వైనం కావచ్చు.. సలాం కొట్టే వాడికి వంగి సలాం కొట్టే వాడు పుడుతున్నాడు.. అందుకే ఇప్పుడొక జార్జిరెడ్డి కావాలి... ఉద్యమ కెరటాలను ఉప్పెనలా గుప్పించే ఉస్మానియాలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది.. కానీ దాన్ని ఒక్కతాటి పైకి తెచ్చి సామాజిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలబెట్టే నికార్సయిన నాయకుల కరువయ్యారు. నలభై ఏళ్లయినా మర్చిపోని నాయకుడు జార్జిరెడ్డి.. కానీ తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రస్తానంలో ఉస్మానియా గుండెకాయగా నిలిచింది.. కానీ తొలిదశలో ఉన్న నాయకులు ఇప్పుడెలా ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యం వేయక తప్పదు.. ఒక్క తెలంగాణ గురించే కాదు.. అవినీతి..నిర్లక్ష్యం... జవాబుదారీతనం లేని సమాజాన్ని మార్చేందుకు ఒక ఉద్యమ భావాలున్న మేథావి కావాలి.. జార్జిరెడ్డి చదువుకోకుండా... రాజకీయాల్లో తిరిగి నలుగుర్ని బాది విద్యార్ధి నాయకుడిగా చెలామణి అయిన వాడు కాదు.. నికార్సయిన మేథావి.. గోల్డ్ మెడలిస్టు.. ఇటు చరిత్రను సైన్సును, తత్వశాస్త్రాన్ని, మానసిక శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి.. వీటితో బాటు ప్రపంచ విప్లవ సాహిత్యాన్ని, గమనాన్ని మొత్తం విప్పి చెప్పగల మేథావి.. కానీ తన మేథావి తనాన్ని సమాజానికి కొంతైనా ఉపయోగించాలని తపన పడ్డ వ్యక్తి.. అయితే దురదృష్ట వశాత్తూ ఆయన హత్యగావింప బడిన తీరే తలుచుకుంటే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఇప్పుడు మేథావులు, లేరని కాదు.. కానీ వారి ఇంటెలెక్చువాలిటీ వారి అభివృద్ధికో లేక వారి కుటుంబానికి మాత్రమే పరిమితం అవుతుంది. సమాజం గురించి ఆలోచించేవారు అరుదయ్యారు.. ఆలోచించినా వారు మొదటి దశలోనే సమాజ తీరు.. వ్యక్తుల స్వార్ధ కుటిల తత్వాలను చూసి ఛీ అని వెనుతిరుగుతున్నారు. కానీ సమాజం పుట్టినప్పణ్ణుంచి ఇలాగే ఉందనే వాస్తవాన్ని గుర్తెరగలేకున్నారు. ఇప్పటి ఆధునిక వాతావరణమే కాదు.. నాటి పరిస్థితులు కూడా ఇంతే స్వార్ధపూరితంగా ఉన్నాయి. కానీ వాటిని కూడా ఛేదించి అర్ధం చేసుకొని జీవితాలను త్యాగం చేసిన విప్లవవీరులున్న జాతి మనది.. అందుకు ఇప్పుడు నిస్తేజంతో మునిగిపోయిన మన సమాజానికి ఒక జార్జిరెడ్డి కావాలి... విధ్యార్ధిలోకాన్ని ఆలోచింప జేసే ప్రవహించే ఉత్తేజం కావాలి.. చేగువేరా నుంచి జార్జిరెడ్డి స్ఫూర్తి పొందినట్టు... జార్జినుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది..